దిగి వచ్చిన దళపతి విజయ్ జన నాయగన్ మేకర్స్.. హైకోర్టులో సీబీఎఫ్సీపై వేసిన రిట్ పిటిషన్ వెనక్కి..
దళపతి విజయ్ జన నాయగన్ మూవీ మేకర్స్ మొత్తానికి దిగి వచ్చారు. సెన్సార్ బోర్డుతో నెల రోజులకుపైగా నడుస్తున్న యుద్ధానికి తెరదించే ప్రయత్నం చేశారు. బోర్డుపై మద్రాస్ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.
దళపతి విజయ్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' (Jana Nayagan) విడుదల వివాదం మరో మలుపు తిరిగింది. సెన్సార్ బోర్డు (CBFC) తీరును సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది. దీంతో ఇప్పుడు సినిమా రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లనుంది.
పిటిషన్ వెనక్కి.. రివైజింగ్ కమిటీకి సినిమా
హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్, మమితా బైజు, పూజా హెగ్డే, బాబీ డియోల్ నటించిన భారీ బడ్జెట్ మూవీ 'జన నాయగన్'. జనవరి 9న పొంగల్ కానుకగా విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ చిక్కుల్లో పడి వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందంటూ మూవీ టీమ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే వారాల తరబడి సాగిన ఈ న్యాయ పోరాటానికి నిర్మాతలు స్వస్తి పలికారు.
నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తరపు న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రీకి ఒక లేఖ సమర్పించారు. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా తాము వేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ లేఖపై జస్టిస్ పి.టి. ఆశా నేతృత్వంలోని బెంచ్ ఫిబ్రవరి 10న విచారణ జరిపి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. నిర్మాతల తాజా నిర్ణయంతో ఈ సినిమా ఇప్పుడు నిబంధనల ప్రకారం సెన్సార్ బోర్డులోని 'రివైజింగ్ కమిటీ' పరిశీలనకు వెళ్లనుంది.
జన నాయగన్ వర్సెస్ సీబీఎఫ్సీ టైమ్లైన్
డిసెంబర్ 19, 2025: సీబీఎఫ్సీ ఎగ్జామినింగ్ కమిటీ సినిమాను చూసింది.
డిసెంబర్ 22: 14 కట్స్, మార్పులతో సినిమాకు 'UA 16+' సర్టిఫికేట్ ఇస్తామని బోర్డు చెప్పింది.
డిసెంబర్ 24: బోర్డు సూచించిన మార్పులు చేసి నిర్మాతలు సినిమాను మళ్ళీ సమర్పించారు.
జనవరి 5: సర్టిఫికేట్ రాకపోవడంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. అదే రోజు, ఎగ్జామినింగ్ కమిటీ సభ్యుడి ఫిర్యాదు మేరకు సినిమాను రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు బోర్డు తెలిపింది.
కోర్టు తీర్పులు: మొదట సింగిల్ జడ్జి (జస్టిస్ ఆశా) జనవరి 9లోపు సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించినా, డివిజన్ బెంచ్ దానిపై స్టే విధించింది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
జనవరి 27: సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. బోర్డు నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం నిర్మాతలకు ఇచ్చినా, వారు ఆ మార్గాన్ని ఎంచుకోకుండా పిటిషన్ వెనక్కి తీసుకుని రివైజింగ్ కమిటీకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు రివైజింగ్ కమిటీ సినిమాను చూసి ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఎప్పుడు సర్టిఫికేట్ ఇస్తుంది? అనేది వేచి చూడాలి. దానిని బట్టే దళపతి విజయ్ చివరి సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తేలనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












