Siddharth Bommarillu: బొమ్మరిల్లుకు 20 ఏళ్లు.. బ్లాక్‌బస్టర్ అయినా టాలీవుడ్‌కు సిద్ధార్థ్ దూరం.. ఆ సక్సెసే అడ్డంటూ..

Siddharth Bommarillu: బొమ్మరిల్లు మూవీ బ్లాక్‌బస్టర్ కావడం, ఆ తర్వాత టాలీవుడ్ కు తాను దూరమవడంపై సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ మాట్లాడారు.

Published on: Aug 11, 2026, 22:04:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Siddharth Bommarillu: "బొమ్మరిల్లు" విడుదలైన 20 ఏళ్ల తర్వాత హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో తన స్టార్‌డమ్‌ను నిలబెట్టిన ఈ సినిమానే తాను తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి కారణమైందని సిద్ధార్థ్ బాంబు పేల్చారు.

Siddharth Bommarillu: బొమ్మరిల్లుకు 20 ఏళ్లు.. బ్లాక్‌బస్టర్ అయినా టాలీవుడ్‌కు సిద్ధార్థ్ దూరం.. ఆ సక్సెసే అడ్డంటూ..
Siddharth Bommarillu: బొమ్మరిల్లుకు 20 ఏళ్లు.. బ్లాక్‌బస్టర్ అయినా టాలీవుడ్‌కు సిద్ధార్థ్ దూరం.. ఆ సక్సెసే అడ్డంటూ..

2006 ఆగస్టులో వచ్చిన 'బొమ్మరిల్లు' చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచింది. దిల్ రాజు నిర్మాణంలో భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అప్పట్లోనే రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా రికార్డు సృష్టించింది.

సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్

ఈ బొమ్మరిల్లు సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్ధార్థ్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా 'బొమ్మరిల్లు' షూటింగ్ టైమ్‌లో జరిగిన ఆసక్తికర విషయాలతో పాటు తాను టాలీవుడ్‌లో సినిమాలు తగ్గించడానికి గల అసలు కారణాన్ని షేర్ చేసుకున్నారు.

"బొమ్మరిల్లు నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. కానీ అదే నా కాళ్లకు బంధనంగా మారింది" అని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నన్ను కేవలం సాఫ్ట్ లవర్ బోయ్, చాక్లెట్ బోయ్ రోల్స్ మాత్రమే చేయాలని ఆశించారని ఆయన చెప్పారు.

ఒకే తరహా పాత్రలు చేయడం తనకు బోర్ కొట్టిందని, కొత్త ప్రయోగాలు చేయడానికి టాలీవుడ్ మేకర్స్ అవకాశం ఇవ్వలేదని సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ తమిళం, హిందీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినట్లు వివరించారు.

జెనీలియా క్రేజ్.. ప్రకాష్ రాజ్‌ను పక్కన పెట్టిన సిద్ధార్థ్

హాసినిగా జెనీలియా చేసిన అల్లరి, క్యూట్ పర్‌ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రాణమని సిద్ధార్థ్ గుర్తుచేసుకున్నారు. "ఫస్ట్ కాపీ చూసినప్పుడే నాకు అర్థమైంది.. హాసిని క్యారెక్టర్‌ను ఆడియన్స్ ఆమోదిస్తే ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఊహించాను" అని ఆయన తెలిపారు.

సినిమాలో తండ్రీకొడుకుల మధ్య ఉండే గ్యాప్ నాచురల్‌గా రావడం కోసం ప్రకాష్ రాజ్‌తో తాను ప్రవర్తించిన తీరును సిద్ధార్థ్ బయటపెట్టారు. షూటింగ్ టైమ్‌లో ప్రకాష్ రాజ్ ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయనతో మాట్లాడకుండా పూర్తిగా ఇగ్నోర్ చేసేవాడినని తెలిపారు.

రియల్ లైఫ్‌లో ప్రకాష్ రాజ్‌తో తనకు మంచి బాండింగ్ ఉందని, కానీ సినిమాలో ఆ ఆప్యాయత కనిపిస్తే క్యారెక్టర్ డెప్త్ దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే సెట్స్‌లో ఆయనతో మాట్లాడలేదని సిద్ధార్థ్ నవ్వుతూ చెప్పారు.

సింగిల్ టేక్ క్లైమాక్స్.. ఏడ్చేసిన డైరెక్టర్ భాస్కర్

'బొమ్మరిల్లు' క్లైమాక్స్ సీన్ గురించి చెబుతూ సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు. "మొత్తం మీరే చేశారు నాన్న" అని చెప్పే ఐకానిక్ సీన్‌ను ఎటువంటి రిహార్సల్స్ లేకుండా డైరెక్ట్‌గా సింగిల్ టేక్‌లోనే పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.

సీన్ పూర్తయ్యాక కెమెరాలో ఫిల్మ్ రోల్ అయిపోయేంత వరకు ఎవరూ 'కట్' అని చెప్పలేకపోయారని, అంతలా సెట్స్‌లో అందరూ సైలెంట్ అయిపోయారని చెప్పారు. ఆ క్షణంలో డైరెక్టర్ భాస్కర్ సెట్స్ బయటకు వెళ్లి ఏడ్చేశారని, దిల్ రాజు వచ్చి నన్ను కౌగిలించుకున్నారని సిద్ధార్థ్ గుర్తుచేసుకున్నారు.

దళపతి విజయ్ రిక్వెస్ట్.. రీమేక్ వద్దన్న సిద్ధార్థ్

ఈ సినిమా సక్సెస్ చూసి కోలీవుడ్ దళపతి విజయ్ 'బొమ్మరిల్లు' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలని సిద్ధార్థ్‌ను కోరారట. విజయ్ అన్న స్వయంగా వచ్చి హగ్ చేసుకుని డ్యాన్స్ స్టెప్పులు, సీన్స్ గురించి గంటల తరబడి మాట్లాడారని సిద్ధార్థ్ చెప్పారు.

అయితే ఒకే క్యారెక్టర్‌ను మళ్లీ రీమేక్‌లో రిపీట్ చేయడం తనకు నచ్చక విజయ్ ఆఫర్‌ను వినయంగా తిరస్కరించినట్లు సిద్ధార్థ్ తెలిపారు. ఆ తర్వాత తమిళంలో 'సంతోష్ సుబ్రమణ్యం' పేరుతో జయం రవి ఈ సినిమా రీమేక్ చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

గడిచిన పదేళ్లలో కేవలం 'మహా సముద్రం' మినహా తెలుగులో ఏ సినిమా చేయకపోయినా.. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు తనను తమ ఇంట్లోని అబ్బాయిలాగే ఆదరిస్తున్నారని సిద్ధార్థ్ కృతజ్ఞతలు తెలిపారు. 'బొమ్మరిల్లు' ఇచ్చిన ఇమేజ్ నుంచి బయటపడలేకపోయినా, ఆ సినిమా తనకు అందించిన ప్రేమ ఎప్పటికీ మరచిపోలేనని ఆయన ముగించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More