అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయం.. ఆ నినాదంతో ముందుకు వెళ్లేలా ప్లాన్!
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు బన్నీ ఫ్యాన్స్. కిందిస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని చర్చించారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్(AAFA) రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్లో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. దాదాపు నాలుగు నుండి ఐదు గంటలు జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా జిల్లా మండల, పట్టణ స్థాయి కమిటీల ఏర్పాటు చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు.

హైదరాబాద్ సమావేశంలో ఎంపిక చేసిన ప్రతినిధులకు వారి పాత్రలు, బాధ్యతల గురించి స్పష్టంగా వివరించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు మరింత వ్యవస్థీకృతంగా, ప్రభావవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, పట్టణ స్థాయి కమిటీల ఏర్పాటుపై వివరణాత్మక చర్చలు జరిగాయి.
రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను సమన్వయం చేయడంలో, బలోపేతం చేయడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఫ్యాన్స్ చేసే సేవా కార్యకలాపాలను మరింత కిందిస్థాయికి తీసుకెళ్లేందుకు బన్నీ ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. కింది స్థాయిలో ఫ్యాన్స్ చేసే పనులపై దృష్టి సారిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేలా సామాజిక సేవా కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలతో అసోసియేషన్ ప్రాధాన్యతను పెంచేలా చూడాలని నిర్ణయించారు. అసోసియేషన్ చేపట్టే అన్ని కార్యకలాపాలు అల్లు అర్జున్ విలువలు, క్రమశిక్షణ, సానుకూల మార్పునకు నిబద్ధతను ప్రతిబింబించేలా ఉండాలని అనుకున్నారు. 'ప్రతి సంవత్సరం ఒక మంచి పని' అనే నినాదాన్ని అసోసియేషన్ను మరింత బలోపేతం చేయాలని బన్నీ ఫ్యాన్స్ చెప్పారు.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్లో ఎక్కువ భాగం ముంబైలో జరుగుతోందని తెలుస్తోంది. VFX స్టూడియోస్లో భారీ సెట్లు నిర్మించారని, అక్కడ అనేక కీలక సన్నివేశాలు తీస్తున్నారట. అక్కడే పాటలను చిత్రీకరించనున్నామని కూడా సమాచారం.

E-Paper












