వాళ్లు అలా చేయడం నాకు అసౌకర్యంగా అనిపిస్తుంది.. అది మాకు చాలా పవిత్రమైనది.. అలా చేయొద్దని చెబుతాను: రిషబ్ శెట్టి
కాంతారలోని దైవాలను హేళన చేసేలా రణ్వీర్ సింగ్ ఈ మధ్య చేసిన నటనపై రిషబ్ శెట్టి పరోక్షంగా స్పందించాడు. ఎవరైనా అలా చేయడం చూస్తుంటే తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందని అతడు చెప్పాడు. ఆ దైవాలు తమకు ఎంతో పవిత్రమైనవని తెలిపాడు.
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI) వేదికపై బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ 'కాంతార' దైవాన్ని అనుకరించడం వివాదానికి దారితీసింది. దీనిపై తాజాగా 'కాంతార' స్టార్ రిషబ్ శెట్టి స్పందించాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దైవారాధన అనేది తమకు అత్యంత పవిత్రమైనదని, దానిని స్టేజ్ మీద ఇమిటేట్ చేయడం తనకు చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

రిషబ్ శెట్టి రియాక్షన్ ఇలా..
ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చేసిన పని తీవ్ర దుమారం రేపింది. రిషబ్ శెట్టి వారిస్తున్నా వినకుండా రణ్వీర్ రెండుసార్లు అలా చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై తాజాగా రిషబ్ శెట్టి చెన్నైలో జరిగిన 'బిహైండ్వుడ్స్' ఈవెంట్లో మౌనం వీడాడు.
రణ్వీర్ పేరు ఎత్తకుండానే, దైవాన్ని ఇమిటేట్ చేయడంపై ఘాటుగా స్పందించాడు. 'కాంతార' వంటి సినిమా తీసినప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు కేవలం పాప్ కల్చర్గా మారిపోయే ప్రమాదం ఉందని రిషబ్ ఆందోళన వ్యక్తం చేశాడు.
బాధగా ఉంటుంది..
"సినిమాలో ఆచారాలను గౌరవప్రదంగా చూపించడానికి నేను ఎంతోమంది పెద్దల సలహాలు తీసుకున్నాను. కానీ సినిమా రిలీజ్ అయ్యాక జనం దాన్ని ఇమిటేట్ చేయడం చూస్తుంటే.. నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. సినిమాలో మిగతాదంతా నటన కావచ్చు.. కానీ దైవం ఎలిమెంట్ అనేది చాలా సున్నితమైనది, పవిత్రమైనది. నేను ఎక్కడికి వెళ్ళినా.. దయచేసి దాన్ని స్టేజ్ మీద ప్రదర్శించకండి, వెటకారం చేయకండి అని వేడుకుంటున్నాను. అది మా ఎమోషన్స్తో ముడిపడి ఉన్న విషయం" అని రిషబ్ ఎమోషనల్ అయ్యాడు.
అసలేం జరిగిందంటే?
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై రణ్వీర్ సింగ్ 'కాంతార' గురించి మాట్లాడుతూ.. రిషబ్ శెట్టి నటనను పొగుడుతూ ఆ దైవం శబ్దాన్ని అనుకరించాడు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంతో రణ్వీర్ ఇన్స్టాగ్రామ్లో క్షమాపణలు చెప్పాడు.
"రిషబ్ నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశం. ఒక నటుడిగా ఆ సీన్ చేయడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. మన సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు గౌరవం ఉంది. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించండి" అని రణ్వీర్ పేర్కొన్నాడు.
రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' (2022).. ఈ ఏడాది వచ్చిన 'కాంతార: చాప్టర్ 1' (2025).. రెండూ కేజీఎఫ్ 2 తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన కన్నడ చిత్రాలుగా రికార్డు సృష్టించాయి. మరోవైపు రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.














