Thalapathy Vijay: పూలను బాంబ్ అనుకొని పరుగో పరుగు.. మీమ్ మెటీరియల్గా దళపతి విజయ్ వీడియో.. నెట్టింట వైరల్
Thalapathy Vijay: తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీవీకే అధినేత విజయ్ కన్యాకుమారిలో సైకిల్ యాత్ర చేస్తూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఒక అభిమాని పూలు చల్లగా, అది ఏదో ప్రమాదమని భావించి అతను పరుగు తీశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ‘మీమ్ మెటీరియల్’గా మారిందనే కామెంట్లు వస్తున్నాయి. కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారంలో విజయ్ భయంతో తన బస్ లోకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ ప్రచారం
సినిమాలకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లో ఎంటరైన తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ ఎన్నికల్లో పార్టీ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒంటరిగానే పోటీ చేస్తున్న విజయ్ ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాడు. తాజాగా కన్యాకుమారిలో ప్రచారంలో భాగంగా సైకిల్ తొక్కుతూ రోడ్డుపై విజయ్ వెళ్లాడు.
బాంబ్ అనుకొని
విజయ్ తన సెక్యూరిటీ సిబ్బంది వెంటరాగా ఉత్సాహంగా సైకిల్ తొక్కుతూ రోడ్డుపై వెళ్లాడు. ఇరువైపులా ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో.. ఒక అభిమాని హఠాత్తుగా విజయ్ పైకి పూల రెక్కలు చల్లేందుకు ప్రయత్నించాడు.
అయితే. ఊహించని విధంగా తనపైకి ఏదో వస్తువు విసిరినట్లు భావించిన విజయ్, అది బాంబ్ అనుకొని భయపడినట్లు కనిపించాడు. వెంటనే సైకిల్ దిగిపోయి, వెనుకాలే వస్తున్న తన ప్రచార వాహనం (వ్యాన్) వైపు వేగంగా పరుగులు తీశాడు. ఆ సమయంలో విజయ్ ముఖంలో స్పష్టమైన ఆందోళన కనిపించింది.
వీడియో వైరల్
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ‘‘టీవీకే హ్యాండిల్ తొలుత ఈ వీడియోను పోస్ట్ చేసి, ఆ తర్వాత డిలీట్ చేసింది. సైకిల్ పై ప్రచారంలో ఉన్న విజయ్, అభిమాని పూలు చల్లగానే అది బాంబు అనుకుని సైకిల్ వదిలేసి పరుగులు తీశాడు" అని ఓ యూజర్ ఎక్స్ లో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వివిధ ప్లాట్ఫారమ్లలో విపరీతంగా షేర్ అవుతోంది.
మీమ్ మెటీరియల్
విజయ్ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది దీనిని 'మీమ్ మెటీరియల్' గా అభివర్ణిస్తూ జోకులు పేలుస్తున్నారు. "తమిళనాడు రాజకీయాల్లో వినోదానికి కొదవ లేదు" అని ఒకరు వ్యాఖ్యానించగా.. "తానే మాస్టర్ అని పిలుచుకునే వ్యక్తి, పూలదండను బ్లాస్టర్ అనుకుని ఫాస్టర్ గా పరిగెత్తారు" అంటూ ఒక ఎక్స్ యూజర్ ఎద్దేవా చేశారు. "జోసెఫ్ విజయ్.. ఇది సినిమా కాదు, నిజ జీవితంలోకి రా" అంటూ మరికొందరు విమర్శలు గుప్పించారు.
ఫ్యాన్స్ సపోర్ట్
విజయ్ అభిమానులు మాత్రం తమ నాయకుడికి మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో కరూర్ వంటి ప్రాంతాల్లో జరిగిన కొన్ని చేదు అనుభవాలు లేదా భద్రతా పరమైన హెచ్చరికల వల్ల ఆయన అలా స్పందించి ఉండవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. "ఆయన భద్రతా సిబ్బంది ముందే అప్రమత్తంగా ఉండాల్సింది. బహిరంగంగా సైకిల్ పై వెళ్తున్నప్పుడు ఎవరైనా హఠాత్తుగా అలా దగ్గరకు వస్తే ఎవరికైనా భయం కలుగుతుంది" అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సమర్థిస్తున్నారు.
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' లీక్ కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


