గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుడిలో నిజం ఒప్పుకున్న మనోజ్.. బాలు ప్లాన్ సక్సెస్.. ఎడాపెడా బాదిన ప్రభావతి, సత్యం
గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (నవంబర్ 21) ఎపిసోడ్ లో మనోజ్ మోసపోయిన విషయం ఇంట్లో తెలుస్తుంది. అయితే దానిని కవర్ చేయడానికి అప్పు తెచ్చానని అబద్ధం చెప్పినా.. బాలు వేసిన మరో ప్లాన్ తో గుడిలో అతడు నిజం చెప్పాల్సి వస్తుంది.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 559వ ఎపిసోడ్ లో బాలు ఇంట్లో మనోజ్ సినిమా చూపిస్తాడు. దీంతో అతడు రూ.4 లక్షలు మోసపోయిన విషయం తెలుస్తుంది. అయితే నగల విషయం బయటపడకుండా మనోజ్ ను చితకబాది అప్పు తీసుకున్నానని చెప్పేలా చేస్తుంది ప్రభావతి. అయినా బాలు వదలకుండా మరో ప్లాన్ వేసి మనోజ్ తో నిజం చెప్పిస్తాడు.

పోలీస్ స్టేషన్లో బాలు, రాజేష్
గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (నవంబర్ 21) ఎపిసోడ్ బాలు, రాజేష్ బీరువా కొనడానికి ఓ షాపుకి వెళ్లిన సీన్ తో మొదలవుతుంది. 50 శాతం డిస్కౌంట్ బోర్డు చూసి వెళ్తారు. కానీ అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ఈ ఫర్నీచర్ అంతా దొంగతనం చేసుకొచ్చిందంటూ వాటిని అమ్ముతున్నవారితోపాటు కొనడానికి వచ్చిన బాలు, రాజేష్ లను కూడా పోలీస్ స్టేషన్ ను తీసుకెళ్లి సెల్లో వేస్తారు. తమకు సంబంధం లేదని చెప్పినా వినరు. దీంతో బాలు ఆవేశంతో సెల్లోనే ఆ షాపు నడిపిస్తున్న మోసగాళ్లను కొడతాడు.
పోలీస్ స్టేషన్కు మనోజ్.. వీడియో తీసిన బాలు
ఆ తర్వాత ఒక్కో ఫర్నీచర్ షాపు యజమాని వచ్చి తమ సామాను తీసుకొని వెళ్తారు. అలాగే మనోజ్ కూడా వస్తాడు. తన ఫర్నీచర్ మాత్రం కనిపించడం లేదని చెబుతాడు. అది చూసిన బాలు షాకవుతూ.. ఇన్స్పెక్టర్ తో మనోజ్ మాట్లాడే వీడియో తీస్తాడు. తాను ఆ దొంగలకు ఏమేం ఫర్నీచర్ ఇచ్చానో లిస్టు చెబుతాడు.
అయితే అవన్నీ మంచి ఫర్నీచర్ కావడంతో త్వరగా అమ్ముడైపోయానని ఆ షాపు వాళ్లు చెబుతారు. దీంతో మనోజ్ అతన్ని కొడతాడు. మరి తన రూ.4 లక్షల సంగతేంటని అడుగుతాడు. ఇంట్లో మోసపోయానని చెప్పలేక.. ఇది అమ్మితే రూ.లక్ష లాభం వచ్చిందని చెప్పానని అంటాడు. అది విని బాలు షాక్ తింటాడు. అదంతా వీడియో తీస్తాడు.
