అఖండ 2 మూవీకి గట్టి షాకే ఇచ్చిన హైకోర్టు.. టికెట్ల ధర పెంపు జీవో రద్దు..
అఖండ 2 మూవీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఈ సినిమా టికెట్ల ధరల పెంపు జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. గురువారం (డిసెంబర్ 11) దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ నిర్ణయం తీసుకుంది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమాకు అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. న్యాయ పరమైన చిక్కుల కారణంగా రిలీజ్ వారం రోజులు ఆలస్యం కాగా.. ఇప్పుడు తెలంగాణలో టికెట్ల ధర పెంపును కూడా హైకోర్టు అడ్డుకుంది. మరికొన్ని గంటల్లో మూవీ రిలీజ్ కానుండగా.. ఈ తీర్పు మేకర్స్ కు గట్టి షాకే ఇచ్చింది.
అఖండ 2 మూవీకి గట్టి షాకే ఇచ్చిన హైకోర్టు.. టికెట్ల ధర పెంపు జీవో రద్దు..
అఖండ 2 టికెట్ల ధరల పెంపు జీవో రద్దు
అఖండ 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉన్నా.. వారం ఆలస్యంగా ఈ శుక్రవారం (డిసెంబర్ 12) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీనికోసం బుధవారం (డిసెంబర్ 10) తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. తొలి మూడు రోజులు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంచుకోవడంతోపాటు ప్రీమియర్ షోలకు రూ.600గా టికెట్ల ధరను నిర్ణయించారు. అయితే ఈ జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
గురువారం (డిసెంబర్ 11) అడ్వొకేట్ శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది. సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు వచ్చిన ఈ నిర్ణయం నిర్మాతలకు షాక్ ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోపాటు మూవీ నిర్మాతలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
అఖండ 2 మూవీ గురించి..
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ 2. 2021లో వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. దేశమంతా తిరిగారు.
డిసెంబర్ 5నే రిలీజ్ కావాల్సి ఉన్నా.. న్యాయపరమైన చిక్కులతో చివరి నిమిషంలో వాయిదా వేయక తప్పలేదు. ఆ చిక్కులు తొలగి ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమైనా.. టికెట్ల ధర పెంపు లేదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిర్మాతలను షాక్ కు గురి చేసింది. మరి ప్రీమియర్లపై వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.