మోహన్లాల్ ఎపిక్ ఫాంటసీ థ్రిల్లర్ రిలీజ్ ఆ రోజే.. వృషభ మూవీపై భారీ హైప్
మోహన్లాల్ ఫాంటసీ యాక్షన్ డ్రామా వృషభ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఎపిక్ ఫాంటసీ థ్రిల్లర్ పై భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, పౌరాణిక అంశాల కలయికతో రూపొందింది.
2025లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమాల్లో వృషభ ఒకటి. మోహన్లాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా అభిమానులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు వృషభ మేకర్స్ అనౌన్స్ చేశారు. మూవీ షూటింగ్ ప్రకటించినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్న ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, పౌరాణిక అంశాలు, భావోద్వేగాల కలయికతో ఒక గ్రాండ్ ఎమోషనల్ గాథగా తెరకెక్కింది.

వృషభ రిలీజ్ డే
ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మోహన్లాల్ ఒక సరికొత్త వీడియోను విడుదల చేశారు. ఇందులో సినిమాలోని అద్భుతమైన విజువల్స్, ఆయన శక్తివంతమైన యోధుడి అవతార్ను చూపించారు. ఈ క్లిప్ను పంచుకుంటూ ఆయన ఇలా రాశారు. “కొన్ని కథలు సినిమా కంటే ఎక్కువ. అవి వారసత్వాలు. ఈ క్రిస్మస్కు ఆ వారసత్వం వృషభ రూపంలో గర్జిస్తూ జీవం పోసుకోవడాన్ని చూడండి. భావోద్వేగం, వైభవం, విధిని సెలబ్రేట్ చేసే చిత్రం. డిసెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది” అని పోస్టు చేశారు.
దీంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, ఇది మోహన్లాల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటని కామెంట్లు చేస్తున్నారు.
విడుదల తేదీ మార్పు
వృషభ చిత్రం వాస్తవానికి నవంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. కానీ మెరుగైన పోస్ట్-ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం తేదీని వాయిదా వేశారు. అంతకుముందు, అక్టోబర్లో మోహన్లాల్ ఒక ఆకట్టుకునే పోస్టర్, టీజర్ను విడుదల చేస్తూ.. “నిరీక్షణకు తెరపడింది, నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా ఇది. వృషభ ప్రపంచంలోకి స్వాగతం. టీజర్ కేవలం ఒక చిన్నది మాత్రమే.. అసలైన ఆశ్చర్యం వేచి ఉంది” అని రాశారు.
వృషభ గురించి
కన్నడ చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నంద కిషోర్ 'వృషభ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. షనయా కపూర్, జహ్రా ఎస్ ఖాన్, రోషన్ మేక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలాజీ టెలిఫిల్మ్స్ పతాకంపై ఏక్తా ఆర్ కపూర్, శోభా కపూర్, కనెక్ట్ మీడియా, ఏవీఎస్ స్టూడియోస్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ కథను నంద కిషోర్ రాశారు. ఇది ఒక ఎమోషనల్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామాగా రూపొందింది. ఈ చిత్రం తెలుగు, మలయాళంలో ఒరిజినల్గా, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లలో విడుదల కానుంది.













