Jana Nayagan: ‘ఎ’ సర్టిఫికెట్ మూవీ పిల్లలెలా చూస్తారు? సీఎం సినిమానే అడ్డుకున్న పోలీసులు.. ఏం జరిగిందంటే?
Jana Nayagan: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ జన నాయగన్ మూవీ షోని మధ్యలోనే ఆపేశారు పోలీసులు. ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలను పిల్లలతో కలిసి చూస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఏకంగా సీఎం నటించిన సినిమాకే ఇలా జరగడం చర్చనీయాంశమైంది.
Jana Nayagan: తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) ఫేర్వెల్ మూవీ 'జన నాయగన్' (Jana Nayagan) థియేటర్ల దగ్గర ఊహించని రచ్చ జరుగుతోంది. సెన్సార్ బోర్డు 'A' (Adults Only) సర్టిఫికేట్ ఇచ్చిన ఈ సినిమాకు పేరెంట్స్ తమ చిన్న పిల్లలను తీసుకురావడంతో చెన్నైలోని పలు మల్టీప్లెక్స్లలో షోలు నిలిచిపోయాయి.

7 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జులై 23న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను చూడటానికి ఫ్యాన్స్ విపరీతంగా పోటెత్తారు. అయితే సెన్సార్ రూల్స్ కారణం చూపి మైనర్లను లోపలికి అనుమతించకపోవడంతో థియేటర్ మేనేజ్మెంట్, పేరెంట్స్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు మొదలయ్యాయి.
మల్టీప్లెక్స్లలో రచ్చ.. రంగంలోకి పోలీసులు!
చెన్నైలోని పీవీఆర్ అంపా మాల్, పల్లవరం పీవీఆర్ గ్రాండ్ లాంటి ప్రముఖ థియేటర్లలో మైండ్ బ్లాకింగ్ సీన్లు కనిపించాయి. 'A' సర్టిఫికేట్ రూల్స్ ప్రకారం 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను లోపలికి రానిచ్చేది లేదని థియేటర్ యాజమాన్యం స్పష్టం చేసింది. దీన్ని తప్పుబడుతూ పేరెంట్స్, విజయ్ ఫ్యాన్స్ థియేటర్ సిబ్బందితో తీవ్రమైన వాగ్వాదానికి దిగారు.
ఈ గొడవ కారణంగా ఆయా స్క్రీన్లలో దాదాపు అరగంట నుంచి గంట వరకు షోలు పూర్తిగా ఆగిపోయాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో థియేటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గొడవ పడుతున్న పేరెంట్స్కు నచ్చజెప్పి మైనర్ పిల్లలను బయటకు పంపించేశారు.
రీఫండ్ కోసం క్యూ లైన్లు.. సోషల్ మీడియాలో పోస్టుల వైరల్!
పిల్లలను లోపలికి అనుమతించకపోవడంతో టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ బాక్సాఫీస్ కౌంటర్ల దగ్గర జనాలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. పిల్లలతో వచ్చిన వారికి రీఫండ్ ప్రాసెస్ చేయడం వల్ల షోలు మరింత ఆలస్యమయ్యాయి. సాధారణ ఆడియన్స్ తమ షోలు ఆలస్యం అవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ప్లాట్ఫామ్లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ విషయంపై భిన్నంగా స్పందిస్తున్నారు. 'A' సర్టిఫికేట్ ఉందని తెలిసి కూడా పిల్లలను థియేటర్లకు తీసుకురావడం పేరెంట్స్ తప్పేనని, రూల్స్ పాటించకపోతే థియేటర్ లైసెన్స్ రద్దవుతుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
'భగవంత్ కేసరి' రీమేక్..!
డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించిన 'జన నాయగన్' సినిమా తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్-టైమ్ హిట్ 'భగవంత్ కేసరి'కి అధికారిక రీమేక్గా వచ్చింది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే, మమితా బైజు కథానాయికలుగా నటించగా, విలన్గా బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ పవర్ఫుల్ రోల్ పోషించారు.
జైలు నుంచి బయటకు వచ్చిన ఒక మాజీ ఖైదీ, తన పెంపుడు కూతురిని ఆర్మీలోకి పంపడం కోసం ఎదుర్కొన్న సవాళ్లు, పాత శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఎమోషనల్ యాక్టింగ్, హెచ్. వినోద్ మార్క్ యాక్షన్ సీక్వెన్సెస్ తమిళ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఫేర్వెల్ మూవీ కావడం వల్లే ఈ రేంజ్ రష్!
పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్కి ఇది నటుడిగా చివరి సినిమా కావడం వల్ల కోలీవుడ్లో ఈ ప్రాజెక్ట్ చుట్టూ విపరీతమైన హైప్ నెలకొంది. తమ అభిమాన కథానాయకుడిని చివరిసారిగా బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ కుటుంబసమేతంగా థియేటర్లకు తరలివస్తున్నారు.
అయితే ఎంత క్రేజ్ ఉన్నా సరే సెన్సార్ రూల్స్ ప్రకారం 'A' సర్టిఫికేట్ ఉన్న సినిమాలకు పిల్లలను తీసుకురాకూడదని థియేటర్ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వివాదం సర్దుమణిగి షోలు సజావుగా సాగాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


