9 ఏళ్ల పిల్లాడు కూడా పోర్న్ చూస్తున్న రోజులివి.. అసలు సెన్సార్ బోర్డు అవసరమా: రామ్గోపాల్ వర్మ సంచలన కామెంట్స్
రామ్ గోపాల్ వర్మ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అసలు సెన్సార్ బోర్డు అవసరమా అని ప్రశ్నించాడు. 9 ఏళ్ల పిల్లాడు కూడా పోర్న్ చూస్తున్న ఈ రోజుల్లో సినిమాల్లో నుంచి వాటిని తొలగించాలనడం ఏంటని ప్రశ్నించాడు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డుపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా విజయ్ జన నాయగన్ తోపాటు పలు సినిమాలకు బోర్డు నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో అతడు స్పందించాడు. ఎక్స్ అకౌంట్ ద్వారా ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసిన వర్మ.. అసలు ఈ రోజుల్లో సెన్సార్ బోర్డు అవసరమా అని ప్రశ్నించాడు.

సెన్సార్ బోర్డుపై వర్మ ఏమన్నాడంటే?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్లు.. అందులో అసలు ఎలాంటి సెన్సార్ లేని కంటెంట్ లిమిట్ లేకుండా వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలకు సెన్సార్ అవసరమా అన్నది రామ్ గోపాల్ వర్మ వాదనగా కనిపిస్తోంది. అతడు శుక్రవారం (జనవరి 9) రాత్రి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
“ఇది కేవలం దళపతి విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమాకు సంబంధించిన సెన్సార్ సమస్య మాత్రమే కాదు. మొత్తం వ్యవస్థకు సంబంధించిన మౌలికమైన ప్రశ్న. అసలు ఈ రోజుల్లో సెన్సార్ బోర్డు ఇంకా అవసరమా? అరచేతిలో అరాచకం ఉన్నప్పుడు.. సినిమాలో కత్తెర్లు ఎందుకు? మనం ఎటువంటి కాలంలో బతుకుతున్నాం? ఒక 9 ఏళ్ల పిల్లాడికి హార్డ్-కోర్ పోర్న్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఖాళీగా ఉన్న వృద్ధులు విద్వేషపూరిత ప్రచారాలను, కుట్ర సిద్ధాంతాలను నమ్ముతున్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, ఎలాంటి కటింగ్ లేకుండా, సెన్సార్ లేకుండా అల్గారిథమ్స్ ద్వారా ఈ సమాచారం జనంలోకి వెళ్తోంది. ఇవన్నీ ఆపడానికి అక్కడ ఏ గేట్కీపర్ లేరు" అని వర్మ అన్నాడు.
వాళ్లూ బూతులేగా మాట్లాడుతున్నారు
ఈ సందర్భంగా టీవీలు, యూట్యూబర్ల ప్రస్తావన కూడా వర్మ తీసుకొచ్చాడు. “టీవీ డిబేట్ల పేరుతో న్యూస్ ఛానళ్ల నుంచి, యూట్యూబర్ల వరకు అందరూ బూతులు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ విషం, కుల మతాల గొడవలు, వ్యక్తిత్వ హననం యథేచ్ఛగా, లైవ్లో సాగుతున్నాయి. సినిమా అనేది శక్తివంతమైన మాధ్యమం అనే పాత నమ్మకాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు సినిమా కంటే సోషల్ మీడియా ప్రభావం వంద రెట్లు ఎక్కువ. అది విషపూరితమైనది కూడా. ఇలాంటి వాస్తవ పరిస్థితుల్లో.. సినిమాలో ఒక పదం కట్ చేస్తేనో, ఒక షాట్ ట్రిమ్ చేస్తేనో, సిగరెట్ తాగే సీన్ను బ్లర్ చేస్తేనో "సమాజాన్ని రక్షించవచ్చు" అని సెన్సార్ బోర్డు నమ్మడం నిజంగా పెద్ద జోక్” అని అన్నాడు.
ఓటు వేయడానికి ఉన్న తెలివి.. సినిమా చూడటానికి లేదా?
వర్మ ఇంకా కొనసాగిస్తూ.. “ఒకప్పుడు అంటే.. మీడియా ప్రభుత్వం చేతిలో ఉండేది. థియేటర్లు మాత్రమే జనం గుమిగూడే ప్రదేశాలు. అప్పుడు నియంత్రణ సాధ్యమే. కానీ ఇప్పుడు జనం ఏం చూడాలో, ఏం చూడకూడదో ఎవరూ నిర్ణయించలేరు. ఇలాంటి సమయంలో సెన్సార్షిప్ అనేది ఎక్స్ పోజర్ ను ఆపలేదు సరికదా.. అది ప్రేక్షకులను అవమానించడమే అవుతుంది. మనల్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే తెలివితేటలు మనకు ఉన్నప్పుడు, మనం ఏం చూడాలో, ఏం వినాలో నిర్ణయించుకునే హక్కు మనకు లేదా?” అని వర్మ ప్రశ్నించాడు.
నైతిక బాధ్యత పేరుతో నాటకాలు
"ఇప్పుడు సెన్సార్ బోర్డు చేస్తున్నది రక్షణ కాదు, కేవలం నాటకం మాత్రమే. ఆలోచనలకు పదును పెట్టడానికి బదులు కత్తెర్లు వాడుతూ, ‘నైతిక బాధ్యత’ అనే ముసుగులో చెలాయించే అధికారమిది. సోషల్ మీడియాలో ఘోరమైన హింసను చూసి ఆనందించే సమాజమే.. థియేటర్లో ఏదైనా చూపిస్తే మాత్రం అకస్మాత్తుగా "ఆందోళన" చెందుతుంది. ఈ ద్వంద్వ వైఖరి చాలా ప్రమాదకరం" అని వర్మ స్పష్టం చేశాడు.
జనం ఎప్పటికీ చిన్నపిల్లలే అని, వాళ్లకు ఏం చూపించాలో తామే నిర్ణయిస్తామని సెన్సార్ బోర్డు భావిస్తోందని వర్మ అన్నాడు. సినిమా అనేది పాఠాలు నేర్పే క్లాస్ రూమ్ కాదని, అదొక అద్దమని చెప్పాడు. వయసుల వారీగా సినిమాలను వర్గీకరించడం సరైన పద్ధతి అని.. హెచ్చరికలు జారీ చేయడం సరైన పద్ధతి అని.. సెన్సార్షిప్ మాత్రం కాదని వర్మ తేల్చి చెప్పాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


