Ram Charan: పెద్ది కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కెరీర్లోనే అత్యధికం.. జాన్వీకి కూడా భారీగానే..!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా ట్రైలర్ రిలీజై సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం ఇందులో నటించిన వాళ్లు అందుకున్న రెమ్యునరేషన్ల వివరాలు లీక్ అయ్యాయి.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రగ్గడ్ లుక్లో నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మే 18న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో ఈ సినిమా ట్రైలర్ను చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా విడుదల చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ సృష్టించిన ప్రకంపనల మధ్య ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ప్రధాన నటీనటులు అందుకున్న పారితోషికాల వివరాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.

'చిరుత' నుంచి 'పెద్ది' దాకా.. చరణ్ రేంజ్ ఇదీ
టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో రామ్ చరణ్ అగ్రస్థానంలో నిలుస్తారు. కెరీర్ ఆరంభంలో 'చిరుత' సినిమాకు కేవలం రూ. 15 లక్షలు అందుకున్న ఆయన.. ఆ తర్వాత కాలంలో తన మార్కెట్ను ఊహించని స్థాయికి పెంచుకున్నారు.
2014 నాటికే ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేసిన చరణ్.. 2015లో రూ. 12 కోట్లు తీసుకున్నారు. ఇక 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత ఆయన బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ ఇండస్ట్రీ హిట్ కోసం చరణ్ రూ. 45 కోట్లు వసూలు చేశారు.
"ఈ సినిమా కోసం చరణ్ తన కెరీర్లోనే అత్యధిక పారితోషికం అందుకున్నారు" అని టైమ్స్ నౌ నివేదిక పేర్కొంది. ఆ రిపోర్టు ప్రకారం 'పెద్ది' మూవీలో పెద్ది పెహల్వాన్ పాత్ర కోసం చరణ్ ఏకంగా రూ. 60 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
అచ్చియమ్మ పాత్రకు జాన్వీ పారితోషికం ఎంత?
ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ క్రేజ్ ఉన్న జాన్వీ కపూర్ నటిస్తోంది. దివంగత నటి శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అయిన ఆమె.. ఇటీవలే 'దేవర: పార్ట్ 1' సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకు రూ. 5 కోట్లు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు 'పెద్ది' సినిమాలో 'అచ్చియమ్మ' అనే పల్లెటూరి యువతి పాత్రలో అలరించనుంది. ఈ వైవిధ్యమైన పాత్ర కోసం నిర్మాతలు ఆమెకు రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం.
ఇతర నటీనటుల రెమ్యునరేషన్ల వివరాలు
ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు దివ్యేందు ఈ సినిమాలో 'రాంబుజ్జి'గా నటిస్తున్నారు. ఈ పాత్రకు ఆయన రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్లు అందుకున్నట్లు టాక్. అలాగే 'గౌరనాయుడు' పాత్రలో కనిపిస్తున్న కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్కు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు అందినట్లు తెలుస్తోంది.
మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న 'అప్పలసూరి' పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబుకు రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్లు లభించగా.. కథలో కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ బొమన్ ఇరానీ రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. చరణ్ తర్వాత అత్యధికంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా సుమారు రూ.30 కోట్ల వరకూ అందుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో 'పెద్ది' కథ
ఈ పెద్ది సినిమా కథ 1980ల కాలం నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటో ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ రివీల్ చేశాడు. ఓ గుర్తింపు కోసం పాటుపడే పెద్ది అనే యువకుడి కథే ఈ సినిమా అని అతడు చెప్పాడు. అయితే అతడు క్రాస్ ఓవర్ అథ్లెట్ గా ఎందుకు మారాడు? క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్ మధ్య అతని పాత్ర ఎలా మారుతుంది అన్నది ఈ మూవీలోనే చూడాలి. జూన్ 4, 2026న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరు ఏమిటి?
ఈ సినిమాలో రామ్ చరణ్ 'పెద్ది పెహల్వాన్' అనే ఒక దృఢ సంకల్పం గల గ్రామీణ యువకుడి పాత్రలో కనిపిస్తారు. ఆయన క్రీడల ద్వారా తన గ్రామంలోని ఐక్యత కోసం పోరాడతారు.
2. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్కు ఎంత పారితోషికం ఇచ్చారు?
టైమ్స్ నౌ రిపోర్టు ప్రకారం ఈ సినిమాలో 'అచ్చియమ్మ' పాత్ర పోషిస్తున్న జాన్వీ కపూర్కు రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు పారితోషికం లభించింది.
3. 'పెద్ది' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