ఇంట్లో బాలు పంచాయతీ.. దొరికిపోయిన మనోజ్
నిజం తెలియడంతో పోలీసులు బాలు, రాజేష్ లను వదిలేస్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాలు పంచాయతీ పెడతాడు. మనోజ్ ను వెనకేసుకు రావడానికి ప్రయత్నించిన ప్రభావతికి మరోసారి మీనా క్లాస్ పీకుతుంది. ఒక్క రోజులోనే రూ.లక్ష లాభం వచ్చిందని మీ ఆయన గురించి గొప్పగా చెప్పావు కదా పార్లరమ్మ.. కానీ మీ ఆయన మోసపోయిన విషయం నీకు తెలుసా అని బాలు అడుగుతాడు. రవి, శృతి కూడా ఆ మాట విని షాకవుతారు. తాము ఎక్కడ దొరికిపోతామో అని మనోజ్, ప్రభావతి కంగారు పడతారు.
మనోజ్ సినిమా చూపించిన బాలు.. చెంప పగలగొట్టిన సత్యం
అసలు ఏం జరిగిందో చెప్పమని సత్యం అనడంతో పోలీస్ స్టేషన్ లో తాను తీసిన వీడియోను బాలు అందరికీ చూపిస్తాడు. లాభం కాదు కదా రూ.4 లక్షలు నష్టపోయాడని పోలీసులకు మనోజ్ చెప్పడం ఆ వీడియోలో అందరూ చూస్తారు. రోహిణి సహా అందరూ అది చూసి షాక్ తింటారు. మనోజ్, ప్రభావతిలకు కూడా అతడు ఆ వీడియో చూపిస్తాడు. దీంతో వాళ్ల కంగారు మరింత పెరుగుతుంది. అది చూసి ఆవేశం కట్టలు తెంచుకున్న సత్యం.. మనోజ్ చెంప పగలగొడతాడు.
అప్పు తెచ్చానని అబద్ధం చెప్పిన మనోజ్
రూ.4 లక్షలు మోసపోతే.. మరి లాభం వచ్చిందని చెప్పి చూపించిన ఆ రూ.లక్ష ఎక్కడిది అని అందరూ అడుగుతారు. మీనా నగలు అమ్మితే వచ్చాయి కదా అని బాలు అంటాడు. సత్యం కూడా అదే అడుగుతాడు. అది విని వణికిపోయిన ప్రభావతి.. అతడు ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని భయపడి.. అతన్ని ఎడాపెడా బాదుతుంది. నీ వల్లే నేను మాటలు పడాల్సి వస్తోంది.. మోసపోయి ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు.. అప్పు చేశావా అని అడుగుతుంది. దీంతో మనోజ్ కూడా తన పార్క్ ఫ్రెండ్ దగ్గర అప్పు తెచ్చానని అబద్ధం చెబుతాడు.
ప్రభావతికి క్లాస్ పీకిన సత్యం
ఏం పెంపకమే నీదు.. నీవల్లే వీడు ఇలా తయారయ్యాడు.. ఛీ అంటూ ప్రభావతిని తిట్టి సత్యం వెళ్లిపోతాడు. మరోసారి మనోజ్ ను కొట్టి ప్రభావతి కూడా వెళ్లిపోతుంది. రోహిణి, మనోజ్ కూడా వెళ్లిపోయిన తర్వాత రవి, శృతి మరి ఆ డబ్బు అప్పు తెచ్చానని చెబుతున్నాడు కదా.. నగలు అమ్మినవేనా అని అడుగుతారు. ఆ నిజం బయటపడుతుందనే అమ్మ కావాలని వాడిని కొట్టి అప్పు తెచ్చాననే హింట్ ఇచ్చిందని అంటాడు.
ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాకపోవడంతో బాలు మరో ప్లాన్ వేస్తాడు. మరుసటి రోజు అందరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ బాలుకు తెలిసిన వ్యక్తి కనిపించడంతో అతన్ని కలిసి ఓ నాటకం ఆడాలని చెబుతాడు. అతడు సరే అంటూ ఒంటి మీదికి దేవుడు వచ్చినట్లుగా మనోజ్ రాగానే అందరినీ మోసం చేశావు కదా.. నాకు తెలుసు అంటూ ఎడాపెడా బాదుతాడు. నిజం చెప్పు అని అడుగుతాడు. దీంతో మనోజ్ నిజం చెబుతానని అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


