Nag Ashwin: యాక్షన్, ఫైట్లు కాదు.. ఆ సీన్లు మనసుకు చాలా గట్టిగా తాకాయి: ధురంధర్ 2పై నాగ్ అశ్విన్ రివ్యూ
Nag Ashwin: ధురంధర్ 2 మూవీకి మరో తెలుగు టాప్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమాలో తనకు బాగా నచ్చినవి ఏవో చెబుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో అతడు ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది.
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్, విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. రెండో వారంలోనూ అదే జోరును కొనసాగిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2పై తాజాగా మరో తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ తన రివ్యూ ఇచ్చాడు.

నాగ్ అశ్విన్ రివ్యూ: భావోద్వేగాలే ఈ సినిమా బలం
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ 'కల్కి 2898 AD'ని ఆవిష్కరించిన దర్శకుడు నాగ్ అశ్విన్.. తాజాగా 'ధురంధర్ 2'పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సినిమాలోని యాక్షన్ సీన్ల కంటే అందులోని ఎమోషన్ తనను బాగా ఆకట్టుకుందని అతడు పేర్కొన్నాడు.
"దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభ ధురంధర్ 2 ఆరంభంలోనూ, ముగింపులోనూ అద్భుతంగా మెరిసింది. భారీ యాక్షన్ సీక్వెన్స్లు, ఎక్స్ప్లోజన్ల కంటే కూడా.. ఆ తల్లి కౌగిలింత, ఆ ప్రేమ కోసం తపించే కొడుకు ఆవేదన నా మనసును బలంగా తాకాయి" అని నాగ్ అశ్విన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
నటుడిగా రణవీర్ సింగ్ ప్రతిభను కొనియాడుతూ.. "రణవీర్ ఎప్పుడూ తన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తాడు. ప్రతి సినిమాతోనూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచినందుకు టీమ్ మొత్తానికి అభినందనలు" అని నాగ్ అశ్విన్ ప్రశంసించాడు.
రికార్డుల వేటలో 'ధురంధర్ 2'
వసూళ్ల పరంగా ఈ సినిమా సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. 12 రోజులు ముగిసే సమయానికి దేశీయంగా రూ. 872 కోట్ల నెట్ (రూ. 1042 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో 'పుష్ప 2', 'బాహుబలి 2' తర్వాత అత్యధిక దేశీయ వసూళ్లు సాధించిన మూడో సినిమాగా ధురంధర్ 2 నిలిచింది. ఓవర్సీస్ మార్కెట్లోనూ 'షోలే', 'బాబీ' వంటి క్లాసిక్ సినిమాల రికార్డులను రణవీర్ సింగ్ అధిగమించడం విశేషం.
స్పై నుంచి కింగ్పిన్ వరకు..
ధురంధర్ మొదటి భాగంలో పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న లియారీ గ్యాంగుల్లోకి చొరబడే భారతీయ గూఢచారిగా రణవీర్ కనిపించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. అయితే మేజర్ మోహిత్ శర్మ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారని ఆయన తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లగా, సెన్సార్ బోర్డ్ (CBFC) విచారణలో అలాంటి పోలికలేమీ లేవని తేలింది.
ఇక ఈ సీక్వెల్ విషయానికి వస్తే.. జస్కీరత్ సింగ్ రంగీ అనే వ్యక్తి 'హంజా అలీ మజారీ' అనే గూఢచారిగా ఎలా మారాడు? పాకిస్థాన్ రాజకీయాల్లో, అండర్ వరల్డ్లో ఒక కింగ్పిన్గా ఎలా ఎదిగాడు? ఉగ్రవాద నెట్వర్క్ను నిర్వీర్యం చేసే క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేమిటి? అనే అంశాలను దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సారా అర్జున్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ఆదిత్య ధర్ భార్య, నటి యామీ గౌతమ్ అతిథి పాత్రలో మెరిశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'ధురంధర్ 2' ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది?
జవాబు: ఈ సినిమా 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1390 కోట్లు వసూలు చేసింది. దేశీయంగా రూ. 1042 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ప్రశ్న: ఈ సినిమా ఏ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది?
జవాబు: 2000వ దశకం ఆరంభంలో పాకిస్థాన్లోని కరాచీలో లియారీ గ్యాంగుల కార్యకలాపాలు, భారతీయ గూఢచారుల మిషన్ల ఆధారంగా ఈ కథను రూపొందించారు.

ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


