Made In Korea: ఓటీటీలోకి ఈరోజే వచ్చిన ఓజీ మూవీ హీరోయిన్ తమిళ డ్రామా చూశారా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎందుకు చూడాలంటే?
Made In Korea: కొరియన్ డ్రామాలంటే ఇష్టమే. అయితే మీకోసమే నెట్ఫ్లిక్స్ లోకి ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంకా మోహన్ నటించిన మేడిన్ కొరియా వచ్చింది. ఈ తమిళ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మరి దీనిని ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
పవన్ కల్యాణ్ ఓజీ మూవీతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న తమిళ నటి ప్రియాంకా అరుళ్ మోహన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'మేడ్ ఇన్ కొరియా' (Made in Korea) ఈ రోజే అంటే గురువారమే (మార్చి 12) ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కించిన ఈ సినిమా.. భారతీయ నేపథ్యానికి కొరియన్ టేకింగ్ను జోడించి రూపొందించిన ఒక అరుదైన ఇండో-కొరియన్ మూవీ. ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే ఈ మూవీ చూడొచ్చు.

తమిళ కథకు 'కే-డ్రామా' టచ్
ఇండియాలో కొరియన్ డ్రామాలకు (K-Dramas) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకుడు రా కార్తీక్ అదే ట్రెండ్ను ఒడిసిపట్టారు. తమిళ సంస్కృతిని, కొరియన్ స్టోరీ టెల్లింగ్ మేళవించి ఈ మేడిన్ కొరియా సినిమాను రూపొందించాడు. కే-డ్రామాల్లో ఉండే ఆ విజువల్ రిథమ్, సున్నితమైన భావోద్వేగాలు ఇందులో కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రేమ, విరహం వంటి అంశాలను చాలా 'లైట్'గా, హృదయానికి హత్తుకునేలా చూపించారు.
మనసును తాకే 'కమింగ్ ఆఫ్ ఏజ్' డ్రామా
తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి చెందిన శెన్బ (ప్రియాంక) అనే యువతి, తన కలల నగరమైన సియోల్ (కొరియా) కి వెళ్లినప్పుడు ఎదురైన అనుభవాలే ఈ సినిమా. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే కథ. నాటకీయమైన మలుపుల కంటే, సహజమైన సన్నివేశాలతో శెన్బ వ్యక్తిత్వ వికాసాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించారు.
ఇండో-కొరియన్ సంస్కృతుల కలయిక
ఈ సినిమాను తమిళనాడు, సియోల్ నగరాల్లో తీశారు. కేవలం పేరుకే కొరియన్ సినిమా కాదు, ఇందులో అక్కడి స్థానిక నటులు కూడా కీలక పాత్రలు పోషించారు. శెన్బ ప్రయాణంలో కొరియన్ పాత్రలు ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రెండు భిన్న సంస్కృతులను సమతుల్యం చేస్తూ ఈ కథ సాగుతుంది.
వాస్తవానికి దగ్గరగా ఉండే రచన
దర్శకుడు రా కార్తీక్ రాసిన డైలాగులు, తీసుకున్న నిర్ణయాలు సినిమాను చాలా హుందాగా మలిచాయి. ఒక మహిళ తన ఉనికిని చాటుకోవడం, మోసం చేసిన మాజీ ప్రియుడిని తిరస్కరించడం, అపరిచితుల్లో కుటుంబాన్ని వెతుక్కోవడం వంటి అంశాలు నేటి తరానికి బాగా కనెక్ట్ అవుతాయి. ప్రోగ్రెస్సివ్ అని బయటకు చెప్పుకోకపోయినా, శెన్బ తీసుకునే నిర్ణయాలు చాలా పరిణతితో ఉంటాయి.
ప్రియాంకా మోహన్ వన్-వుమన్ షో
శెన్బ పాత్రలో ప్రియాంకా అరుల్ మోహన్ ఒదిగిపోయింది. ఆమె అమాయకత్వం, భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలం. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఈ సినిమాలో తన నటనతో శెన్బ ప్రయాణాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందేలా చేసింది. రిషికాంత్, జెన్సన్ దివాకర్, కొరియన్ నటులు పార్క్ హై-జిన్, నో హో-జిన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే అడుగుపెట్టడం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


