Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి మరో కట్టు కథ.. తల్లినీ చంపి.. మనోజ్ను చితక బాదిన ప్రభావతి.. బాలులో డౌట్
Gunde Ninda Gudi Gantalu Serial August 12th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 12 ఎపిసోడ్ లో ఇంటికి తిరిగొచ్చిన రోహిణి మరో కొత్త కథ అల్లుతుంది. అయితే ఈసారి మనోజ్ ను కూడా చితకబాదిన ప్రభావతి మళ్లీ బుట్టలో పడినట్లు కనిపిస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో సత్యం తల్లి సుశీల పంచాయితీ పెట్టడంతో రోహిణి మరో కట్టు కథ అల్లుతుంది. అంతవరకూ ఆవేశంతో ఊగిపోయిన ప్రభావతి కాస్త కరిగినట్లు కనిపించగా.. బాలు, రవి మాత్రం మరో కొత్త కథ అల్లుతున్నావా అంటూ ముఖం మీదే కరిగి పాడేస్తారు.

రోహిణికి మనోజ్ ఫోన్.. దిగి వచ్చిన పార్లరమ్మ
సుశీల వచ్చి రోహిణికి ఫోన్ చేయమని మనోజ్ కు చెప్పే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 12) ఎపిసోడ్ ప్రారంభమైంది. మూడుసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని పార్లరమ్మ.. తర్వాత మాట్లాడుతుంది. మొదట మనోజ్ తో మాట్లాడటానికి బెట్టు చేస్తుంది. బామ్మ వచ్చిందని, ఇంటికి రమ్మంటోందని పిలుస్తాడు.
అంటే నువ్వు రమ్మనడం లేదా అని అడుగుతుంది. తర్వాత రోహిణి దిగి వస్తుంది. సరే వస్తానని చెబుతుంది. మళ్లీ ఇంటికి వెళ్లే అవకాశం రావడం నీ అదృష్టం.. వెంటనే వెళ్లు.. ఇంకొన్ని రోజులైతే నేను కూడా ఇంట్లో నుంచి వెళ్లగొడతానని విద్య కూడా అంటుంది.
ఆవేశంతో రగిలిపోయిన ప్రభావతి.. షాకిచ్చిన సుశీల
అటు కామాక్షి ఇంట్లో ఉన్న ప్రభావతి ఇంకా ఆవేశంతో ఊగిపోతూనే ఉంటుంది. రోహిణిని తలచుకుంటూనే తనకు కంపరం వస్తోందని చెబుతుంది. అయినా ఇదంతా నీ వల్లే అని మరోసారి కామాక్షిని నిందిస్తుంది. అప్పుడే సుశీల చెప్పడంతో సత్యం ఆమెకు ఫోన్ చేస్తాడు. ఇంటికి రమ్మని పిలిస్తే రానని మొండికేస్తుంది. మా అమ్మ వచ్చిందని చెప్పడంతో.. మీ ఆవిడ చచ్చింది అంటూ భయపడుతుంది. రోహిణి విషయం తేల్చడానికి వచ్చిందని సత్యం చెబుతాడు.
ఇది నాకు, నా కోడలికి సంబంధించిన విషయం.. ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదు అని ప్రభావతి అంటున్న సమయంలోనే ఫోన్ సుశీల తీసుకొని వింటుంది. అవునా అని సుశీల అనడంతో ప్రభావతి షాక్ తింటుంది. ఇంటి పరిస్థితి చక్కదిద్దాల్సింది పోయి నువ్వే అక్కడికెళ్లి కూర్చొంటే ఎలా అని క్లాస్ పీకడంతో వెంటనే వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
ఇంటికి వచ్చిన ప్రభావతి, రోహిణి.. రోడ్డుపైనే గొడవ
ఆ తర్వాత ప్రభావతి, రోహిణి ఒకేసారి ఇంటికి వస్తారు. తాను ఆటో దిగిన వెంటనే రోహిణి కూడా దిగడంతో ఆమెను చూడగానే ఆవేశంతో ప్రభావతి రగిలిపోతుంది. ఆటో అతను చిల్లర కావాలని అడుగుతాడు.
తన దగ్గర ఉన్నాయని రోహిణి అంటే.. నీలాంటి మోసగత్తె, అబద్ధాల కోరు దగ్గర చేయి చాచేంత ధీన స్థితిలో లేను.. మంచి మర్యాద తెలిసిన దాన్ని అని ప్రభావతి అంటుంది. చిల్లర అవసరం లేదు నువ్వే పెట్టుకో అని ఆటో అతనికి చెప్పి ప్రభావతి లోనికి వెళ్తుంది. ఆ వెంటనే రోహిణి కూడా వస్తుంది.
దిష్టి తీసి లోనికి ఆహ్వానించిన సుశీల, మీనా
ఇద్దరూ ఒకేసారి గుమ్మం దగ్గర కనిపించడంతో ఇంట్లో వాళ్లు షాక్ తింటారు. ప్రభావతిని కాస్త ఐస్ చేసేలా సుశీల మాట్లాడుతుంది. అసలే అందంగా ఉంటుంది.. పెళ్లిలో చక్కగా రెడీ అయి ఉంటుంది.. ముగ్గురు కొడుకులు, కోడళ్లతో కలిసి తిరగడం చూసి ఎంత మంది దిష్టి తగిలిందో.. కాస్త ఎర్ర నీళ్లతో దిష్టి తీయమని మీనాకు సుశీల చెబుతుంది. దీంతో ప్రభావతి కరుగుతుంది.
