బాలీవుడ్ సూపర్ హిట్ జోడీ మళ్లీ కలిసింది.. ఆ బ్లాక్‌బస్టర్ మూవీకి 30 ఏళ్లు.. లండన్‌లో కాంస్య విగ్రహం ఆవిష్కరణ

బాలీవుడ్ సూపర్ హిట్ ఐకానిక్ జోడీ షారుక్ ఖాన్, కాజోల్ మళ్లీ కలిశారు. తమ బ్లాక్‌బస్టర్ మూవీ దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే మూవీకి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లండన్ లో ఈ జోడీ తమ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం.

Published on: Dec 04, 2025 8:27 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ సినిమా చరిత్రలో ప్రేమకథలకు కొత్త నిర్వచనం చెప్పిన మూవీ 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' (డీడీఎల్‌జే). ఈ క్లాసిక్ మూవీ విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ అద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకుని మూవీలో లీడ్ రోల్స్ పోషించిన షారుఖ్ ఖాన్, కాజోల్ లండన్‌లో ఒక ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. లండన్‌లోని ప్రసిద్ధ లెస్టర్ స్క్వేర్‌లో ఈ సినిమాలోని తమ ఐకానిక్ పోజ్‌ను ప్రతిబింబించే కాంస్య విగ్రహాన్ని వీరిద్దరూ కలిసి ఆవిష్కరించారు. ఒక భారతీయ సినిమాకు ఈ అరుదైన గౌరవం దక్కడం ఇదే తొలిసారి.

బాలీవుడ్ సూపర్ హిట్ జోడీ మళ్లీ కలిసింది.. ఆ బ్లాక్‌బస్టర్ మూవీకి 30 ఏళ్లు.. లండన్‌లో కాంస్య విగ్రహం ఆవిష్కరణ (AP)
బాలీవుడ్ సూపర్ హిట్ జోడీ మళ్లీ కలిసింది.. ఆ బ్లాక్‌బస్టర్ మూవీకి 30 ఏళ్లు.. లండన్‌లో కాంస్య విగ్రహం ఆవిష్కరణ (AP)

రాజ్, సిమ్రన్ మళ్లీ కలిశారు..

విగ్రహావిష్కరణ కార్యక్రమంలో షారుక్, కాజోల్ సందడి చేశారు. నలుపు రంగు సూట్‌లో షారుఖ్ స్టైలిష్‌గా కనిపించగా, నీలి రంగు చీరలో కాజోల్ మెరిసిపోయింది. విగ్రహం పక్కన నిల్చుని వారు ఫోటోలకు పోజులిచ్చారు. బాలీవుడ్ లో వీళ్లది సూపర్ హిట్ జోడీ. ఇద్దరూ కలిసి ఈ దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగేతోపాటు బాజీగర్, కుచ్ కుచ్ హోతా మై, కభీ ఖుషీ కభీ ఘమ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

అయితే వాళ్ల కెరీర్లోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఈ డీడీఎల్‌జే మూవీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. అలాంటి సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది.

సినిమా గురించి షారుఖ్ ఏమన్నాడంటే?

ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ.. రాజ్, సిమ్రన్ పాత్రలను అమర ప్రేమికులుగా మార్చింది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో ఈ సినిమా ఇప్పటికీ ప్రదర్శితమవుతుండటం ఒక ప్రపంచ రికార్డు. దీనిపై షారుక్ ఖాన్ తాజాగా స్పందించాడు.

"డీడీఎల్‌జే విడుదలై 30 ఏళ్లు అయ్యిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. అది నిన్ననే జరిగినట్లుంది. ఎందుకంటే.. 'బడే బడే దేశో మే ఐసీ చోటీ చోటీ బాతే హోతీ రెహ్తీ హై' (పెద్ద పెద్ద దేశాల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి).. కానీ ఇప్పటికీ ఇది నమ్మశక్యంగా లేదు. రాజ్ పాత్ర పోషించినందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి నాకు లభించిన ప్రేమకు నేను కృతజ్ఞుడను. ఈ సినిమా ప్రజల హృదయాల్లో ఇంతటి స్థానం సంపాదిస్తుందని ఎవరూ ఊహించలేదు" అని షారుఖ్ అన్నాడు.

కాజోల్ రియాక్షన్ ఇలా..

ఈ మూవీపై కాజోల్ కూడా స్పందించింది. "దీని తర్వాత వచ్చిన దాదాపు ప్రతి రొమాంటిక్ సినిమాపైనా డీడీఎల్‌జే ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. నా వరకు, సిమ్రన్ అనేది ఎప్పటికీ ముగియని ఒక అధ్యాయం. మన దేశంలోని కోట్లాది మంది అమ్మాయిలకు ఆమె ప్రతిరూపం. తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ఉంటూనే, మరోవైపు స్వేచ్ఛను కోరుకునే అమ్మాయిలందరికీ సిమ్రన్ ఒక స్ఫూర్తి. అందుకే ఆమె పాత్ర ఇప్పటికీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎవరైనా 'జా సిమ్రాన్, జా' (వెళ్లు సిమ్రాన్, వెళ్లు) అని అన్నప్పుడల్లా.. ధైర్యం, ప్రేమ కలిసి ఉంటాయనే నమ్మకం బలపడుతుంది" అని కాజోల్ వివరించింది.