మా ఆయనకు నేను నటించిన ఈ సినిమా అంటే చాలా ఇష్టం.. చూడమని అందరికీ చెబుతాడు: ఎస్ఎస్ఎంబీ 29 స్టార్ ప్రియాంకా కామెంట్స్
ఎస్ఎస్ఎంబీ 29లో మహేష్ బాబు సరసన నటిస్తున్న స్టార్ హీరోయిన ప్రియంకా చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను నటించిన ఒక సినిమా అంటే తన భర్త నిక్ జోనస్ కు బాగా ఇష్టమని ఆమె చెప్పింది. అంతేకాదు అందరికీ చూడమని కూడా చెబుతాడని తెలిపింది.
నటి ప్రియాంక చోప్రా జోనస్ లండన్లో దీపావళి సంబరాలు చేసుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన భర్త నిక్ జోనస్కు బాగా నచ్చిన తన బాలీవుడ్ సినిమా పేరును రివీల్ చేసింది. అంతేకాదు మహేష్ బాబుతో కలిసి చేయబోయే మెగా ప్రాజెక్ట్పైనా ఆసక్తికర వివరాలు వెల్లడించింది. మరి ఆమె భర్తకు నచ్చిన ఆ సినిమా ఏదో చూడండి.

ప్రియాంకా భర్తకు నచ్చిన మూవీ ఇదే
ప్రియాంకా చోప్రా జోనస్ చాలా రోజుల కిందటే హాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడి సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్నా.. ఇప్పటికే భారతీయ పండుగలు, సాంప్రదాయాలను పాటిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. అయితే బ్రిటిష్ వోగ్ (British Vogue) పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రియాంక ఈ పండుగపై తన ప్రేమ గురించి.. అలాగే తన సినిమాల గురించి తెలియని వారికి తాను ఏ బాలీవుడ్ సినిమాను సిఫార్సు చేస్తానో కూడా వెల్లడించింది.
తొలిసారిగా తన సినిమాలను చూసే వారికి ఏ సినిమాను చూడాలని మీరు సజెస్ట్ చేస్తారు అని అడిగినప్పుడు.. ప్రియంకా ఇలా స్పందించింది. "నేను ఈ సినిమానే చెప్తాను. ఎందుకంటే నా భర్త నిక్ జోనస్ నా సినిమాల్లో దీన్నే సిఫార్సు చేస్తారు. ఆయన చాలా తక్కువ బాలీవుడ్ సినిమాలను చూశారు. అది దిల్ ధడక్నే దో (Dil Dhadakne Do). బాలీవుడ్ సినిమాలు చూడని నా స్నేహితులు కూడా ఈ సినిమాను చాలా ఇష్టపడ్డారు. అందుకే ఇది మంచి సినిమా అని నేను అనుకుంటాను" అని చెప్పింది.
ప్రియంక, నిక్ పెళ్లి
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్లు 2018 డిసెంబర్లో రాజస్థాన్లోని జోధ్పూర్, ఉమైద్ భవన్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరు హిందూ, క్రైస్తవ సంప్రదాయాలను మేళవించి వివాహం చేసుకున్నారు. ఈ జంట 2022 జనవరిలో సరోగసీ ద్వారా కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనస్ను స్వాగతించారు.
ఇక ఆమె చెప్పిన సినిమా విషయానికి వస్తే.. 2015లో విడుదలైన దిల్ ధడక్నే దో చిత్రంలో ప్రియాంక చోప్రాతో పాటు రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, ఫర్హాన్ అక్తర్, అనిల్ కపూర్, షెఫాలీ షా వంటి వాళ్లు నటించారు. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఒక క్రూయిజ్ ట్రిప్లో పాల్గొన్న మెహ్రా కుటుంబం గురించి తీశారు. వారి జీవితంలోని సమస్యలు, భావోద్వేగాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, వాణిజ్యపరంగా కూడా విజయం సాధించింది. సుమారు రూ.58 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.145 కోట్లు వసూలు చేసింది.
ప్రియాంక రాబోయే ప్రాజెక్ట్లు
ప్రియాంక చివరిగా హిందీలో 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలో ఆమె ప్రేమ, బాధలతో పోరాడే తల్లి పాత్ర పోషించింది. అప్పటి నుంచి ఆమె అంతర్జాతీయ ప్రాజెక్టులపై దృష్టి పెట్టినప్పటికీ, త్వరలోనే భారతీయ సినిమాకు అద్భుతమైన కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించబోయే తదుపరి చిత్రం, తాత్కాలికంగా SSMB29గా పిలుస్తున్న సినిమాలో మహేష్ బాబుతో కలిసి ప్రియాంక నటిస్తోంది. ఈ చిత్రం 2026 నాటికి ప్రొడక్షన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

E-Paper












