గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: కాపాడమంటూ తల్లి కాళ్ల మీద పడిన మనోజ్.. మీనా నగలు దొంగిలించిన ప్రభావతి.. చూసిన సత్యం
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (అక్టోబర్ 29) ఎపిసోడ్ లో మనోజ్ అడ్డంగా బుక్కయిపోయి తల్లి ప్రభావతి కాళ్ల మీద పడతాడు. దీంతో ఆమె కొడుకును కాపాడుకోవడం కోసం మీనా నగలను దొంగతనం చేస్తుంది. అది సత్యం చూసేస్తాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 542వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఓవైపు బాలు, మీనా తమ గది కోసం పైసా పైసా జోడిస్తుండగా.. మరోవైపు దొంగల చేతిలో నిండా మునిగి కాపాడమంటూ తల్లి ప్రభావతి కాళ్ల మీద పడతాడు మనోజ్. ఈ ఎపిసోడ్ లో అదే పెద్ద ట్విస్ట్ గా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

రవి కాళ్లు పట్టడంపై శృతి, ప్రభావతి వాదన
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (అక్టోబర్ 29) ఎపిసోడ్ శృతికి రవి నెయిల్ పాలిష్ పెట్టడం ప్రభావతి చూసి వాళ్లను మందలించే సీన్ తో మొదలవుతుంది. ఇలా చేయడం తప్పు అంటూ శృతికి ప్రభావతి చెబుతుంది. భర్తను గౌరవించాలి.. ఇలా కాళ్లు పట్టించుకోవద్దని అంటుంది. కానీ శృతి మాత్రం ఇందులో తప్పేముంది.. కావాలంటే మీరు కూడా అంకుల్ తో నెయిల్ పాలిష్ పెట్టించుకోండి అని అనడంతో ప్రభావతి షాక్ తింటుంది. నీకైనా బుద్ధి ఉండాలి కదా అని రవిని తిట్టి ప్రభావతి వెళ్లిపోతుంది. అదంతా బాలు చూస్తాడు.
శృతి గురించి సత్యానికి చెప్పి బాధపడిన ప్రభావతి
అటు శృతి గురించి భర్త సత్యానికి వెళ్లి ఫిర్యాదు చేస్తుంది ప్రభావతి. ఆమె మరీ దారుణంగా వ్యవహరిస్తోందని, భర్తను రారా, పోరా అనడమే కాదు ఇప్పుడు కాళ్లు పట్టించుకొని, గోర్లకు పెయింట్ కూడా పెట్టించుకుంటోందని చెప్పి బాధపడుతుంది. వాళ్లు భార్యాభర్తలు, ఏదైనా చేసుకోనివ్వు.. జోక్యం చేసుకొని మాటలు పడకు అని సత్యం సూచిస్తాడు. కానీ ప్రభావతి మాత్రం మీరు వెళ్లి చెప్పండని పట్టుబడుతుంది. నేనూ నీలాగా మాటలు పడాలా నేను చెప్పను అని సత్యం అంటాడు. నీకు దీనికి పరిష్కారం కావాలంటే నేను బయటకు వెళ్లి వచ్చి చెబుతానని సత్యం వెళ్లిపోతాడు.
మీనాకు బాలు నెయిల్ పాలిస్.. ప్రభావతిని మరింత రెచ్చగొట్టి..
ఆ తర్వాత తల్లి ప్రభావతిని మరింత రెచ్చగొడదామని బాలు డిసైడవుతాడు. రవి దగ్గర తాను తెచ్చుకున్న నెయిల్ పాలిష్ ను మీనాకు పెట్టడానికి రెడీ అయి ఆమెను పిలుస్తాడు. ప్రభావతి ముందే మీనాను సోఫాలో కూర్చోబెట్టి.. ఆమె కాళ్లు పైకి పట్టుకొని నెయిల్ పాలిష్ పెడతాడు. ఆమె పాదాల మృదత్వాన్ని పొగుడుతూ తల్లిని మరింత ఉడికిస్తాడు. దీంతో ప్రభావతి అది చూసి మరింత ఉడుక్కుంటుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అడ్డంగా బుక్కయిన మనోజ్.. పోలీస్ స్టేషన్లో డబుల్ షాక్
అటు మనోజ్ తాను భారీగా సంపాదించేసినట్లుగా రోహిణికి ఫోన్ చేసి చెబుతాడు. గోవా వెళ్దామా, బ్యాంకాక్ వెళ్దామా అని అడుగుతాడు. ఆమె కాస్త తగ్గమని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మనోజ్ మంచి హుషారుగా ఉన్న సమయంలో విజిలెన్స్ అధికారులమంటూ ఇద్దరు వస్తారు. ఇంతకుముందు ఫర్నీచరు తీసుకెళ్లిన వాళ్లు మీకు డబ్బు ఇచ్చారా.. అది ఇవ్వండి అంటూ తీసుకొని అవి నకిలీ నోట్లు అని అంటారు. వాళ్లను దారిలో పట్టుకున్నామని, పోలీస్ స్టేషన్ కు వచ్చి మీ ఫర్నీచర్ తీసుకెళ్లమని చెప్పి డబ్బు తీసుకొని వెళ్లిపోతారు.
దీంతో మనోజ్ కంగారుపడుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అక్కడ జరిగిన విషయం చెబుతాడు. దీంతో ఎస్సైకి విషయం అర్థమవుతుంది. ఫర్నీచరు తీసుకెళ్లిన వాళ్లు, డబ్బు తీసుకెళ్లిన వాళ్లూ ఇద్దరూ దొంగలే అని.. వాళ్లను పట్టుకోవడానికే తాము ప్రయత్నిస్తున్నామని అంటాడు. దీంతో మనోజ్ దిమ్మదిరిగిపోతుంది. బిల్లు ఇచ్చావా అని అడిగితే ఇవ్వలేదంటాడు. అంటే బ్లాక్ మనీ తీసుకొని భారీగా సంపాదించేద్దామని అనుకున్నావా.. నిన్ను లోపలేయాలని అనడంతో మనోజ్ వేడుకుంటాడు. మళ్లీ అలా చేయనంటాడు. తన ఫర్నీచర్ సంగతి ఏంటని అడిగితే.. ఓ కంప్లైంట్ రాసిచ్చి వెళ్లమని ఎస్సై చెబుతాడు.
తల్లి కాళ్ల మీద పడిన మనోజ్
మనోజ్ తన పరిస్థితి ఏంటో తెలియక కంగారు పడతాడు. ఏకంగా రూ.4 లక్షలు మోసపోవడంతో లబోదిబోమంటూ ఇంటికి వచ్చి తల్లి ప్రభావతి కాళ్లపై పడతాడు. జరిగిన విషయం చెప్పి తాను మోసపోయానంటాడు. దీంతో ప్రభావతి అతన్ని తిడుతుంది. తనను ఆదుకోవాలని, నగలు ఇవ్వాలని అంటాడు. తన దగ్గర మీనా నగలు మాత్రమే ఉన్నాయని ఆమె అంటుంది. అవే ఇవ్వు అని అనడంతో ప్రభావతి మెల్లగా ఎవరూ చూడకుండా వెళ్లి బీరువాలోని మీనా నగలు దొంగిలిస్తుంది. అయితే అది సత్యం చూసేయడంతో ఆమె షాక్ తింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


