గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సంజూని చితకబాదిన బాలు.. మౌనిక కష్టాల గురించి చెప్పిన మీనా.. పుట్టింటికి దూరం
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (నవంబర్ 25) ఎపిసోడ్ లో బావ సంజూని బాలు చితకబాదుతాడు. దీంతో మౌనిక కష్టాలు రెట్టింపు అవుతాయి. ఆమె శాశ్వతంగా పుట్టింటికి దూరమయ్యే పరిస్థితి వస్తుంది.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 561వ ఎపిసోడ్లో గుడిలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో సంజూ రావడం, మౌనికను నానా మాటలు అనడం, అది చేసి బాలు అతన్ని చితకబాదే సీన్లతో సాగిపోయింది. అయితే మనోజ్ మాత్రం మరోసారి బతికిపోతాడు.

మనోజ్ మోసం బయటపెట్టడానికి గుడిలో బాలు ప్లాన్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (నవంబర్ 25) ఎపిసోడ్ అందరూ గుడికి వెళ్లే సీన్ తో మొదలవుతుంది. అయితే మనోజ్ బాగోతం బయటపెట్టడానికి గుడిలో తనకు తెలిసిన మనిషితో బాలు ప్లాన్ చేస్తాడు. మనోజ్ గురించి చెప్పి.. తాను చెప్పినట్లు చేస్తే రూ.1000 ఇస్తానంటాడు. ఆ వ్యక్తి సరే అంటాడు. దీంతో నగల గురించి నిజం బయటపడుతుందని బాలు అనుకుంటాడు.
మనోజ్ను చితకబాదిన బాలు మనిషి..ప్లాన్ చెడగొట్టిన భార్య..
బాలు చెప్పినట్లే ఆ వ్యక్తి పూనకం వచ్చినట్లుగా వేషమేస్తాడు. మనోజ్ ను చూడగానే అతన్ని చితకబాదుతాడు. నువ్వు నీ ఇంట్లో వాళ్లను, తోడబుట్టిన వాళ్లకు చేసిన మోసం నాకు తెలుసు.. నీకు ఇక్కడికి రావడానికి అర్హత లేదు అంటూ మనోజ్ ను కొడుతూనే ఉంటాడు. వద్దని ప్రభావతి అడ్డు పడినా వినడు. అతడు ఇవాళ నిజం చెప్పాల్సిందే అంటాడు.
దీంతో అందరూ షాక్ లో ఉండిపోతారు. ఇది తన ప్లానే అని మీనాతో బాలు చెబుతాడు. మనోజ్ నిజం చెప్పేస్తాడు చూడు అంటాడు. అతని బాదుడికి మనోజ్ కూడా చెబుతాను అంటూ ఏదో చెప్పబోతుండగా.. ఆ వ్యక్తి భార్య వచ్చి అతన్ని తిడుతుంది. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఇలా వేషం వేస్తావా అని అతన్ని కొడుతూ తీసుకెళ్తుంది.
మౌనికకు వార్నింగ్ ఇచ్చిన సంజూ.. రెచ్చగొట్టిన నీలకంఠం
ఇటు మౌనిక కూడా గుడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. సంజూ ఆమెకు గట్టి వార్నింగ్ ఇస్తాడు. గుడికి కాకుండా మీ ఇంట్లో వాళ్లను కలవడానికి వెళ్లావో ఏం చేస్తాను నాకే తెలియదంటూ హెచ్చరిస్తాడు. ఆమె వెళ్లిపోయిన తర్వాత నువ్వూ మీ నాన్నలాగే తయారయ్యావని తల్లి అంటుంది. అప్పుడే అతని తండ్రి నీలకంఠం ఎంట్రీ ఇస్తాడు. నీ పెళ్లాం ఎక్కడికి వెళ్లిందంటూ సంజూని అడుగుతాడు. ఆమె నీ కంట్రల్లో ఉందని అనుకోవడం నీ భ్రమ అంటూ సంజూని రెచ్చగొడతాడు.
మౌనిక గురించి నిజం బయటపెట్టిన నీలకంఠం
అంతేకాదు మౌనిక గురించి నిజం బయటపెడతాడు. మొన్న ఆమె గుడికి వెళ్లిందని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆమె ఏం చేసిందో చూడు అంటూ తన ఫోన్ లో ఉన్న ఫొటో చూపిస్తాడు. అందులో ఇంట్లో వాళ్లతో కలిసి బామ్మ పుట్టిన రోజు సందర్భంగా మౌనిక దిగిన ఫొటో ఉంటుంది. అది చూసి సంజూ ఆవేశంతో ఊగిపోతాడు. ఇప్పుడు కూడా గుడికి వెళ్లిందో లేక వాళ్ల పుట్టింటి వాళ్లను కలవడానికి వెళ్లిందో తెలుసుకో అని సంజూతో నీలకంఠం అంటాడు. మౌనిక శివాలయానికి వెళ్లిందని తెలుసుకొని అక్కడికి బయలుదేరుతాడు సంజూ.
ఫ్యామిలీని కలిసిన మౌనిక.. సంజూని కొట్టిన బాలు
అటు గుడిలో అనుకోకుండా ఫ్యామిలీని కలుస్తుంది మౌనిక. దీంతో అందరూ సంతోషిస్తారు. పుట్టింటి వారితో కలిసి ఆమె కార్తీక దీపాలు వెలిగించి కోనేటిలో వదులుతుంది. కార్తీకదీపం రోజు ఆడపడచుకు వాయనం ఇవ్వడానికి వాళ్లు సిద్ధమవుతారు. ఆమె చేతిలో పెడుతుండగా సంజూ వచ్చి ఆవేశంతో దానిని విసిరేస్తాడు.
దీంతో అందరూ షాకవుతారు. గుడికి అని చెప్పి మొన్న కూడా మీ ఇంటికి వెళ్లావు.. ఇప్పుడు కూడా మీ వాళ్లను కలవడానికి వచ్చావా అని నిలదీస్తాడు. అనుకోకుండా కలిశామని చెప్పినా వినడు. ఇలాగే రోజూ గుడికి అని చెప్పి వెళ్లి మీ ఇంటికే వస్తోందా లేక మరెవడి ఇంటికైనా వెళ్తుందా అని సంజూ అనగానే బాలు ఆవేశంతో ఊగిపోతాడు. సంజూని చితకబాదుతాడు.
గుడిలో బాలు చేసిన పనితో ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి అతన్ని నిలదీస్తుంది. దీంతో మౌనిక అత్తగారింట్లో పడుతున్న కష్టాల గురించి మీనా చెబుతుంది. అటు తనకు జరిగిన అవమానంతో మౌనికను పుట్టింటికి పంపించేస్తానని సంజూ అంటాడు. దీంతో మళ్లీ వాళ్లను కలవనని మౌనిక ప్రాధేయపడుతుంది. ఇక నుంచి మీ పుట్టింటి వాళ్లతో దూరంగా ఉండాలని సంజూ అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


