దీపిక డిమాండ్ చేసినదాంట్లో తప్పేమీ లేదు.. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు నా భర్త నా పిల్లలను చూసుకున్నాడు: కరీనా కపూర్
దీపికా పదుకోన్ చేసిన 8 గంటల షిఫ్ట్ డిమాండ్ లో తప్పేమీ లేదని కరీనా కపూర్, అనన్య పాండే అన్నారు. ఈ ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపిక డిమాండ్ కు మద్దతుగా నిలిచారు. ఈ డిమాండ్ వల్ల దీపిక రెండు పెద్ద సినిమాలను కోల్పోయిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకోన్ తన సినిమాల విషయంలో పెట్టిన ‘ఎనిమిది గంటల పని’ నిబంధన సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా సినిమా 'స్పిరిట్', అలాగే 'కల్కి 2898 AD' సీక్వెల్ నుండి ఆమె తప్పుకోవడానికి ఈ పని గంటల నిబంధనే కారణమని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్ ఖాన్, అనన్య పాండే స్పందిస్తూ దీపికాకు మద్దతుగా నిలిచారు.

నిర్మాతలతో ముందే మాట్లాడటం తప్పు కాదు: కరీనా కపూర్
'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ, పిల్లల పెంపకం, పని మధ్య సమతుల్యం పాటించడం ముఖ్యం అని చెప్పింది.
"నేను 'ది బకింగ్హామ్ మర్డర్స్' షూటింగ్ సమయంలో నా పిల్లల కోసం సమయం కేటాయించాలని నిర్మాతలకు ముందే స్పష్టం చేశాను. ఒక మహిళగా, తల్లిగా మనం ఎంత సమయం పని చేయగలమో ముందే చెప్పడంలో తప్పు లేదు. అయితే షూటింగ్లో అప్పుడప్పుడు అంచనాలు తప్పవచ్చు, దానికి తగినంత వెసులుబాటు కూడా ఉండాలి" అని కరీనా వివరించింది.
తాను ఈ మూవీ కోసం లండన్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు తన పిల్లలను భర్త సైఫ్ అలీ ఖాన్ చూసుకున్నాడని ఆమె చెప్పింది.
తల్లిగా ఆమె అవసరాలను గౌరవించాలి: అనన్య పాండే
దీపికాతో కలిసి పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "దీపికా తల్లి కాకముందు వర్క్షాప్లకు వస్తూ, ఎప్పుడూ ఎటువంటి ఫిర్యాదులు చేయకుండా కష్టపడేది. ఇప్పుడు ఆమె ఒక తల్లి. బిడ్డ ఎదుగుదల కోసం మొదటి రెండేళ్లు ఆమె సమయం కేటాయించాలనుకోవడంలో తప్పు లేదు. నిర్మాతలు, నటీనటుల మధ్య ఇటువంటి చర్చలు జరగడం వల్ల పనిలో సమతుల్యం వస్తుంది" అని అనన్య పేర్కొంది.
మరోవైపు మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ స్పందిస్తూ.. ఒకప్పుడు మలయాళ పరిశ్రమలో 16 గంటల షిఫ్ట్లు ఉండేవని, ఇప్పుడు అవి 12 గంటలకు తగ్గాయని చెప్పింది. అయితే సినిమా అనేది సృజనాత్మక రంగం కాబట్టి పనిని గంటలకు పరిమితం చేయడం ఒక్కోసారి కష్టమని ఆమె అభిప్రాయపడింది.
అసలు వివాదం ఏమిటి?
గతేడాది మే నెలలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' నుండి దీపికా తప్పుకుంది. లాభాల్లో వాటా, కేవలం 8 గంటల పని గంటలు కావాలని ఆమె కోరడం దర్శకుడికి నచ్చలేదని, అందుకే ఆమె స్థానంలో తృప్తి దిమ్రిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి.
ఇక సెప్టెంబర్ నెలలో 'కల్కి 2898 AD' సీక్వెల్లో కూడా దీపికా ఉండటం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. 25 శాతం రెమ్యూనరేషన్ పెంపుతో పాటు 7 గంటల పని దినం కోరడమే దీనికి కారణమని ప్రచారం జరిగింది.
దీనిపై నవంబర్లో ఒక ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. మానవ శరీరానికి, మెదడుకు ఎనిమిది గంటల పని సరిపోతుందని, పని ప్రదేశాల్లో తల్లులకు తగిన మద్దతు లభించాలని, పిల్లలను షూటింగ్ సెట్స్కు తీసుకురావడాన్ని సాధారణ విషయంగా చూడాలని కోరింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












