నెట్ఫ్లిక్స్లోకి నేరుగా వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. లేడీ డాక్టర్పై సెక్సువల్ మిస్కండక్ట్ ఆరోపణలు
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అక్యూజ్డ్' (Accused) ట్రైలర్ను నెట్ఫ్లిక్స్ ఇండియా శనివారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 27న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఓ విభిన్నమైన కథాంశంతో, మానవ సంబంధాలలోని సున్నితమైన కోణాలను స్పృశిస్తూ తెరకెక్కిన సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అక్యూజ్డ్' (Accused). కరణ్ జోహార్, ఆదార్ పూనావాలా, సోమెన్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించాడు. శనివారం (ఫిబ్రవరి 21) నెట్ఫ్లిక్స్ ఇండియా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ను విడుదల చేయగా, ఇది ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

'అక్యూజ్డ్' ట్రైలర్, స్టోరీ లైన్ ఇలా
నెట్ఫ్లిక్స్ లోకి నేరుగా అడుగుపెడుతున్న ఈ సినిమాలో కొంకణా సేన్ శర్మ, ప్రతిభా రాంటా ఇద్దరూ స్వలింగ సంపర్కులుగా, భార్యాభర్తలుగా నటిస్తున్నారు. డాక్టర్ గీతిక (కొంకణా) లండన్లో పనిచేసే ఒక అత్యంత పేరుగాంచిన, గౌరవప్రదమైన గైనకాలజిస్ట్. తన భార్య మీరాతో (ప్రతిభా) కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకుని సంతోషంగా జీవించాలని ఆమె ప్లాన్ చేసుకుంటుంది. కానీ అప్పుడే ఊహించని విధంగా గీతికపై ఆమె పనిచేసే ఆసుపత్రిలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తారు.
ఈ ఆరోపణల కారణంగా గీతికను సమాజం ఒక సెక్సువల్ ప్రిడేటర్ గా చూడటం ప్రారంభిస్తుంది. మీడియా, తోటి ఉద్యోగులు, చుట్టూ ఉన్న మనుషులు ఆమెను ఏకాకిని చేస్తారు. ట్రైలర్లో చూపించినట్లుగా.. తాను ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న కెరీర్ తన కళ్లముందే నాశనమవుతున్నా గీతిక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది. మరోవైపు ఈ తీవ్రమైన ఆరోపణల ప్రభావం ఆమె భార్య మీరాతో ఉన్న బంధంపై కూడా పడుతుంది. బయటి ప్రపంచం నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు పెరుగుతున్న అనుమానాలు వారి బంధాన్ని ఎలా కుదిపేశాయి? గీతిక నిజంగానే తప్పు చేసిందా లేక ఆమెపై ఎవరో కుట్ర పన్నారా? అనేది ఈ సినిమా స్టోరీ.
నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే..
ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, అభిమానులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. "ఓ మై గాడ్, ఇది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ఈ నటీమణులిద్దరూ నా ఫేవరెట్స్" అని ఒక అభిమాని కామెంట్ చేశారు.
"మహిళల ప్రాతినిధ్యంతో, ముఖ్యంగా కొంకణా, ప్రతిభా ప్రేమికులుగా నటించడం.. ఇదొక ప్రోగ్రెసివ్ స్టోరీ లైన్" అని మరొక యూజర్ ప్రశంసించారు. "ఈ స్టోరీ చాలా సంక్లిష్టంగా, ఆసక్తికరంగా ఉంది. సినిమా కోసం ఎదురుచూస్తున్నాం. ఇది రెగ్యులర్ షోలకు చాలా భిన్నంగా ఉంది" అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మేకర్స్ ఏమంటున్నారంటే..
ఈ అక్యూజ్డ్ సినిమా నిర్మాతలు ఈ సినిమా గురించి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. "అక్యూజ్డ్ అనేది మానవ ప్రవర్తనను, నైతిక సంఘర్షణను చాలా లోతుగా విశ్లేషించే కథ. మహిళలను కేంద్రంగా చేసుకుని, అధికారం, అవగాహన, నమ్మకం అనేవి ఎలా మారిపోతాయో దర్శకురాలు అనుభూతి కశ్యప్ ఇందులో అద్భుతంగా చూపించారు. కేవలం ఆరోపణలతో మాత్రమే కాకుండా, 'అనుమానం' అనే భయంతో ఒక సంబంధం ఎలా పరీక్షించబడుతుందో ఇందులో చూస్తాము. ఈ కథను చాలా సానుభూతితో, ధైర్యంగా చెప్పాము. జడ్జిమెంట్ ఇవ్వకుండా, ఆలోచింపజేసే ఉద్దేశంతో ఉన్న ఈ సినిమాను నెట్ఫ్లిక్స్లో తీసుకురావడం మాకు గర్వకారణం," అని తెలిపారు.
సీమా అగర్వాల్, యష్ కేస్వానీ రచించిన ఈ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 27న నెట్ఫ్లిక్స్ (Netflix) లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


