Gunde Ninda Gudi Gantalu Today Episode: వీడిన కోడిగుడ్ల మిస్టరీ.. మనోజ్, ప్రభావతి పరువు తీసిన బాలు.. ‘లక్కీ’గా మీనా

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 22 ఎపిసోడ్ లో మనోజ్ షాపు ముందు దొరికిన కోడి గుడ్ల మిస్టరీ తేలిపోయింది. దీంతో మనోజ్, ప్రభావతి పరువు తీస్తాడు బాలు. అటు మీనా ‘లక్కీ’గా మారిపోతుంది.

Published on: Apr 22, 2026, 07:46:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్, ప్రభావతి గుడిలో ఆకులు కట్టుకొని పరిహారం చెల్లించుకోవడం బాలు, మీనా చూస్తారు. అది వీడియో తీసి ఇంట్లో చూపిస్తుండగానే ఆ కోడిగుడ్ల వెనుక ఉన్న అసలు మిస్టరీ కూడా తేలిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Gunde Ninda Gudi Gantalu Today Episode: వీడిన కోడిగుడ్ల మిస్టరీ.. మనోజ్, ప్రభావతి పరువు తీసిన బాలు.. ‘లక్కీ’గా మీనా
Gunde Ninda Gudi Gantalu Today Episode: వీడిన కోడిగుడ్ల మిస్టరీ.. మనోజ్, ప్రభావతి పరువు తీసిన బాలు.. ‘లక్కీ’గా మీనా

రోహిణికి గట్టి వార్నింగ్ ఇచ్చిన మాణిక్యం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఏప్రిల్ 22) ఎపిసోడ్ రోహిణికి మాణిక్యం క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. మీ వల్ల నేను భయపడుతూ బతకాల్సి వస్తుందని మాణిక్యం నిందిస్తాడు. కొద్దిలో మీనా చూసేసేది.. సమయానికి ముఖానికి ముసుగుతో తప్పించుకున్నానని చెబుతాడు.

అక్కడి నుంచి షాపు తీసేయమని రోహిణి అంటే.. ఆమెపై తీవ్రంగా మండిపడతాడు. ఎప్పటి నుంచో అక్కడున్న షాపును మీ వల్ల తీసేయాలా.. చస్తే ఆ పని చేయను.. మరోసారి మీనా చూస్తే అసలు నిజం చెప్పేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. దీంతో రోహిణిలో టెన్షన్ మొదలై పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది.

మీనా కోసం విజిటింగ్ కార్డులు తీసుకొచ్చిన బాలు

మరోవైపు మెల్లగా తన వ్యాపారం పెంచుకుంటూ వెళ్తున్న మీనా కోసం బాలు విజిటింగ్ కార్డులు తీసుకొస్తాడు. వీటిని తాను కూడా తన కస్టమర్లకు ఇస్తానని, నీ బిజినెస్ బాగా అభివృద్ధి చెందాలని బాలు కోరుకుంటాడు. అది విని మీనా ఎమోషనల్ అవుతుంది. ఎక్కడో బండి మీద పూలు అమ్ముకునే తనను పెళ్లి చేసుకొని ఇలాంటి జీవితం ఇచ్చారంటూ బాలుకి థ్యాంక్స్ చెబుతుంది. రేపు గుడికి వెళ్దామని అనడంతో బాలు సరే అంటాడు.

గుడిలో మనోజ్, ప్రభావతి కొత్త అవతారాలు

ఇటు పరిహారం పేరుతో గుడిలో మనోజ్, ప్రభావతి కొత్త అవతారాల్లో కనిపిస్తారు. ప్రభావతి పసుపు రంగు చీర, మెడలో వేపాకులతో కనిపించగా.. అటు మనోజ్ అయితే ఒంటి మీద కేవలం వేపాకులే కట్టుకొని ఉంటాడు. తనతో ఇలాంటి పని చేయించినందుకు మనోజ్ పై ప్రభావతి తీవ్రంగా మండిపడుతుంది.

ఆ అవతారాల్లో ఆ ఇద్దరూ గుడి చుట్టూ ప్రదిక్షణలు చేస్తుంటారు. ఇది ఎవరైనా చూస్తే తనను ఏడిపిస్తారని ప్రభావతితో మనోజ్ అంటాడు. ఇక్కడికి ఎవరు వస్తారులే అని ఆమె అనగానే.. బాలు, మీనా కారులో అదే గుడికి వస్తారు.

