Sonakshi Sinha: నేనేమీ దేశద్రోహిని కాదు.. జటాధర విలన్ సోనాక్షి సిన్హా కామెంట్స్.. వీడియో!
Sonakshi Sinha On Sonam Wangchuk: దిల్లీ వేదికగా విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు జటాధర విలన్ సోనాక్షి సిన్హా మద్దతు ప్రకటించారు. వ్యవస్థ లోపాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని, తానేమి దేశద్రోహిని కాదన్నారు.
Sonakshi Sinha On Sonam Wangchuk: దేశ రాజధాని దిల్లీలో సాగుతున్న సీజేపీ (CJP) నిరసనల్లో భాగంగా సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఆయనకు అండగా నిలిచారు.

సోనాక్షి సిన్హా వీడియో
వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె ఒక పవర్ఫుల్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయనతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
లడఖ్ విద్యా సంస్కరణల కర్తగా, దేశవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన సోనమ్ వాంగ్చుక్ గత 20 రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను ఎండగడుతూ ఆయన చేస్తున్న ఈ పోరాటానికి బాలీవుడ్ నుంచి మద్దతు పెరుగుతోంది.
మనం నిర్లక్ష్యం చేయలేం
"నేను ఇప్పటివరకు ఇలాంటి బహిరంగ ప్రకటనలు ఎప్పుడూ చేయలేదు. కానీ, ఈ రోజు సోనమ్ వాంగ్చుక్ను మనం నిర్లక్ష్యం చేయలేం. ఆయన ఈ దేశానికి ఏం చేశారు, ఆయన సాధించిన విజయాలు, అందుకున్న అవార్డుల గురించి మనందరికీ తెలుసు" అని సోనాక్షి సిన్హా తన వీడియోలో పేర్కొన్నారు. 20 రోజులుగా వాంగ్చుక్ ఉపవాసం ఉంటున్నా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేకపోవడాన్ని సోనాక్షి తీవ్రంగా తప్పుపట్టారు.
"ఆయన ఆకలితో అలమటిస్తున్నారు. అసలు ఆయన ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు? ప్రాణాలు కోల్పోయిన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన పోరాడుతున్నారు. సరిగ్గా పనిచేయని వ్యవస్థకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ విషయం నాకు, మీకు, మనందరికీ తెలుసు" అని సోనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు.
మౌనాన్ని వీడండి.. నేనేమీ దేశద్రోహిని కాదు!
ఈ సున్నితమైన అంశంపై ఎంతోమంది సినీ ప్రముఖులు మౌనంగా ఉండటాన్ని సోనాక్షి ప్రశ్నించారు. సమాజంలో మార్పు కోసం నిలబడే వారికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తానేందుకు స్పందించాల్సి వచ్చిందో వివరిస్తూ సోనాక్షి సిన్హా వివరించారు.
"చాలా మంది ఇంకా మౌనంగానే ఉండిపోయారు. కానీ, నేను మాత్రం ఇక నిశ్శబ్దంగా ఉండలేను. ఏం జరిగితే అది జరుగుతుంది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన అడుగుతుంటే ఎందుకు ఎవరూ వినడం లేదు? ఎవరికీ పట్టడం లేదా? చర్చలు జరపడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఈ మాటలు చెబుతున్నందుకు నేనేమీ దేశద్రోహిని కాదు" అని సోనాక్షి స్పష్టం చేశారు.
తోడైన బాలీవుడ్ గళం.. ప్రకాష్ రాజ్ సైతం మద్దతు
సీజేపీ నిరసనల నేపథ్యంలో సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండటంపై ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలు స్పందించారు. సోనాక్షి కంటే ముందే సీనియర్ నటి జీనత్ అమన్, నటుడు ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, అభయ్ డియోల్, ఓమి వైద్య (3 ఇడియట్స్ చిత్రంలో చతుర్ పాత్రధారి) ఆయనకు సంఘీభావం ప్రకటించారు.
ఇదిలా ఉంటే, సోనమ్ వాంగ్చుక్ నిరసన తెలుపుతున్న జంతర్ మంతర్ వద్ద పెద్ద హైడ్రామా నడిచింది. సోనమ్ వాంగ్చుక్పై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
విలన్గా మెప్పించిన సోనాక్షి
ఇదిలా ఉంటే, దబాంగ్ సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా తెలుగులోనూ డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ బాబు హీరోగా చేసిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ జటాధర సినిమాలో విలన్గా మెప్పించింది సోనాక్షి సిన్హా.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