మీనా వెళ్లి దిష్టి తీసి ప్రభావతి, రోహిణిలను లోనికి ఆహ్వానిస్తుంది. ప్రభావతి లోనికి రాగా.. రోహిణి అక్కడే ఆగిపోతుంది. అది ఇంట్లోకి అడుగుపెట్టకూడదని మరోసారి తేల్చి చెబుతుంది. మనోజ్ ను పిలవమని సుశీల చెబుతుంది. ఆమె ఇంట్లోకి వస్తేనే కదా పంచాయితీ పెట్టేదని అంటుంది.
రోహిణిపై సుశీల పంచాయితీ షురూ.. ప్రభావతినే తప్పుబట్టి..
ఆ తర్వాత రోహిణిపై పంచాయితీ మొదలవుతుంది. నిజానికి తప్పు పెళ్లికి ముందే జరిగిందని సుశీల అంటుంది. కోట్లు ఉన్నాయని అనగానే ముందు వెనుకా చూడకుండా.. అమ్మాయి తల్లిదండ్రుల గురించి ఆరా తీయకుండానే పెళ్లి చేసుకోవడం తప్పు అంటూ ప్రభావతినే సుశీల తప్పుబడుతుంది. ఇప్పుడు ఆమె ఎలాంటిదైనా ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి పేరు నిలబెట్టాల్సిన మనిషి అని రోహిణి గురించి అంటుంది. ఆమె తప్పు చేసిన మాట నిజమే అయినా.. దానిని సరి చేయాలంటూ అసలు ఎందుకిలా చేశావని నిలదీస్తుంది.
రోహిణి మోసం గురించి చెప్పిన మీనా
దీంతో రోహిణి గురించి మీనా మొత్తం చెప్పేస్తుంది. ఆమె ముందే ఉన్న విషయం చెప్పేసి ఉంటే ఇంత వరకూ వచ్చేదే కాదు.. మలేషియా, కోట్ల ఆస్తులు అంటూ అత్తయ్యను మోసం చేసింది.. ఆమె నిన్ను చాలా నమ్మింది.. ఒక అబద్ధం దాచడానికి మరొకటి చెబుతూ అబద్ధాల కోటనే కట్టింది.. ఆ అబద్ధాలన్నీ వెంటాడాయి అని మీనా అంటుంది.
సుశీల ముందే రోహిణిని కొట్టిన ప్రభావతి
మీనా మాటలతో ప్రభావతిలో ఆవేశం మరోసారి తన్నుకొస్తుంది. దీంతో సుశీల ముందే మరోసారి రోహిణి దగ్గరికి వెళ్లి ఆమెను చితగ్గొడుతుంది. ఇంత మోసం చేసిన దానిని చూస్తేనే తన ఒళ్లు మండిపోతోందని అంటుంది. కానీ అప్పుడే మనోజ్ అడ్డు పడతాడు.
రోహిణి గురించి ముందే తెలుసున్న మనోజ్.. చితగ్గొట్టిన ప్రభావతి
రోహిణి గురించి తనకు ముందే నిజం తెలుసని అంటాడు. దీంతో అందరూ షాకవుతారు. ఇదో కొత్త నాటకమా అని బాలు, మీనా, రవి, శృతి అంటారు. ముందే తెలిస్తే రోహిణిని ఆ రోజే ఎందుకు కాపాడలేదు.. ఆంటీ కొడుతుంటే ఎందుకు అడ్డుకోలేదు అని శృతి నిలదీస్తుంది. కానీ మనోజ్ మాత్రం ఏమీ చెప్పడు. మాణిక్యం ఆమె మామ కాదని తనకు ముందే తెలుసని అంటాడు. తెలిసినా అమ్మకు ఎందుకు నిజం చెప్పలేదని బాలు అడుగుతాడు. దీంతో ప్రభావతి ఆవేశంతో మనోజ్ ను కూడా చితకబాదుతుంది. సుశీల చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గి వచ్చి కూర్చొంటుంది.
సర్ది చెప్పిన సుశీల.. మరో కట్టు కథ చెప్పిన రోహిణి
ఆ తర్వాత సుశీల అందరికీ సర్ది చెబుతుంది. ప్రభావతికే కాదు.. ఇంట్లో అందరికీ బీపీ పెరిగింది.. అందరూ అలాగే తయారయ్యారని క్లాస్ పీకుతుంది. అసలు ఎందుకిలా చేశావని రోహిణిని అడుగుతుంది.
దీంతో ఆమె మరో కట్టు కథ మొదలుపెడుతుంది. నేను మనోజ్ ను ప్రేమించాను.. అందుకే ఇలా చేశాను.. చిన్నతనం నుంచి ప్రేమ లేకుండా పెరిగాను.. పుట్టి పెరిగింది మలేషియాలోనే.. కానీ మా నాన్న పెద్ద తాగుబోతు.. మా అమ్మను కొట్టేవాడు.. వేరే వారితో సంబంధం పెట్టుకున్నాడు.. అమ్మను వేధించే వాడు.. తాగితాగి చనిపోయాడు.. ఆ బాధతో మా అమ్మ కూడా చనిపోయింది అని రోహిణి చెబుతుంది.
రోహిణి మరో కథ చెబుతోందని అందరిలోనూ అనుమానం వస్తుంది. ప్రభావతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇది మరో కథా అంటూ బాలు అడుగుతాడు. ఆమె మాటలను ఎవరూ నమ్మినట్లుగా అనిపించదు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


