Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ను చంపబోయిన బాలు.. ఏ కొడుకుకూ ఓ తల్లి వేయని శిక్ష వేసిన ప్రభావతి!
Gunde Ninda Gudi Gantalu Serial July 24th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 24 ఎపిసోడ్ లో మనోజ్ ను బాలు చంపబోతాడు. ఈ క్రమంలో చూపించే చిన్ననాటి సీన్లు ఎమోషనల్ చేస్తాయి. అయితే ఇంత గొడవ జరిగినా శృతి గేమ్ ప్లాన్ మళ్లీ అన్నదమ్ములను కలుపుతుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ బాగా ఎమోషనల్ గా సాగింది. ఓ కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా.. అన్నదమ్ముల మధ్య ఎన్ని పగలూ, ప్రతీకారాలు ఉన్నా.. మళ్లీ ఎలా కలిసి ఉండాలో చెబుతూ సాగింది. చంపేదాకా వెళ్లినా చివరికి మళ్లీ బాలు, మనోజ్ ఎలా కలిసిపోయారో ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు.

మనోజ్ను చంపడానికి వెళ్లిన బాలు
రాజేష్ విషయంలో బాలు, మనోజ్ గొడవ పడే సీన్ తో సీరియల్ శుక్రవారం (జులై 24) ఎపిసోడ్ మొదలైంది. గొడవ ముదరడంతో నన్ను చంపెయ్ రా.. చంపి జైలుకి వెళ్లు.. నీకు జైలుకి వెళ్లడం కొత్త కాదు కదా అని మనోజ్ అంటాడు. దీంతో అందరూ షాక్ తింటారు. అది విని ఆవేశంతో రగిలిపోయిన బాలుకి చిన్ననాటి జ్ఞాపకాలు వస్తాయి.
తన పెద్దన్నను మనోజ్ నీళ్లలోకి తోసి ఆ నింద బాలు మీద వేయడం, నిజం తెలుసుకోకుండా బాలుని కొట్టి ప్రభావతి పోలీసులకు అప్పగించడం గుర్తు చేసుకుంటాడు. దీంతో కిచెన్ లోని కత్తి తీసుకొని వచ్చి మనోజ్ ను పొడవబోతాడు. రవి, మీనా, శృతి ఎంత ఆపినా ఆగడు.
ప్రభావతికి మీనా, రవి క్లాస్
దీంతో ప్రభావతి, సత్యం పరుగెత్తుకుంటూ వస్తారు. బాలుని సత్యం ఆపుతాడు. అటు ప్రభావతికి బాలుగాడు నన్ను చంపడానికి వస్తున్నాడని మనోజ్ చెబుతాడు. ఏం జరిగిందని ప్రభావతి అడిగితే.. మీ బుద్ధులే మీ కొడుక్కి వచ్చాయి.. అప్పట్లో మా వాళ్లు తినడానికి ఇంటికి వస్తే అవమానించి పంపించారు.. ఇప్పుడు రాజేష్ అన్నయ్య వాళ్లు వస్తే మీ కొడుకు అలాగే చేశాడని మీనా అంటుంది. అదేంటని నిలదీస్తే.. చంపుతావా.. చంపు.. నీకు జైలుకు వెళ్లడం కొత్త కాదు కదా అన్నాడని రవి చెబుతాడు.
అన్న చావుకు తాను కారణం కాకపోయినా జైలుకెళ్లిన బాలు
అది విన్న బాలు మరింత ఎమోషనల్ అవుతాడు. జైలుకు వెళ్లిన తర్వాత సత్యం అతని దగ్గరికి వెళ్లి.. ఎందుకు మీ అన్నను నీళ్లలోకి తోసేశావని అడుగుతాడు. తాను తోసేయలేదని, మనోజ్ అన్నయ్యే తోసేశాడని చెబుతాడు. మరి ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదని సత్యం అడుగుతాడు. అది తెలిస్తే ఇప్పటికే తనను అసహ్యించుకుంటున్న అమ్మ .. మనోజ్ అన్నను కూడా దూరం చేస్తుందని, అందుకే చెప్పలేదని అంటాడు.
