ఓటీటీలోకి మరో మలయాళం హారర్ కామెడీ మూవీ.. మనిషి శరీరం గుర్రం కాళ్లు.. ఊళ్లో వింత జీవి
మలయాళ యువ నటుడు మాథ్యూ థామస్ నటించిన హారర్ కామెడీ మూవీ 'నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్' డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 6 నుంచి జీ5 (Zee5) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గ్రామంలో తిరిగే ఓ వింత జీవి చుట్టూ అల్లుకున్న ఈ కథేంటో చూడండి.
హారర్ కామెడీ జానర్ సినిమాలు ఏ భాషలో వచ్చినా వాటికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులోనూ మలయాళం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన సర్వం మాయ ఎంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూశాం.

ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన మలయాళ మూవీ ఒకటి ఓటీటీ విడుదలకు రెడీగా ఉంది. యువ నటుడు మాథ్యూ థామస్ ('కుమ్మల్లాంగి నైట్స్', 'లియో' ఫేమ్) ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ 'నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్' (Nellikkampoyil Night Riders) స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ స్ట్రీమింగ్ వివరాలు
నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ అనే ఈ మలయాళ హారర్ కామెడీ సినిమా ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 6 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'జీ5' (Zee5)లో అందుబాటులోకి రానుంది. ఓటీటీప్లే ప్రీమియం ద్వారా కూడా దీనిని చూడొచ్చు. మలయాళ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్టైటిల్స్ అందుబాటులో ఉంటుంది. అయితే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉంటుందా లేదా అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ఈ మూవీ కథేంటి? ఆ వింత జీవి ఏంటి?
నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ ఓ డిఫరెంట్ హారర్ కామెడీ. ఒక గ్రామంలో అకస్మాత్తుగా ఒక వింత జీవి సంచరించడం మొదలవుతుంది. దానికి మనిషి శరీరం, గుర్రపు కాళ్లు ఉంటాయి. దీంతో ఊర్లో భయాందోళనలు మొదలవుతాయి. అసలు ఆ జీవి ఏంటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? అని తెలుసుకోవడానికి శ్యామ్ (మాథ్యూ థామస్) అనే యువకుడు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ.
గతేడాది అక్టోబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. పెద్దగా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయినా.. ఓటీటీ ఆడియెన్స్ను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత ఇది డిజిటల్ స్క్రీన్పైకి వస్తోంది.
నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ మూవీ విశేషాలు
నౌఫల్ అబ్దుల్లా దర్శకత్వం వహించిన ఈ నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ మూవీలో మాథ్యూ థామస్తో పాటు రోషన్ షానవాస్, శరత్ సభ, విష్ణు అగస్త్య, మీనాక్షి ఉన్నికృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. విశేషమేమిటంటే దర్శకుడు నౌఫల్ ఈ సినిమాకు ఎడిటర్గా కూడా పనిచేశాడు.
ప్రస్తుతం మలయాళంలో 'ప్రకంపనం', 'సర్వం మాయ' వంటి హారర్ సినిమాలు సందడి చేస్తున్న తరుణంలో.. ఈ 'నైట్ రైడర్స్' ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టి నవ్విస్తుందో చూడాలి. మరోవైపు మాథ్యూ థామస్ నటించిన మరో సినిమా 'సుఖమానో సుఖమాను' ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


