Ticket Price: సింగిల్ స్క్రీన్లు మూతపడాల్సిందేనా.. మమ్మల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి: టికెట్ల ధరలపై ఫిల్మ్ ఛాంబర్
Telangana Movie Ticket Prices G.O.: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 77పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్పెషల్ థియేటర్ కేటగిరీ ధర భారీగా పెంచడంపై అసంతృప్తిగా ఉంది.
Telangana Movie Ticket Price G.O.: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు, థియేటర్ల వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 77 టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సామాన్య సినీ ప్రేక్షకుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కొత్త నిబంధనలపై పునఃసమీక్ష జరపాలని కోరుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అత్యవసరంగా లేఖ రాసింది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది.

జీవో 77లో అసలు ఏముంది? బిజినెస్ సమీకరణాలు ఇవే
ఆగస్టు 14న రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 ప్రకారం రాష్ట్రంలోని సినిమా హాళ్లను నాన్-ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లుగా వర్గీకరించారు. ఇందులో 2K/4K ప్రొజెక్షన్, డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ ఉన్న సింగిల్ స్క్రీన్లకు 'స్పెషల్ థియేటర్' కేటగిరీ కింద గరిష్టంగా రూ. 300 వరకు టికెట్ రేటు నిర్ణయించే వెసులుబాటు కల్పించారు.
హైదరాబాద్తో పాటు తెలంగాణలోని మెజారిటీ సింగిల్ స్క్రీన్లు ఈ స్పెషల్ కేటగిరీ కిందకే వస్తాయి. దీనివల్ల మల్టీప్లెక్స్ రేట్లతో సమానంగా సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు పెరిగిపోయి, సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతుందని ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఫిల్మ్ ఛాంబర్ అభ్యంతరం.. సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రమాదంలో..
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ గౌరవ కార్యదర్శి వి. ఎల్. శ్రీధర్, ప్రెసిడెంట్ జె. చంద్రశేఖర్ రావు ప్రతినిధులుగా వెలువడిన ఈ లేఖలో కీలక విజ్ఞప్తులు చేశారు. చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఛాంబర్ స్పష్టం చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమ భాగస్వాములతో సంప్రదింపులు లేకుండా టికెట్ ధరలు మార్చేస్తే ఆ ప్రభావం థియేటర్ల ఫుట్ఫాల్స్పై పడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమలోని ప్రధాన భాగస్వాములైన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది.
సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేయాలి.. టాలీవుడ్ డిమాండ్
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గుర్తింపు పొందిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్లతో ప్రభుత్వం తక్షణమే ఒక సంప్రదింపుల సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో అభ్యర్థించారు. అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించే వరకు ఈ అంశాన్ని పునఃసమీక్షలో ఉంచాలని కోరారు.
ఓటీటీల పోటీని తట్టుకుని థియేటర్లకు జనాన్ని రప్పించడం ఇప్పటికే పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు టికెట్ రేట్లు రూ. 300కి చేరితే మధ్యతరగతి కుటుంబాలు థియేటర్లకు దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల చిన్న, మిడ్ రేంజ్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా పడిపోతాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రభుత్వం స్పందనపైనే టాలీవుడ్ భవిష్యత్తు
టికెట్ ధరల పెంపు వల్ల వచ్చే లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ల క్షేత్రస్థాయి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫిల్మ్ ఛాంబర్ చేసిన విజ్ఞప్తిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