ప్రభావతి వేసిన శిక్ష
ఇదంతా గుర్తు చేసుకున్న సత్యం.. మనోజ్ కు క్లాస్ పీకుతాడు. వాడికి జైలు కొత్త కాదా.. ఒక్కసారి ఆ విషయం వాడి కళ్లలోకి చూసి చెప్పు అని నిలదీస్తాడు. అప్పుడే మనోజ్ కు ప్రభావతి క్లాస్ పీకుతుంది. నువ్వు వాడి జోలికి వెళ్లకు.. పాతికేళ్ల కిందటే ఓ తల్లి ఓ కొడుక్కి వేయని శిక్షను నేను వాడికి వేశాను.. ఇక చాలు.. వాడితో తలబడటం నీకు చేత కాదు.. అయితేనే వెళ్లు.. లేదంటే వాడు నిన్ను నిజంగానే చంపేస్తాడు అని చెప్పి వెళ్లిపోతుంది.
బాలును ఓదార్చిన సత్యం.. సర్ది చెప్పిన ప్రభావతి, సత్యం
ఆ తర్వాత బాలుని సత్యం ఓదారుస్తాడు. నీ బాధ నీ కన్న తల్లికి కూడా అర్థం కావడం లేదు రా.. వదిలెయ్ అని అంటాడు. బాలు భోజనం చేయకపోతే సత్యమే బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడే ప్రభావతి కూడా మనోజ్ ను తీసుకొని వస్తుంది. వాడు ఉంటే నేను తినను అని మనోజ్ అనడంతో బాలు లేచి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ప్రభావతి, సత్యం ఇద్దరూ వాళ్లకు సర్ది చెప్పి అందరూ కలిసి భోజనం చేసేలా చేస్తారు.
అన్నదమ్ముల మధ్య ఏదో రహస్యం ఉందన్న మీనా
ఆ తర్వాత కిచెన్ లో మీనాకు శృతి ఓ గేమ్ చూపిస్తూ నవ్వుతుంది. మీనా కూడా నవ్వుతుంది. అప్పుడే రోహిణి వచ్చి తమ గురించి మాట్లాడుకునే నవ్వుకుంటున్నారా అని అడుగుతుంది. ఇక ఈమె మారదు అనుకొని శృతి, మీనా అసలు తాము ఎందుకు నవ్వుతున్నామో చెప్పి ఆ గేమ్ చూపిస్తే ఆమె కూడా నవ్వుకుంటుంది. అయినా మనోజ్ ను బాలు చంపుతాననడం కరెక్ట్ కాదు కదా అని రోహిణి అంటుంది.
ఎప్పుడు ఏ మాట అన్నా కూడా ఈయన విని ఏదో ఒకటి అని వదిలేసే వారు.. ఈసారి మాత్రం ఎందుకలా చేశారో.. అన్నదమ్ముల మధ్య ఏదో రహస్యం ఉంది అని మీనా అనుమానపడుతుంది. అది వదిలేసి ఈ గేమ్ తో మళ్లీ అందరం కలుద్దాం అని శృతి అంటే.. వాళ్లు వినరు కదా అని మీనా అంటుంది. ఆ పని మనం ముగ్గురం చేయాలని అనడంతో వాళ్లు వాళ్ల భర్తల దగ్గరికి వెళ్తారు.
చిన్నతనంలో ఏం జరిగిందని బాలుని నిలదీసిన మీనా..
ఫ్యామిలీ మొత్తాన్ని కలపడానికి శృతి గేమ్ ప్లాన్ వేసి రవికి చూపిస్తుంది. వాళ్లు కూడా ఒప్పుకుంటే ఆడదామని రవి అంటాడు. మొదట బాలుకి మీనా ఇది చెబితే అతడు తిడతాడు. ఇంత జరిగాక వాడితో అస్సలు ఇలాంటివి చేయను అని అంటాడు. దీంతో అసలు ఏం జరిగింది? ఎందుకు అంత ఆవేశం మీకు.. అని మీనా నిలదీస్తుంది. కానీ బాలు మాత్రం నిజం చెప్పడు. సరే చెప్పకపోతే చెప్పకండి.. కానీ శృతి కోసం ఈ గేమ్ ఆడదామని బాలుని ఒప్పించి తీసుకెళ్తుంది.
