ఏ11గా అల్లు అర్జున్- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు- పోలీసుల ఛార్జ్షీట్
గతేడాది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ11గా చేర్చారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతేడాది పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఈ థియేటర్లో తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కేసులో కొత్త అప్ డేట్ వచ్చింది. చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో ఏ11గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరును చేర్చారు.

ఏ11 అల్లు అర్జున్
2024లో చోటు చేసుకున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూశారు. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారని శనివారం (డిసెంబర్ 27) తెలిసింది. ఇందులో ఏ11గా అల్లు అర్జున్ ఉన్నాడు.
ఏ1 గా థియేటర్ మేనేజ్మెంట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ను పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగి, ఓ మహిళ మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు అల్లు అర్జున్, అతని మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో పాటు బౌన్సర్లపైనా ఛార్జ్ షీట్ దాఖలు చేఆరు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు.
ఆ రోజు ఏమైంది?
2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ వేశారు. ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అక్కడికే వచ్చాడు. చాలా మంది జనాలు ఉండటంతో వద్దని చెప్పినా అల్లు అర్జున్ కారు సన్ రూఫ్ లో నుంచి నిలబడి చేతులు ఊపుతూ ర్యాలీగా వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు.
అల్లు అర్జున్ ను దగ్గర నుంచి చూడాలని అభిమానులు కోరుకున్నారు. దీంతో ఒకరిని ఒకరు తోసుకున్నారు. కొంతమంది కిందపడ్డారు. తొక్కిసలాట జరిగింది. ఇందులో హైదరాబాద్ కే చెందిన రేవతి అనే 35 ఏళ్ల మహిళ కన్ను మూశారు. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికీ హాస్పిటల్లోనే కోలుకుంటున్నాడు.
అప్పుడు అరెస్ట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో గతంలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఒక రోజు రాత్రి అతను జైల్లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అప్పట్లో ఈ విషయం కలకలం రేపింది. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలైంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


