చూడగానే దేవుడిలా కనిపించాలి.. ఈ సినిమాను ఆదిపురుష్తో పోల్చొద్దు: రామాయణ సీరియల్లో రాముడి పాత్రధారి కామెంట్స్
రామానంద్ సాగర్ 'రామాయణ్'లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్.. నితేష్ తివారీ తీస్తున్న కొత్త 'రామాయణ' మూవీపై స్పందించాడు. ఇందులో తాను దశరథుడిగా నటిస్తుండగా, రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా వచ్చే పోలికలు, ఆదిపురుష్ సినిమా వైఫల్యం గురించి అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారతీయ సంస్కృతిలో ఇతిహాసమైన రామాయణానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా ఎందరో నటులు వెండితెరపై రాముడి పాత్రలో కనిపించినా.. 1987లో వచ్చిన రామానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ (Arun Govil) వేసిన ముద్ర మాత్రం చెరిగిపోనిది. ఇప్పుడు దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ 'రామాయణ' సినిమాలో అరుణ్ గోవిల్ దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సందర్భంగా అతడు కొత్త సినిమాపై, ప్రేక్షకులు చేస్తున్న పోలికలపై పీటీఐతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పోలికలు సహజమే.. కానీ
ఈ రామాయణ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. రణ్బీర్ లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి పాత సీరియల్ రాముడు అరుణ్ గోవిల్తో పోలికలు రావడం మొదలైంది. దీనిపై అరుణ్ గోవిల్ స్పందిస్తూ.. "ఒక స్టాండర్డ్ సెట్ అయినప్పుడు పోలికలు రావడం సహజం. నన్ను రణ్బీర్తో పోలుస్తున్నారని ఎవరూ బాధపడకూడదు. అయితే నా ఉద్దేశంలో దేవుడి పాత్రలో నటించాలంటే ఆ రూపం చాలా ముఖ్యం. ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు, మీలో దేవుడిని చూడాలి. 'దేవుడు బహుశా ఇలాగే ఉంటాడేమో' అనిపించేలా ఆ లుక్ ఉండాలి" అని అతడు అభిప్రాయపడ్డాడు. దైవత్వాన్ని ప్రతిబింబించేలా లుక్ ఉండటం అత్యంత కీలకమని అతడు నొక్కి చెప్పాడు.
ఆదిపురుష్తో పోల్చవద్దు
మూడేళ్ల కిందట ప్రభాస్ రాముడిగా, ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. విమర్శకుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే కొత్తగా రాబోతున్న రామాయణ సినిమాను ఆదిపురుష్తో పోల్చవద్దని అరుణ్ గోవిల్ కోరాడు. "నితేష్ తివారీ రామాయణానికి, ఆదిపురుష్కి చాలా తేడా ఉంది" అని ఆయన స్పష్టం చేశాడు.
రామాయణ సినిమా విశేషాలు
రెండు భాగాలుగా రాబోతున్న రామాయణ చిత్రంలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందకు రానుంది. ఇందులో మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఇక రెండో భాగంగా వచ్చే ఏడాది దీపావళికి వస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