మనోజ్, ప్రభావతిలను చూసి వీడియో తీసిన బాలు

గుడిలోకి వెళ్లిన బాలు, మీనా కొత్త వ్యాపారం ప్రారంభించామంటూ విజిటింగ్ కార్డులను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఇవ్వమని అడుగుతారు. అర్చన చేయిస్తారు. తర్వాత బయటకు వెళ్తుంటే మొదట మీనా.. మనోజ్, ప్రభావతిలను చూస్తుంది. తర్వాత బాలుకి చూపిస్తుంది. వీళ్లేంటి ఆదిమ మానవుల్లాగా మారిపోయారని బాలు అంటాడు. వెంటనే తన ఫోన్ లో వాళ్ల వీడియో తీస్తాడు.

ఇంట్లో ఆ వీడియో చూపించిన బాలు

ఇంటికి వెళ్లిన తర్వాత సత్యం, రవి, శృతిలకు ఆ వీడియో చూపించాలని బాలు అనుకుంటాడు. శృతిని ల్యాప్ టాప్ తీసుకురమ్మంటాడు. మనసారా నవ్వుకొని ఎన్ని రోజులైందని సత్యంను అడుగుతాడు బాలు. ఇది చూసిన తర్వాత అలా నవ్వుకుంటావని అంటాడు. అప్పుడే మనోజ్, రోహిణి, ప్రభావతి వస్తారు. అందరి ముందూ ఆ వీడియోను చూపించడంతో ప్రభావతి, మనోజ్ సిగ్గుతో తలదించుకోగా.. మిగిలిన అందరూ తెగ నవ్వుకుంటారు.

మనోజ్, ప్రభావతిలను నిలదీసిన సత్యం, బాలు

ఏంటిది అని ప్రభావతి, మనోజ్ లను సత్యం నిలదీస్తాడు. రాకెట్ యుగంలో ఇలాంటి పనులు చేయడమేంటి? వాడికి సిగ్గు లేదు.. ఆడదానికి నీకేమైంది.. ఇలా ఆకులు కట్టుకొని తిరగడమేంటి అని ప్రభావతిని సత్యం అడుగుతాడు. బాలు కూడా ఇద్దరినీ నిలదీస్తాడు. దీంతో జరిగిన విషయం చెబుతాడు మనోజ్. మనల్ని మించిన శక్తి ఏదో ఉందని అంటాడు. అది కేవలం దైవ శక్తి మాత్రమే.. ఇలాంటివి కాదు అని సత్యం స్పష్టం చేస్తాడు.

గుడ్ల వెనుక అసలు నిజం బయటపెట్టేసిన ఉద్యోగి

అప్పుడే మనోజ్ ను షాపు తాళాలు అడగటానికి అక్కడ పని చేసే వ్యక్తి వస్తాడు. తన షాపు ముందు గుడ్లు పెట్టారు కదా.. వీళ్లకు చెప్పు అని మనోజ్ అతన్ని అడుగుతాడు. అప్పుడు ఆ గుడ్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ను ఆ వ్యక్తి చెప్పేస్తాడు. వాటిని బాలుయే పెట్టాడా అని అంటే.. కాదు మన షాపు పక్కన ఏటీఎంలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే పెద్దాయన మనవడు చేశాడని అంటాడు.

ఆ రోజు రాత్రి గుడ్లు తీసుకొని వెళ్తుంటే వర్షం పడిందని షాపు ముందు ఆగారు.. అప్పుడే ఆ పిల్లాడు గుడ్ల మీద బొమ్మలు వేశాడట అని ఆ వ్యక్తి చెప్పడంతో మనోజ్ షాక్ తింటాడు. అది విని సత్యం, బాలు, మీనా, రవి, శృతి తెగ నవ్వుకుంటారు. దీంతో మనోజ్, ప్రభావతి పరువు పోతుంది.

మీనాను అడ్డుకున్న వ్యక్తి.. బాలుకి చెప్పిన మీనా

ఇటు పూలు ఇవ్వడానికి వెళ్లిన మీనా వెంబడి ఆ మిస్టరీ మ్యాన్ మళ్లీ పడతాడు. ఈసారి మీనాను అడ్డుకుంటాడు. మీరు చాలా బాగుంటారని, మీరు ఎదురుపడినప్పుడల్లా తనకు మంచి జరుగుతోందని చెబుతాడు. మీ పేరు ఏంటని అడుగుతాడు. మీనా చెప్పదు.

తాను ఓ పేరు పెట్టానని, అది లక్కీ అని అంటాడు. మళ్లీ కలుస్తానని వెళ్లిపోతాడు. దీంతో కంగారు పడిన మీనా.. బాలుకి ఫోన్ చేసి ఆ వ్యక్తి రోజూ తనను ఫాలో అవుతున్నాడని చెబుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More