అది థియేటర్ల తప్పు.. నా తప్పు కాదు.. స్పీకర్లు పేలితే అన్ని థియేటర్లలో పేలాలి కదా: అఖండ 2 సౌండ్ ట్రోల్స్పై తమన్
అఖండ 2 విషయంలో సౌండ్ మిక్సింగ్ పై వస్తున్న ట్రోల్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించాడు. అది తన తప్పు కాదని, థియేటర్లు స్పీకర్లు మార్చుకోవాలని అనడం విశేషం. డైరెక్టర్ బోయపాటితో కలిసి సింగర్ సునీత చేసిన ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడాడు.
అఖండ 2 మూవీలో తమన్ సౌండ్ పొల్యూషన్ అంటూ చాలా రోజులుగా విమర్శలు వస్తున్న సంగతి తెలుసు కదా. కొన్ని చోట్ల స్పీకర్లు పేలిపోయాయనీ వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ స్పందించాడు. తన తప్పు అయితే స్పీకర్లు అన్ని చోట్లా పేలాలి కదా అని అతడు ఎదురు ప్రశ్నించాడు.

సౌండ్ మిక్సింగ్పై తమన్ ఏమన్నాడంటే?
అఖండ 2 మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బీజీఎంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి తమన్ ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోల్స్ పై స్పందించాడు. ఈ ఇంటర్వ్యూ చేసిన సింగర్ సునీత ఈ అంశంపై మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఎన్ని థియేటర్లలో బ్లాస్ట్ అయ్యాయి అని అడిగింది.
దీనికి తమన్ స్పందిస్తూ.. “నేను అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ మధ్య చాలా థియేటర్లలో 70 ఎంఎం స్క్రీన్లు, ప్రొజెక్టర్లు మార్చారు. కానీ స్పీకర్లు మాత్రం మార్చలేదు. వాళ్లు పాత స్పీకర్లనే కొనసాగిస్తున్నారు” అని తమన్ చెప్పాడు.
చాలా మంది చెక్ చేస్తారు
మరి ఈ మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అని అడిగినప్పుడు.. వాళ్లు ఆ స్పీకర్లను మార్చాలి అని తమన్ స్పష్టం చేశాడు. “ఇక్కడ తప్పు నాది కాదు. తమన్ మిక్సింగ్ సరిగా చేయడం లేదని అంటున్నారు. కానీ నేను కేవలం వాల్యూమ్ మాత్రమే అడుగుతాను. ఎక్కడ అవసరమో అక్కడ చెబుతాను. కొన్నిచోట్ల సౌండ్ ఎక్కువగా ఉండాలి. దీనిపై అందరం నిర్ణయం తీసుకుంటారు. నేనే కాకుండా ఓ డాల్బీ మిక్సింగ్ ఇంజినీర్ వస్తాడు. తను అప్రూవ్ చేస్తేనే సౌండ్ బయటకు వెళ్తది” అని తమన్ స్పష్టం చేశాడు.
ఈ సందర్భంగా పక్కనే ఉన్న డైరెక్టర్ బోయపాటి కూడా తమన్ కు సపోర్ట్ గా మాట్లాడాడు. ఎవరో ఏదో అంటున్నారు కానీ.. ఇందులో చాలా ఉంటుందని, ఎలా పడితే అలా వాయించడం అనేది ఉండదని బోయపాటి కూడా తేల్చి చెప్పాడు.
అన్ని థియేటర్లలో పేలాలి కదా
స్పీకర్లు పేలుతున్నాయన్న విమర్శలపై స్పందిస్తూ.. పేలితే అన్ని థియేటర్లలో పేలాలి కదా అని తమన్ ప్రశ్నించాడు. థియేటర్ల వాళ్లు సరిగా మెయింటేన్ చేయడం లేదని, పాత వాటితో నడిపిస్తామంటే ఇలాంటివి జరుగుతుంటాయని అన్నాడు. కొన్ని థియేటర్లలో పాత స్పీకర్లే ఉన్నాయని, మార్చలేదని తమన్ చెప్పాడు.
ఓజీ మూవీ అప్పుడు కూడా హైదరాబాద్ లో ఓ థియేటర్ లో ట్రైలర్ చూసినప్పుడు సౌండ్ సడెన్ గా ఆగిపోయిందని తెలిపాడు. పెద్ద థియేటర్లు, కొత్తగా వచ్చి బాగా మెయింటేన్ చేస్తున్న థియేటర్లలో ఈ సమస్య రావడం లేదు కదా అని కూడా తమన్ అన్నాడు. నిజానికి అఖండ సినిమా విషయంలోనూ తమన్ పై ఇలాంటి విమర్శలే రాగా.. ఇప్పుడు సీక్వెల్ కు కూడా అవే ట్రోల్స్ వస్తుండటం గమనార్హం.

E-Paper












