నా మాజీ భార్య, మీడియా, పోలీసులే నాపై కుట్ర పన్నారు.. ఇవాళ కోర్టులో అవన్నీ పటాపంచలయ్యాయి: మలయాళ నటుడి కామెంట్స్
మలయాళం నటుడు దిలీప్ కు పెద్ద ఊరట లభించింది. తనపై ఉన్న నటి లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అతడు.. తన మాజీ భార్య, నటి మంజు వారియర్, ఓ వర్గం మీడియా, కొందరు పోలీసులే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించాడు.
కేరళలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ (Dileep) సోమవారం (డిసెంబర్ 8) నిర్దోషిగా విడుదలయ్యాడు. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పు తర్వాత బయటకు వచ్చిన దిలీప్.. తన మాజీ భార్య, నటి మంజు వారియర్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ కేసులో తాను నిందితుడిని కాదని, "నిజమైన బాధితుడిని" తానేనని వ్యాఖ్యానించాడు.
నా మాజీ భార్య, మీడియా, పోలీసులే నాపై కుట్ర పన్నారు.. ఇవాళ కోర్టులో అవన్నీ పటాపంచలయ్యాయి: మలయాళ నటుడి కామెంట్స్
మంజు వారియర్ వల్లే ఇదంతా..
లైంగిక వేధింపుల కేసులో తాను నిర్దోషిగా తేలిన తర్వాత మలయాళ నటుడు దిలీప్ మీడియాతో మాట్లాడాడు. కోర్టు బయట రిపోర్టర్లతో మాట్లాడుతూ.. తన ఇమేజ్ను, కెరీర్ను నాశనం చేయడానికే తన పేరును ఈ కేసులోకి లాగారని దిలీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.
"నా కెరీర్, ఇమేజ్, సమాజంలో నాకున్న గౌరవాన్ని దెబ్బతీయడానికే ఇదంతా చేశారు. అసలు ఈ కేసులో ఏదో కుట్ర దాగి ఉందని అందరికంటే ముందు చెప్పింది మంజు వారియరే. ఆమె ఆ మాట చెప్పినప్పటి నుంచే నాపై కుట్ర మొదలైంది" అని దిలీప్ ఆరోపించాడు.
అంతేకాకుండా ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఒక 'మహిళా పోలీస్ అధికారిని', కొంతమంది 'క్రిమినల్ పోలీసులను' ఆమె స్వయంగా ఎంచుకుందని దిలీప్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు.
పోలీసులు అబద్ధపు కథ అల్లారు
పోలీసులు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీతో కుమ్మక్కై తనపై తప్పుడు కథనాన్ని సృష్టించారని దిలీప్ ఆరోపించాడు. "పోలీసులు ప్రధాన నిందితుడు, అతని జైలు స్నేహితులతో కలిసి నాపై ఒక ఫేక్ స్టోరీని తయారు చేశారు. కొంతమంది మీడియా వాళ్ళ సాయంతో ఆ అబద్ధాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ ఈ రోజు కోర్టులో ఆ అబద్ధపు కథ బద్దలైంది" అని దిలీప్ అన్నాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, లాయర్లకు, అభిమానులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు.
అసలు కేసు ఏంటి?
ఇది సుమారు 9 ఏళ్ల కిందటి కేసు. ఫిబ్రవరి 17, 2017న కేరళలో ఒక ప్రముఖ నటి ప్రయాణిస్తున్న కారులో కొందరు వ్యక్తులు చొరబడి, రెండు గంటల పాటు ఆమెను నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. దిలీప్కు మరో నటితో ఉన్న సంబంధం గురించి బాధితురాలు.. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్కు చెప్పిందనే కోపంతో, పగ తీర్చుకోవడానికి దిలీప్ ఈ దాడి చేయించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
అయితే దీనిపై ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి హనీ ఎం వర్గీస్ సోమవారం (డిసెంబర 8) తీర్పునిస్తూ.. ప్రధాన నిందితుడు పల్సర్ సునీతో సహా ఆరుగురిని దోషులుగా తేల్చారు. సరైన సాక్ష్యాలు లేనందున దిలీప్ సహా మరో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు.