Chiranjeevi: నీ చేయి పట్టుకొని నడిచాను.. నీ సినిమానే ప్రొడ్యూస్ చేసే స్థాయికి చేరాను..: చిరుకి థ్యాంక్స్ చెబుతూ సుష్మిత
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల మంగళవారం (మార్చి 10) తన పుట్టిన రోజు సందర్భంగా తండ్రికి థ్యాంక్స్ చెబుతూ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. అంతకుముందు చిరు ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి కూతురు, ప్రముఖ నిర్మాత సుష్మిత కొణిదెల తన తండ్రి పట్ల ఉన్న అపారమైన ప్రేమాభిమానాలను చాటుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. చిన్నప్పుడు తండ్రి చేయి పట్టుకుని షూటింగ్ సెట్స్లో అడుగుపెట్టిన ఆ రెండేళ్ల చిన్నారి నుంచి, నేడు తండ్రి నటించే సినిమాలకు నిర్మాతగా ఎదిగిన తన ప్రయాణం ఒక అద్భుతమైన వరం అని ఆమె పేర్కొంది.

తండ్రి, గురువు, మెగాస్టార్.. అంతా ఆయనే
తన పుట్టినరోజు సందర్భంగా తండ్రి చిరంజీవి అందించిన శుభాకాంక్షలకు స్పందిస్తూ సుష్మిత ఈ ఎమోషనల్ నోట్ రాసింది. "థాంక్యూ డాడీ.. ఆశ్చర్యంగా చూసే రెండేళ్ల వయసులో మీ చేయి పట్టుకుని సెట్స్లోకి అడుగుపెట్టాను. ఇప్పుడు మీ సినిమాకే నిర్మాతగా మారాను. నా జీవితం నిజంగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం" అని సుష్మిత తన మనసులోని మాటను పంచుకుంది.
"నాకు ఒకే వ్యక్తిలో తండ్రి, మార్గదర్శి, రియల్ లైఫ్ హీరో, మెగాస్టార్.. ఇలా అందరూ కనిపిస్తారు. ఇంతకంటే ఇంకేం కావాలి? మీ దీవెనలకు, ఎప్పుడూ నా పక్కన ఉన్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను" అని ఆమె రాసుకొచ్చింది.
కాస్ట్యూమ్ డిజైనర్ నుండి నిర్మాత వరకు..
సుష్మిత కొణిదెల తన తండ్రి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు 'గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్పై నిర్మాతగా రాణిస్తోంది. చిరంజీవి ప్రధాన పాత్రలో ఆమె నిర్మించిన మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్బస్టర్ అయిన విషయం తెలిసిందే. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ఈ అనుబంధం చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది.
వేలు పట్టుకుని నడిచిన చిన్నారి..
అంతకుముందు సుష్మితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ఒక ఎమోషనల్ నోట్ రాశాడు. "పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియమైన సుష్మిత.. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కనే నడిచిన ఆ చిన్నారి నుంచి, నేడు ఎంతో ధైర్యవంతురాలైన, హుందాతనంతో కూడిన బాధ్యతాయుతమైన మహిళగా నీ ఎదుగుదల చూస్తుంటే ముచ్చటేస్తోంది" అని పేర్కొన్నాడు.
తండ్రిగా గర్వపడే క్షణం: బ్లాక్ బస్టర్ విజయం
ఒక తండ్రిగా తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణాల గురించి వివరిస్తూ.. "నా సినిమాలు చూస్తూ పెరిగిన నువ్వు, ఇప్పుడు నా సినిమాకే నిర్మాతగా మారి, నాకు ఒక చిరస్మరణీయమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించావు. ఆ క్షణం ఒక తండ్రిగా నన్ను ఎంతో గర్వపడేలా చేసింది" అని చిరంజీవి కొనియాడాడు.
"నువ్వు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా చిట్టి హనీ పాప ఇలాగే ఎప్పుడూ మెరిసిపోతూ ఉండాలి. నా ప్రేమాశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి" అంటూ తన సందేశాన్ని ముగించాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


