207 కోట్లు దాటేసిన రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురందర్- బాలీవుడ్లో పెను మార్పు అంటూ డైరెక్టర్ కామెంట్స్
రణ్వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 'ధురందర్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలై వారం రోజుల్లోనే దేశీయంగా రూ. 200 కోట్ల మార్క్ను దాటి బాలీవుడ్లో ఈ ఏడాది విడుదలైన అనేక పెద్ద సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'ధురందర్' ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలలో ఒకటి. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి దుమ్ము రేపుతోంది. ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన రావడంతో ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

200 కోట్ల మార్క్ దాటి
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురందర్ సినిమా విడుదలైన మొదటి వారం రోజుల్లోనే భారత్లో ఏకంగా రూ. 200 కోట్ల మార్క్ను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సినిమా నిర్మాతలు తమ అధికారిక ఎక్స్ ఖాతా (గతంలో ట్విట్టర్) ద్వారా కలెక్షన్ల వివరాలను పంచుకున్నారు.
ఒక్కరోజే 29 కోట్లు
ధురందర్ సినిమా గురువారం (డిసెంబర్ 11) ఒక్కరోజే రూ. 29.20 కోట్లు వసూలు చేసినట్లు వారు ప్రకటించారు. ప్రముఖ సినీ లెక్కల వెబ్సైట్ సక్నిల్క్ (Sacnilk) తాజా అప్డేట్ ప్రకారం శుక్రవారం కూడా ఈ చిత్రం అద్భుతంగా రాణించింది.
ధురందర్ 7 రోజుల కలెక్షన్స్
విడుదలైన ఏడో రోజున 'ధురందర్' ఇండియాలో సుమారు రూ. 27 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో, ఏడు రోజులకు గానూ ఈ సినిమా మొత్తం కలెక్షన్ ₹207.25 కోట్లకు చేరింది.
ధురందర్ బీట్ చేసిన సినిమాలు
'ధురందర్' ఇప్పటికే సల్మాన్ ఖాన్ 'సికందర్' (రూ. 109.83 కోట్లు), 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' (రూ. 153.55 కోట్లు) వంటి పెద్ద బాలీవుడ్ చిత్రాల దేశీయ మొత్తం వసూళ్లను అధిగమించింది. తాజాగా, 'రైడ్ 2' (రూ. 173.05 కోట్లు) లైఫ్టైమ్ కలెక్షన్ను కూడా దాటేసింది. రణ్వీర్ సినిమా దూకుడు చూస్తుంటే కలెక్షన్ల సునామీ మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
బాలీవుడ్లో మార్పు ఖాయం
'ధురందర్' విజయంపై ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ స్పందించారు. ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శన సినీ పరిశ్రమలో పెను మార్పు తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు.
హిందీ సినిమా డైనమిక్స్ను
"ధురందర్ సూపర్ సక్సెస్ తర్వాత ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్పు (పారాడైమ్ షిఫ్ట్) రాబోతోంది. బలమైన కంటెంట్, భిన్నమైన నటీనటులు, అలాగే ప్రేక్షకులను పెద్ద ఎత్తున కనెక్ట్ చేసే కథలకు అండగా నిలిచే నిర్మాణ సంస్థల ద్వారా ఈ మార్పు మొదలవుతుంది. ఈ ఒక్క సినిమా హిందీ సినిమా డైనమిక్స్ను, కథలు, నైపుణ్యం, నమ్మకం ఒకచోట చేరే విధానాన్ని పునర్నిర్వచించబోతోంది" అని రాశారు మధుర్ భండార్కర్.
సినిమా నేపథ్యం
ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన'ధురందర్' ఒక స్పై థ్రిల్లర్ చిత్రం. పాకిస్తాన్లోని ల్యారీ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద నెట్వర్క్లను ఛేదించే ఒక భారతీయ గూఢచారి (స్పై) పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సారా అర్జున్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.

E-Paper












