Sonu Sood: ఆమె మాటలు చాలా సిగ్గు చేటు.. మాట్లాడే ముందు ఆలోచించాలి: కంగనా కామెంట్స్పై సోనూ సూద్ ఫైర్
Sonu Sood: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ పై ప్రముఖ నటుడు సోనూ సూద్ తీవ్రంగా స్పందించారు. జెన్ జీని జనరేషన్ గట్టర్ అని అనడంపై అసహనం వ్యక్తం చేశారు. జనం దేవుడితో సమానమని, మాట్లాడే ముందు ఆలోచించాలని అన్నారు.
Sonu Sood: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) జెన్ జీ (Gen Z) యువతను ఉద్దేశించి చేసిన "జనరేషన్ గట్టర్" వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రియల్ హీరో, నటుడు సోనూ సూద్ చాలా ఘాటుగా స్పందించారు. ప్రజలు దేవుడితో సమానమని, బహిరంగంగా మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు ప్రతీ మాట ఆలోచించి మాట్లాడాలని ఆయన గట్టిగా హితవు పలికారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటని, యువతను అవమానించేలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని సోనూ సూద్ మండిపడ్డారు.

"ఆలోచించి మాట్లాడండి".. సోనూ సూద్ స్ట్రాంగ్ కౌంటర్
మహారాష్ట్రలోని అహల్యానగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన సోనూ సూద్.. కంగనా వ్యాఖ్యలపై నేరుగా స్పందించారు. "కంగనా ఏం మాట్లాడిందో నేను పూర్తిగా వినలేదు. కానీ ఒకవేళ ఆమె నిజంగానే యువతను ఉద్దేశించి ఆ మాటలు అని ఉంటే మాత్రం అది చాలా సిగ్గుచేటు. బహిరంగంగా మాట్లాడేటప్పుడు 'తోల్ మోల్ కే బోల్' (ప్రతీ మాటను ఆచి తూచి ఆలోచించి మాట్లాడాలి) అనే సామెతను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం" అని ఆయన స్పష్టం చేశారు.
సెలబ్రిటీలను, నటులను స్టార్లను చేసేది ఈ సమాజం, ముఖ్యంగా నేటి యువత అని సోనూ సూద్ గుర్తుచేశారు. "యువత, ప్రజలు మన వెంట ఉన్నంత కాలమే మనం నటులుగా వెలుగుతాం. వారు మనతో లేకపోతే మనం ఏమీ చేయలేం. అందుకే సమాజంలోని ప్రతీ ఒక్కరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
అసలు కంగనా రనౌత్ వివాదం ఏంటి?
ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న సీజేపీ (CJP) నిరసనల్లో పాల్గొంటున్న యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నిరసనకారులను "జనరేషన్ గట్టర్" అని సంబోధిస్తూ, వారు డ్రగ్స్, ఆల్కహాల్, అనైతిక జీవనశైలిని ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు.
సొంతంగా ఒక్క రూపాయి సంపాదించే సామర్థ్యం లేక, తల్లిదండ్రుల డబ్బులపై ఆధారపడుతూ ఫేక్ విప్లవాలు చేస్తున్నారని కంగనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజమైన స్వతంత్ర మహిళలు తమ కాళ్లపై తాము నిలబడతారని, ఇలాంటి వెస్ట్రనైజ్డ్ డ్రామాలు చేయరని ఆమె రాసుకొచ్చారు.
గతంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు.. మళ్లీ మొదలైన వార్
కంగనా రనౌత్, సోనూ సూద్ మధ్య విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 'మణికర్ణిక' సినిమా షూటింగ్ సమయంలో కంగనా ప్రవర్తన నచ్చక సోనూ సూద్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ సమయంలో కూడా ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది.
ఇప్పుడు మళ్లీ జెన్ జీ యువతను కంగనా అవమానించడంతో సోనూ సూద్ బహిరంగంగా కౌంటర్ ఇవ్వడం బాలీవుడ్ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్, వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా కంగనాపై సోషల్ మీడియాలో తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
రియల్ హీరోగా సోనూ సూద్.. నెటిజన్ల మద్దతు!
కోవిడ్ లాక్డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను సొంత ఊళ్లకు చేర్చి, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలిచి 'రియల్ హీరో'గా మారిన సోనూ సూద్, ఎప్పుడూ సాధారణ ప్రజల తరఫున నిలబడటానికి ప్రాధాన్యం ఇస్తారు. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కంగనా రనౌత్, ఇటీవల ఎంపీగా గెలిచిన తర్వాత కూడా తన వైఖరిని మార్చుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ దేశ యువతను "గట్టర్" అని సంబోధించడం తగదని, సోనూ సూద్ చెప్పినట్లు ప్రతీ మాట ఆలోచించి మాట్లాడాలని నెటిజన్లు కూడా సోనూ సూద్కే మద్దతు తెలుపుతున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