మనోజ్కు క్లాస్ పీకిన రోహిణి.. గేమ్ కోసం ఒప్పించి..
అటు మనోజ్ కూడా తాను బాలు ఉంటే రాను అని అనడంతో రోహిణి క్లాస్ పీకుతుంది. నీకు కళ్లు పోయినప్పుడు ఆపరేషన్ కోసం బాలు, మీనానే చాలా కష్టపడి డబ్బు ఏర్పాటు చేస్తే అందులో 30 వేలు నొక్కేశావని అంటావా.. రాజేష్ వాళ్లు తినడానికి వస్తే నానా మాటలు అంటావా అంటూ క్లాస్ పీకుతుంది. మనం చదువుకున్నాం.. సంస్కారం ఉండాలి కదా అని అంటుంది. దీంతో తప్పు తెలుసుకున్న మనోజ్ సరే అంటాడు.
మూడు జంటల ఫన్నీ గేమ్.. మళ్లీ కలిసిపోయిన అన్నదమ్ములు
ఆ తర్వాత డాబా మీదికి వెళ్లిన మూడు జంటలు ఓ ఫన్నీ గేమ్ ఆడతారు. ఓ నిజమైనా, అబద్ధమైనా ఒకరి నుంచి మరొకరికి చేరే సమయంలో ఎలా మారుతుందో చెప్పే ఓ గేమ్ అది. అందరూ ఓ వైపుకి నిల్చొని ఉంటారు. మొదట శృతి ఓ చిన్న స్టెప్ వేసి మీనాకు చూపిస్తే.. ఆమె బాలుకి, బాలు రవికి, రవి రోహిణికి.. చివరిగా రోహిణి మనోజ్ కు వేసి చూపిస్తుంది. అయితే మనోజ్ వేసి స్టెప్పులు చూసి అందరూ గట్టిగట్టిగా నవ్వుకుంటారు. అసలు నేను వేసిన స్టెప్పు ఇదీ అంటూ శృతి చూపిస్తే.. మనోజ్ ను ఆటపట్టిస్తూ బాలు ఆడుకుంటాడు.
కొడుకులను చూసి మురిసిపోయిన ప్రభావతి, సత్యం
బాలు నవ్వు వినిపించి కింద పడుకున్న ప్రభావతి కంగారు పడుతుంది. సత్యంను నిద్ర లేపుతుంది. ఇద్దరూ పైకి వచ్చి చూస్తే అందరూ నవ్వుకుంటూ కలిసిపోవడం చూసి ప్రభావతి, సత్యం మురిసిపోతారు. అసలు ఏం జరిగింది.. పొద్దున చంపడాల వరకు వెళ్లిన మీరు ఇలా ఎలా కలిసిపోయారని ప్రభావతి అడుగుతుంది.
ఇదంతా శృతి ఐడియా అని మీనా చెప్పడంతో సత్యం ఆమెను మెచ్చుకుంటాడు. రెండు రోజుల్లో సుందరి పెళ్లి.. మనం పెళ్లి కూతురిని చేయడానికి వెళ్లాలి.. అందరం ఇలాగే కలిసి నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుందని అంటాడు. అప్పుడే అన్నదమ్ములు, తోటి కోడళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలా అని కూడా ప్లాన్ చేసుకుంటారు.
బాలు, మీనా రొమాన్స్.. మనోజ్కు రోహిణి తాయత్తు గిఫ్ట్
ఆ తర్వాత బాలు, మీనా ఓ వైపు రొమాన్స్ లో మునిగిపోతారు. పైన తన గిఫ్ట్ ఏదంటూ మనోజ్ అడగడంతో రోహిణి అతనికి ఓ తాయత్తు గిఫ్ట్ గా ఇస్తుంది. అది చూసి మనోజ్ షాక్ తింటాడు. ఇది నార్త్ నుంచి సౌత్ వరకు 108 గుడులలో మంత్రించిన తాయత్తు.. దీంతో నీ టైమ్ మారిపోతుందని రోహిణి అనడంతో అతడు చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ పిల్లల కనడం గురించి మాట్లాడుకుంటారు. అదే జరిగితే ఈ మలేషియా గోల కూడా తప్పుతుందని రోహిణి అనుకుంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


