జన నాయగన్ రిలీజ్‌పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌- ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ప్రెష‌ర్‌- కోర్టు తీర్పు రిజ‌ర్వ్‌

విజయ్ దళపతి నటించిన 'జన నాయగన్' సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. సెన్సార్ సర్టిఫికేట్ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మరోవైపు ఓటీటీ నుంచి ఒత్తిడి ఉందని నిర్మాతలు అంటున్నారు. 

Published on: Jan 21, 2026 8:33 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమా ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మూవీ నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్ వర్సెస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మధ్య కోర్టు కేసు కొనసాగుతోంది. దీనిపై తీర్పును తాజాగా మద్రాస్ హై కోర్టు రిజర్వ్ చేసింది. ఈ తీర్పు వెలువడ్డ తర్వాత జన నాయగన్ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రానుంది.

విజయ్ దళపతి
విజయ్ దళపతి

జన నాయగన్ రిలీజ్ డేట్

విజయ్ దళపతి యాక్టింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పటికే పొలిటికల్ పార్టీ స్థాపించిన ఆయన తన చివరి సినిమా ‘జన నాయగన్’ అని ఇప్పటికే ప్రకటించేశారు. నిజానికి జన నాయగన్ సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 9న రిలీజ్ కావాల్సింది. టికెట్లు బుకింగ్స్ కూడా అప్పుడు స్టార్ట్ అయ్యాయి. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.

కోర్టు కేసు

జన నాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా సీబీఎఫ్సీ లేట్ చేస్తుందంటూ మూవీ నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. వెంటనే విచారణ జరపాలన్నారు. కానీ హై కోర్టు అందుకు అంగీకరించలేదు. దీంతో మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత కోర్టు కేసును విచారణకు తీసుకుంది. మరోవైపు జన నాయగన్ సెన్సార్ సర్టిఫికేట్ కోసం రివ్యూ కమిటీకి పంపామని సీబీఎఫ్సీ పేర్కొంది.

ఆ తీర్పు అప్పీల్

జన నాయగన్ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని మద్రాస్ హై కోర్టు సింగిల్ బెంచ్ సెన్సార్ బోర్డును గతంలో ఆదేశించింది. కానీ దీనిపై సెన్సార్ బోర్డు అప్పీల్ చేయడంతో డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నేపథ్యంలో CBFC తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఏఆర్ఎల్ సుందరేశన్ హాజరై, సినిమాను రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు బోర్డు పంపిన కమ్యూనికేషన్‌ను నిర్మాతలు కోర్టులో ఎప్పుడూ సవాలు చేయలేదని పేర్కొన్నారు.

సెన్సార్ బోర్డు ఉత్తర్వు

కోర్టు కేసు లేకపోతే, జనవరి 26 నాటికి 'జన నాయగన్' రివైజింగ్ కమిటీ నుండి నిర్ణయం పొందేదని కూడా ఏఎస్జీ సూచించారు. మరోవైపు సీనియర్ న్యాయవాది సతీష్ పారసరన్ KVN ప్రొడక్షన్స్ తరపున వాదించారు. 'జన నాయగన్'ను రివైజింగ్ కమిటీకి పంపడంపై సెన్సార్ బోర్డు నుంచి అసలు ఆర్డర్స్ రాత పూర్వకంగా ఇంకా రాలేదని వాదించారు. నిర్మాతలు కేవలం సమాచారం మాత్రమే అందుకున్నారన్నారు.

ఓటీటీ ప్లాట్ ఫామ్

డిసెంబర్ 25 నుండి జనవరి 5 మధ్య CBFC నుండి ఎటువంటి నిర్దిష్టమైన సమాచారం లేకపోవడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారని కూడా వెల్లడించారు. విడుదల తేదీపై స్పష్టత లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ కూడా డిసెంబర్ 31న నిర్మాతలకు తెలియజేసింది.

మరోవైపు సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా రిలీజ్ డేట్ ఎలా ప్రకటిస్తారని సెన్సార్ బోర్డు తరపున న్యాయవాది వాదించారు. అయితే ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించిన 'ధురంధర్ 2' ను నిర్మాతల తరపున లాయర్ ఉదాహరణగా పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.