బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
సినీ రంగంపై చర్చలు…

రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్…. ముఖ్యమంత్రికి వివరించారు. సినిమా షూటింగ్లకు ఏపీని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
ఫిల్మ్ స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నామని సంజయ్ దత్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఫలితంగా సినిమా, వినోద రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు…. సంజయ్ దత్ను కోరారు.
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఉన్న అవకాశాలను కూడా ఈ భేటీలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. బాలీవుడ్ సినిమాల షూటింగ్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, సింగిల్ విండో క్లియరెన్స్ విధానంపై చర్చ జరిగింది. ఏపీ ప్రభుత్వం సినిమా రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాలను సంజయ్ దత్ బృందం అడిగి తెలుసుకుంది.