టీ20 వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫామ్ చేయబోయేది వీళ్లే.. రేపటి నుంచే మెగా టోర్నీ ప్రారంభం
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సంబరానికి ముంబై సిద్ధమైంది. శనివారం అంటే ఫిబ్రవరి 7న జరగనున్న ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ రాపర్ బాద్షా, నటి నోరా ఫతేహి, డ్రమ్స్ మాంత్రికుడు శివమణి ప్రదర్శన ఇవ్వనున్నారు. క్రికెట్ అభిమానులకు అటు ఆట, ఇటు పాటతో డబుల్ ధమాకా ఖాయం.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్డౌన్ ముగిసింది. రేపు అంటే ఫిబ్రవరి 7న ముంబై వేదికగా ఈ మెగా టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది. కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి ఐసీసీ ఒక ప్రత్యేక మ్యూజికల్ ఈవెంట్ను ప్లాన్ చేసింది.

ఓపెనింగ్ సెర్మనీలో తళుక్కుమనబోయేది వీరే..
శుక్రవారం (ఫిబ్రవరి 6) ఐసీసీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. టీ20 వరల్డ్ కప్ ఆరంభ వేడుకల్లో ప్రముఖ రాపర్ బాద్షా (Badshah), బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి (Nora Fatehi) ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు నియో-క్లాసికల్ మ్యూజిక్ సెన్సేషన్ రిషబ్ రిఖిరామ్ శర్మ (సితార్ విద్వాంసుడు), లెజెండరీ పర్కషనిస్ట్ శివమణి కూడా తమ ప్రదర్శనతో స్టేజ్ను దద్దరిల్లేలా చేయనున్నారు.
ఓపెనింగ్ సెర్మనీకి 60 వేల మంది
టీ20 వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ గురించి బాద్షా స్పందించాడు. "క్రీడలు, వినోదం కలిసిన ఈ ప్రపంచ పండుగలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. క్రికెట్ లాగే సంగీతం కూడా ప్రజలను ఏకం చేస్తుంది" అని అన్నాడు.
సితార్ విద్వాంసుడు రిషబ్ మాట్లాడుతూ.. "సితార్ను ఇలాంటి బోల్డ్ వేదికలపై చూడటం అరుదు. టీ20 వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీలో, అది కూడా శివమణి గారితో కలిసి 60,000 మంది అభిమానుల మధ్య ప్రదర్శన ఇవ్వడం నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి" అని ఉద్వేగంగా చెప్పాడు.
ఇండియా vs యూఎస్ఏ: టైటిల్ వేట మొదలు
ఈ మెగా టోర్నీలో భారత్ గ్రూప్-ఏలో ఉంది. దాయాది పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏ జట్లు ఇదే గ్రూప్లో ఉన్నాయి. ఫిబ్రవరి 7న ముంబైలో జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, యూఎస్ఏ (USA) జట్టుతో తలపడనుంది. ఈ నెల 15న పాకిస్థాన్ తో ఆడాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ ను పాక్ బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ టీమ్ మాత్రం మ్యాచ్ జరిగే కొలంబో వెళ్లనుంది. మరి పాక్ తన నిర్ణయం మార్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈసారి కప్ గెలిస్తే చరిత్ర సృష్టించినట్లవుతుంది. టీ20 వరల్డ్ కప్ టైటిల్ను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తుంది.
ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్.. మూడోసారి కప్ గెలిచి టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరిస్తుంది.
టీ20 వరల్డ్ కప్ భారత జట్టు (స్క్వాడ్): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

E-Paper












