Kamal Haasan: విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే నాకెందుకు అన్న కమల్ హాసన్.. ఎందుకంత ద్వేషమంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్
Kamal Haasan:
దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావడం, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడంపై నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. శుక్రవారం (మార్చి 20) మీడియాతో మాట్లాడిన ఆయన.. తన సినిమా, అలాగే రాజకీయ ప్రయాణం గురించి పలు విషయాలు పంచుకున్నారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తు గురించి చర్చలు జరుగుతున్న సమయంలో.. తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు కమల్ ఇచ్చిన సమాధానంపై విమర్శలు వస్తున్నాయి.

విజయ్ రాజకీయ ప్రవేశంపై కమల్ ఏమన్నారంటే..
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందట కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ఒక రిపోర్టర్ కమల్ను అడగ్గా.. ఆయన నవ్వుతూ.. "నాకెందుకు ఆ విషయం? నాకు బోలెడు పనులున్నాయి, వాటి మీద నేను ఫోకస్ చేయాలి" అని బదులిచ్చారు.
అలాగే తన సినిమాల గురించి చెబుతూ.. "ఎన్నికల తర్వాతే షూటింగ్ మొదలవుతుంది. నాకు రాజకీయపరమైన పనులు ఉన్నాయి. దాంతో పాటు సినిమాల్లో కూడా నటించాలి" అని రజనీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్లతో త్వరలో చేయబోయే తన కొత్త సినిమా గురించి చెప్పారు.
ఎందుకంత ద్వేషం అంటూ..
అయితే కమల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, చాలామంది ఆయనపై విమర్శలు చేశారు. తోటి నటుడు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు కమల్ పెద్ద మనసుతో కనీసం ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు కదా.. ఎందుకంత ద్వేషం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "మీ నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం" అని కొందరు సెటైర్లు వేస్తే, "ఇలాంటి పార్ట్ టైమ్ రాజకీయ నాయకులు ఇంతే" అని మరికొందరు విమర్శించారు.
మరోవైపు ఇటీవలే తమిళగ వెట్రి కజగం జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. రజనీకాంత్ను రాజకీయాల్లోకి రాకుండా డీఎంకే వాళ్లు బెదిరించారని ఆరోపించారు. నిజానికి 2020లోనే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు, కానీ ఆరోగ్య సమస్యల వల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ ఆరోపణలపై స్పందిస్తూ రజనీకాంత్.. "కాలం ఎప్పుడూ మాట్లాడదు, కానీ వేచి చూసి సరైన సమాధానం చెబుతుంది" అని ఒక నోట్ రిలీజ్ చేశారు.
డీఎంకేతో సీట్ల సర్దుబాటు..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో సీట్ల సర్దుబాటు గురించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని కమల్ స్పష్టం చేశాడు. "నేను ఇక్కడికి వచ్చింది దాని కోసమే, చర్చలు ఇంకా జరుగుతున్నాయి, ఫైనల్ అయ్యాక మీకందరికీ అప్డేట్ ఇస్తాను" అని ఆయన చెప్పారు.
మిత్రపక్షాలకు డీఎంకే తక్కువ సీట్లు ఇస్తోందన్న ప్రశ్నకు.. తనకు ఎన్ని సీట్లు వస్తాయన్నది ముఖ్యం కాదని, దేశం కోసం డీఎంకే కూటమి చాలా అవసరమని, అందుకే ఆ కూటమిలో కొనసాగుతున్నామని కమల్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి వ్యూహాలు ఉన్నాయనేది రాజకీయంగా ఎవరి అంచనాలకు వాళ్లు వదిలేయాల్సిందే.
రాజకీయాల్లోకి విజయ్.. వాయిదా పడిన 'జన నాయగన్'
తమిళనాడు రాజకీయాల్లో సినీ నటులకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఎంజీఆర్, జయలలిత, ఉదయనిధి స్టాలిన్, విజయకాంత్ లాంటి వాళ్లు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు అదే దారిలో విజయ్ కూడా ఏప్రిల్ 23న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తన పార్టీ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఆయన రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు కూడా చేస్తున్నారు.
అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' ఎన్నికల కంటే ముందు రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. హెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అసలైతే జనవరిలో పొంగల్ కే థియేటర్లలోకి రావాల్సింది.
కానీ సెన్సార్ బోర్డ్ అభ్యంతరాల వల్ల వాయిదా పడింది. ఇంకా సెన్సార్ పూర్తి కాకపోవడంతో బహుశా ఎన్నికల ఫలితాలు వచ్చాకే ఈ సినిమా రిలీజ్ కావొచ్చు. ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యాక, కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చన పట్నాయక్ ఇటీవల మీడియాతో చెప్పారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


