విజయ్ ఎవరికీ భయపడడు.. ఇలాంటి అడ్డంకులు మరెన్నో వస్తాయి: తండ్రి చంద్రశేఖర్ కామెంట్స్
దళపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు చివరి సినిమాగా భావిస్తున్న ‘జన నాయగన్’ విడుదలలో ఆలస్యం జరుగుతోంది. సెన్సార్ సమస్యలు, కోర్టు కేసుల కారణంగా జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ వివాదంపై విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ స్పందించాడు.
దళపతి విజయ్ రాజకీయాల్లోకి (టీవీకే పార్టీ) వెళ్లే ముందు నటిస్తున్న చివరి మూవీ కావడంతో ‘జన నాయగన్’ (Jana Nayagan)పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సెన్సార్ కష్టాలు ఎదురయ్యాయి. "మా చేతిలో లేని అనివార్య కారణాల వల్ల" సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మద్రాస్ హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరుగుతున్నా, విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ మౌనం వీడాడు.

విజయ్ భయపడడు..
దళపతి విజయ్ తండ్రి, డైరెక్టర్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. "కరూర్ లో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. విజయ్ దేనికీ భయపడడు. అతని విజయావకాశాలు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి ఇలాంటి అడ్డంకులు ఎదురవడం సహజమే. విజయ్ ఇలాంటి ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొంటాడు" అని అతడు స్పష్టం చేశాడు.
అలాగే విజయ్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదని, అలా చేస్తే అతని స్వతంత్ర గుర్తింపు దెబ్బతింటుందని ప్రజలు సలహా ఇస్తున్నారని కూడా అతడు వెల్లడించాడు.
జన నాయగన్ వివాదం ఏంటి?
దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ అసలు గొడవ సెన్సార్ సర్టిఫికెట్ దగ్గర మొదలైంది. సినిమాను రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు జనవరి 5న సీబీఎఫ్సీ నుంచి నిర్మాతలకు సమాచారం వచ్చింది. దీనివల్ల సర్టిఫికేషన్ 20 రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించగా సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వాలని జనవరి 9న సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. అయితే అదే రోజు సీబీఎఫ్సీ దీన్ని సవాలు చేసింది. నిర్మాతలు సుప్రీంకోర్టుకు వెళ్లినా, అక్కడ ఊరట లభించలేదు. జనవరి 20న హైకోర్టులోనే తేల్చుకోమని సూచించింది.
రివైజింగ్ కమిటీకి పంపినట్లు తమకు అధికారిక 'ఆర్డర్' రాలేదని, కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని కేవీఎన్ ప్రొడక్షన్స్ తరపు న్యాయవాది వాదించారు. అలాగే ఎగ్జామినింగ్ కమిటీ సభ్యులే ఫిర్యాదుదారులుగా ఉండకూడదని పేర్కొన్నారు.
హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ జన నాయగన్ మూవీ బాలకృష్ణ నటించిన తెలుగు సినిమా ‘భగవంత్ కేసరి’కి రీమేక్. ఇందులో మమితా బైజు, బాబీ డియోల్, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


