Singer Sunitha: ఆమె శరీరం ఆమె హక్కు అయితే వాడి కళ్లు వాడి ఇష్టం.. ఫెమినిజంపై సింగర్ సునీత కామెంట్స్.. మహిళల ఆగ్రహం
Singer Sunitha About Feminism: ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునిత ఉపద్రష్ట ఫెమినిజం, మహిళల స్వేచ్ఛపై చేసిన వ్యాఖ్యలు మహిళలు, మహిళ సంఘాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. "నా శరీరం నా ఇష్టం" అనే నినాదాన్ని పురుషుల చూపులతో పోల్చడంపై మహిళా నెటిజన్లు మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..!
Singer Sunitha About Feminism: తెలుగు చిత్ర పరిశ్రమలో తన మధురమైన గొంతుతో, హుందాతనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ సింగర్ సునీత ఉపద్రష్ట ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు.

మహిళల హైక్కులపై
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే సింగర్ సునీత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫెమినిజం, మహిళల హక్కులపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. మహిళల వస్త్రధారణ, స్వేచ్ఛను పురుషుల చూపులతో ముడిపెడుతూ ఆమె మాట్లాడిన తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ముఖ్యంగా మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సునీతకు ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి గుర్తింపు ఉంది. ఆమె మాటలకు సమాజంలో ఒక విలువ ఉంటుంది. అలాంటి సెలబ్రిటీ నోటి నుంచి ఆధునిక మహిళా ఆలోచనలను కించపరిచేలా వ్యాఖ్యలు వచ్చాయంటూ సదరు మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
సునీత అసలు ఏమన్నారు?
మహిళల సమానత్వం, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పోరాటాల గురించి ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సింగర్ సినీత ఇలా స్పందించారు.
"సిగరెట్ లైటర్ వెలిగించడమే స్వేచ్ఛకు ప్రతీక అని కొందరు మహిళలు భావిస్తున్నారు. సిగరెట్ తాగడాన్ని సమానత్వంతో పోల్చడం చాలా అవివేకం. మగవాడు సిగరెట్ తాగితే కొద్ది నిమిషాల ఆయుష్షు కోల్పోవచ్చు, కానీ మహిళలు తమ జీవితంలో కొన్ని గంటల సమయాన్ని కోల్పోతారు" అని సింగర్ సునీత అన్నారు.
"ప్రస్తుత సమానత్వ చర్చలు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి, ఇదంతా సమయం వృధా వ్యవహారం. నచ్చిన బట్టలు వేసుకోవడమే స్వేచ్ఛ అనుకుంటే పొరపాటే. అది అస్సలు ఫెమినిజం కాదు. ఒక పురుషుడితో సమానంగా నా అభిప్రాయాలకు విలువ ఇవ్వడం, నన్ను గౌరవంగా చూసుకోవడమే నిజమైన ఫెమినిజం" అని సునీత పేర్కొన్నారు.
"నా శరీరం నా హక్కు.. వాళ్ల కళ్లు నా హక్కు"
ఇంటర్వ్యూయర్ ప్రస్తుత రోజుల్లో 'మై బాడీ.. మై రైట్' (నా శరీరంపై నాకే హక్కుంది) అనే ఫెమినిస్ట్ స్లోగన్ చాలా బలంగా వినిపిస్తోందని గుర్తు చేయగా, సునీత మాట్లాడిన తీరు కొంతమందికి నచ్చడం లేదు.
"మహిళలు నా శరీరం నా హక్కు అని అంటే.. అతను కళ్లు అతని హక్కు. వాడి కళ్లు వాడి ఇష్టం. నీ శరీరం నీ ఇష్టం" అని సునీత అన్నారు. "ఇప్పుడు వాళ్లు ఫైట్ చేసే ఫ్రీడమ్ మీకు అవసరం లేదా" అని యాంకర్ అడిగితే.. "అసలు అది ఫ్రీడమ్ కిందకు రాదు నా దృష్టిలో" అని సింగర్ సునీత పేర్కొన్నారు.
సురక్షితంగా ఉన్నంతవరకు
"మీరు సురక్షితంగా ఉన్నంత వరకు ఏ బట్టలైనా వేసుకోండి. మిమ్మల్ని ఎవరూ జడ్జ్ చేయరని, చూడరని నమ్మకం ఉంటే ఎలాంటివైనా ధరించండి. వేరొకరి ఆలోచనా విధానాన్ని మార్చడం కంటే నన్ను నేను సురక్షితంగా ఉంచుకోవడం చాలా సులువు. ఇది మన సంస్కృతి కాదు. నా ఆలోచనలు పాతకాలపువి అని మీరు అనుకున్నా నాకు పర్లేదు" అని సునీత స్పష్టం చేశారు.
మహిళలు ఇళ్లల్లో, బయటా వివక్ష ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తాను కాదనడం లేదని, అయితే ఫెమినిజం పోరాటం కేవలం దుస్తులు, సిగరెట్ల చుట్టూ కాకుండా హక్కుల చుట్టూ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్
సునీత ఇంటర్వ్యూ క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వందలాది ఏళ్లుగా మహిళల పునరుత్పత్తి హక్కులు, సమానత్వం కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాలను సునిత ఒకే ఒక్క మాటతో అవమానించారని మండిపడుతున్నారు.
మరో మహిళా నెటిజన్ స్పందిస్తూ.. "మహిళలు తమ శరీర స్వయంప్రతిపత్తి గురించి మాట్లాడటాన్ని, పురుషుల ఆత్మనియంత్రణ లేమితో పోల్చడం చాలా తప్పుడు వాదన. పురుషుల మెప్పు కోసమే కొందరు ఇలాంటి సోది లెక్చర్లు ఇస్తూ మహిళల చేదు అనుభవాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సునీతకు సపోర్ట్గా
"నీకు నచ్చినట్లు, కంఫర్ట్గా బట్టలు వేసుకున్నా అని అనుకున్నప్పుడు మగాళ్లు ఎలా చూస్తే నాకేంటీ అనే మెచ్యూరిటీ ఉండాలని, అంతేకానీ నేను ఎలా డ్రెస్సులు వేసుకున్నా మీరు మాత్రం ఎలాంటి దుర్భుద్ధితో చూడకూడదు అనుకోవద్దు అంటే ఎలా అనే అర్థంలో సునీత చెప్పిన మాటలు తప్పుగా ఏమున్నాయి" అని మరో వర్గం ఆమెకు సపోర్ట్గా నిలుస్తోంది.
48 ఏళ్ల వయసులో ట్రోలింగ్
ప్రస్తుతం 48 ఏళ్ల వయసున్న సునిత 1995లో 'గులాబి' సినిమాతో సింగర్గా కెరీర్ ప్రారంభించారు. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడటంతో పాటు వందలాది సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్గానూ పనిచేసి అనేక నంది అవార్డులను అందుకున్నారు. బుల్లితెరపై 'పాడుతా తీయగా' వంటి ప్రతిష్టాత్మక షోలకు జడ్జిగా వ్యవహరించిన ఆమె, ఇప్పుడు ఈ ఫెమినిజం కామెంట్స్ వల్ల నెట్టింట హాట్ టాపిక్గా మారారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


