లెజెండరీ సింగర్ బయోపిక్లో సాయి పల్లవి.. కింగ్డమ్ డైరెక్టర్ దర్శకత్వంలో..?
ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆసక్తి రేపుతోంది. టాలెంటెడ్ నటి సాయి పల్లవి లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాను ఓ తెలుగు డైరెక్టరే డైరెక్ట్ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది.
ప్రస్తుతం రణబీర్ కపూర్తో 'రామాయణం' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవి.. త్వరలో మరో భారీ ప్రాజెక్టులో నటించే అవకాశం ఉంది. లెజెండరీ సింగర్ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్లో నటించేందుకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పుడీ వార్త ఎంతో ఆసక్తి రేపుతోంది.

సుబ్బలక్ష్మి బయోపిక్లో సాయి పల్లవి?
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గత కొన్ని నెలలుగా కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ మూవీ 'రామాయణం' (Ramayana) షూటింగ్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
'జెర్సీ' ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. దిగ్గజ గాయని, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ బయోపిక్లో ప్రధాన పాత్ర కోసం గౌతమ్ ఇప్పటికే సాయి పల్లవిని సంప్రదించి, కథాంశాన్ని వివరించినట్లు సమాచారం.
అయితే సాయి పల్లవి ఇంకా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రలో సాయి పల్లవిని చూడటం నిజంగా కన్నుల పండుగే అని చెప్పాలి.
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సీక్వెల్ రద్దు?
గౌతమ్ తిన్ననూరి చివరగా విజయ్ దేవరకొండతో 'కింగ్డమ్' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో మేకర్స్ ప్లాన్ చేసిన ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు రద్దయినట్లు తెలుస్తోంది. అందుకే గౌతమ్ ఇప్పుడు బయోపిక్ వైపు దృష్టి సారించాడు.
మరోవైపు గౌతమ్ తిన్ననూరి కొత్త నటీనటులతో తెరకెక్కించిన చిన్న సినిమా 'మ్యాజిక్' విడుదలకు సిద్ధంగా ఉంది. 'కింగ్డమ్' సినిమా ఆలస్యం అవుతున్న సమయంలో అతడు ఈ సినిమాను పూర్తి చేశాడు. దీనికి అనిరుధ్ సంగీతం అందించడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.
అయితే గౌతమ్ తిన్ననూరి, సాయి పల్లవి కాంబినేషన్.. అది కూడా లెజెండరీ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కావడం ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ వార్తలు నిజం కావాలని వాళ్లు కోరుకుంటున్నారు. అటు సాయి పల్లవి వచ్చే ఏడాది దీపావళికి రామాయణం పార్ట్ 1తో ప్రేక్షకుల ముందుకు రానుంది.














