నేను 25 ఏళ్లుగా డిన్నర్ కోసం బయటకు వెళ్లలేదు.. ముగ్గురు, నలుగురే ఫ్రెండ్స్ ఉన్నారు: సల్మాన్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 25 ఏళ్లుగా తాను ఒక్కసారి కూడా డిన్నర్ కోసం బయటకు వెళ్లలేదని చెప్పాడు. తనకు ముగ్గురు, నలుగురు కంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరని అన్నాడు.
బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టాడు. గత 25 ఏళ్లుగా తాను బయట ఎక్కడా డిన్నర్కు వెళ్లలేదని, తన జీవితం కేవలం ఇల్లు, షూటింగ్, ఎయిర్పోర్ట్ చుట్టూనే తిరుగుతుందని రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్లో వెల్లడించాడు. ఈ క్రమంలో తన స్నేహితుల గురించి కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

నా జీవితం అంతా అదే..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం (డిసెంబర్ 11) 'రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్'లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఒక సెషన్లో తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా గత రెండున్నర దశాబ్దాలుగా తాను అనుసరిస్తున్న రొటీన్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తన లైఫ్ స్టైల్ గురించి సల్మాన్ మాట్లాడాడు. "నేను ఎక్కడికైనా బయటకు వెళ్లి డిన్నర్ చేసి దాదాపు 25-26 ఏళ్లు అవుతోంది. షూటింగ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కు, ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు, హోటల్ నుంచి ఈవెంట్లకు.. అంతే! ఇదే నా జీవితం" అని సల్మాన్ చెప్పుకొచ్చాడు.
స్నేహితుల గురించి..
తన ప్రయాణంలో చాలా మంది దగ్గరి స్నేహితులను కోల్పోయానని సల్మాన్ గుర్తు చేసుకున్నాడు. "నా జీవితంలో ఎక్కువ భాగం కుటుంబం, స్నేహితులతోనే గడిపాను. అందులో చాలా మంది వెళ్లిపోయారు. ఇప్పుడు నాతో చాలా కాలం నుంచి ట్రావెల్ అవుతున్న పాత స్నేహితులు కేవలం నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఉన్నారు" అని ఎమోషనల్ అయ్యాడు.
ఇలాంటి జీవితం పట్ల తనకు ఎలాంటి విచారం లేదని సల్మాన్ స్పష్టం చేశాడు. "దీని గురించి నాకేం బాధ లేదు. బయట జల్సాగా తిరగడం కావాలా? లేక ఇదంతా వద్దు అనుకోవాలా? అంటే.. నేను రెండో దాన్నే ఎంచుకుంటాను. జనం నాపై చూపిస్తున్న ప్రేమ, ఇస్తున్న గౌరవం చూశాక.. బయట తిరగకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఆ ప్రేమ కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను. మధ్యలో అప్పుడప్పుడు కాస్త బద్ధకంగా అనిపించినా.. భవిష్యత్తులో ఏం జరగబోతుందోనని ఆలోచిస్తూ ఆ పనిని కూడా ఆస్వాదిస్తాను" అని సల్మాన్ తన మనసులోని మాట చెప్పాడు.
సల్మాన్ నెక్స్ట్ మూవీ: తుపాకులు లేని యుద్ధం
సల్మాన్ ఖాన్ తదుపరి మూవీ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. 2020లో గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇది చాలా అరుదైన సరిహద్దు ఘర్షణ. ఇందులో తుపాకులు వాడలేదు. సైనికులు కర్రలు, రాళ్లతోనే ముఖాముఖి తలపడ్డారు. ఈ వాస్తవ ఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారు.














