సినిమా టికెట్ల ధరలను పెంచుకోండి.. అనుమతి ఇస్తాం.. కానీ అలా చేస్తేనే: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తామని చెబుతూనే ఓ కండిషన్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ పెంచిన ధరల్లో 20 శాతం సినీ కార్మికులకు ఇస్తేనే ఆ జీవో తెస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా టికెట్ల ధరల పెంపుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 ఘటన తర్వాత తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదని చెప్పిన ఆయన.. తాజాగా ధరల పెంపుకు అనుమతి ఇస్తామని చెబుతూనే ఓ షరతు విధించారు. అదేంటో చూడండి.

జీవో తెస్తాం.. కానీ వాళ్లకూ వాటా ఇవ్వాల్సిందే
తెలంగాణలోనూ సినిమా టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేస్తామని, అయితే అది జరగాలంటే టికెట్ల పెంపు వల్ల వచ్చిన ఆదాయంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం (అక్టోబర్ 28) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సినీ కార్మికులు కలిసి సీఎంకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందే రేవంత్ ఈ కామెంట్స్ చేశారు.
“పెద్ద పెద్ద సినిమాల హీరోలు, ప్రొడ్యూసర్లు వాళ్ల సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన.. పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమాల టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది. నిర్మాతలకు వస్తుంది. మరి సినీ కార్మికులకు మాత్రం అదనంగా ఒక్క రూపాయి రావడం లేదు. అందుకే ఈ వేదికపై నుంచి మీకు మాట ఇస్తున్నా.. ఆ ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమయంలో ఆయన వెనుకాలే ఉన్న నిర్మాత దిల్ రాజు నవ్వుతూ, చప్పట్లు కొడుతూ కనిపించాడు.
ప్రతి రూపాయిలో వాటా
రేవంత్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. “మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి. భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీది నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా.. భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత పేరున్న వ్యక్తి అయినా.. రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20 శాతం కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కింద నగదు బదిలే జరిగితేనే ప్రభుత్వం జీవో ఇస్తుందని, ఆమేరకు నిబంధనలను సవరిస్తానని మాట ఇస్తున్నాను” అని రేవంత్ రెడ్డి అన్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


