ఓటీటీలోకి 15 రోజుల్లోనే వస్తున్న తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ.. మెల్లకన్నును నల్ల కళ్లద్దాలతో దాచి.. 8.5 రేటింగ్
ఓటీటీలోకి కేవలం రెండు వారాల్లోనే ఓ తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ నెల 6న థియేటర్లలో విడుదల కాగా.. వచ్చే వారమే డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. మరి ఆ సినిమా ఏంటి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
మలయాళంలాంటి ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో ప్రయోగాలు చాలా తక్కువనే చెప్పాలి. వచ్చే కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కనిపించకుండానే వెళ్లిపోతాయి. అలాంటిదే ఓ మూవీ శ్రీ చిదంబరం గారు. ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫిబ్రవరి 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.5 రేటింగ్ నమోదైంది.

శ్రీ చిదంబరం గారు ఓటీటీ రిలీజ్
కొత్త నటీనటులతో తెరకెక్కిన ఎమోషనల్ రూరల్ డ్రామా శ్రీ చిదంబరం గారు. ఈ సినిమాను వచ్చే గురువారం అంటే ఫిబ్రవరి 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. “మనసులను కదలించిన స్టోరీ.. ఓ బ్లాక్బస్టర్ సెన్సేషన్ అయింది. శ్రీ చిదంబరం గారు ఎ విన్ డిజిటల్ ప్రీమియర్ ఫిబ్రవరి 19న కేవలం ఈటీవీ విన్లో” అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది.
శ్రీ చిదంబరం గారు మూవీ స్టోరీ, విశేషాలు
'శ్రీ చిదంబరం గారు' సినిమాకు వినయ్ రత్నం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా హీరో హీరోయిన్లుగా నటించారు. వీళ్లతోపాటు గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
గోదావరి పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ఈ 'శ్రీ చిదంబరం గారు'. మెల్లకన్ను కారణంగా నలుగురిలో తిరగలేక, ఎగతాళిని తట్టుకోలేక సతమతమయ్యే సాల్మన్ (వంశీ) అనే యువకుడి కథ ఇది. కళ్ళజోడు వెనుక తన లోపాన్ని దాచుకుంటూ, అభద్రతా భావంతో బతికే అతడు.. ప్రేమ, ఆత్మవిశ్వాసం వైపు ఎలా ప్రయాణించాడు అనేదే ఈ సినిమా కథాంశం.
సాల్మన్ ఈ కథలో ప్రధాన పాత్రధారి. ఊరిలో అందరూ అతన్ని చిదంబరం అని పిలుస్తుంటారు. పైకి సాధారణంగా కనిపించినా.. సాల్మన్ మనసులో పెద్ద అలజడి ఉంటుంది. దానికి కారణం అతనికి ఉన్న ‘మెల్ల కన్ను’.
ఇలాంటి పరిస్థితుల్లో అతని జీవితంలోకి ప్రేమ ప్రవేశిస్తుంది. ఆ ప్రేమ సాల్మన్ అభద్రతా భావాన్ని మరింత పరీక్షిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరాశ అనే నీడ నుంచి బయటకు వచ్చి ఆత్మవిశ్వాసంతో సాల్మన్ ఎలా అడుగులు వేశాడు అనేదే ఈ మూవీ మిగిలిన కథ. ఇది భారీ మలుపులు ఉన్న సినిమా కాదు. చాలా సరళమైన, నిజాయితీ కలిగిన కథ. మనలో ఉండే భయాలను జయించి, మనల్ని మనం ఎలా గౌరవించుకోవాలో చెప్పే ఒక సున్నితమైన ప్రయత్నమే 'శ్రీ చిదంబరం గారు'.
బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోవడంతో 15 రోజుల్లోనే మూవీని ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో చూసేయండి.

E-Paper












