ఈ సినిమా తెలుగింటి భోజనంలాగా ఉంటుంది.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ రెడీ చేస్తున్నా: తరుణ్ భాస్కర్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ తాను నటించిన లేటెస్ట్ మూవీ సంతాన ప్రాప్తిరస్తుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు.. తన డైరెక్షన్ లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది మూవీ సీక్వెల్ పైనా స్పందించాడు.
టాలీవుడ్కు ఓ డిఫరెంట్ కామెడీ టచ్ ఇచ్చిన డైరెక్టర్లలో ఒకడు తరుణ్ భాస్కర్. మంచి నటుడు కూడా. తాజాగా అతడు నటించిన మూవీ సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 14) రిలీజ్ కానుండగా.. ఇదో తెలుగింటి భోజనంలాగా ఉంటుందని తరుణ్ భాస్కర్ అనడం విశేషం. మధుర ఎంటైర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానెల్ లో మూవీ హీరో విక్రాంత్ తో కలిసి మాట్లాడాడు.

సంతాన ప్రాప్తిరస్తు మూవీపై..
హీరో విక్రాంత్ తో తరుణ్ భాస్కర్ మాట్లాడాడు. ఈ సందర్భంగా సంతాన ప్రాప్తిరస్తు మూవీ గురించి అతడు మాట్లాడుతూ.. మొదట ఈ సినిమా చేయొద్దని అనుకున్నానని, కానీ ఈ కాలంలో ఎంతో మంది ఫేస్ చేస్తున్న కిడ్స్ ప్రాబ్లెమ్ గురించి కావడంతో తర్వాత అంగీకరించినట్లు చెప్పాడు. అయితే మూవీ చేసిన తర్వాత తాను చాలా హాయిగా ఫీలయ్యానని, చూసిన తర్వాత మరింత సంతృప్తి కలిగిందని తెలిపాడు. ఈ సినిమా ఓ తెలుగింటి భోజనంలాగా ఉంటుందని అతడు అనడం విశేషం.
ఈ నగరానికి ఏమైంది సీక్వెల్పై..
నిజానికి సంతాన ప్రాప్తిరస్తు మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ అయినా కూడా మొదట సూపర్ హిట్ మూవీ ఈ నగరానికి ఏమైంది విశేషాలతోనే మొదలైంది. ఈ మూవీని తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. మూవీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే మొదటి సినిమా అంత హిట్ అయినా తర్వాత ముఖ్యంగా ఫ్యాన్స్ దానిని ఓన్ చేసుకున్న తర్వాత సీక్వెల్ తీయాలంటే కాస్త భయంగా ఉందని, వాళ్ల అంచనాలను చాలా భారీగా పెరిగిపోయానని, తాను చాలా ఒత్తిడికి గురవుతున్నానని తరుణ్ భాస్కర్ అన్నాడు. అయితే సీక్వెల్ కచ్చితంగా వస్తుందని కూడా స్పష్టం చేశాడు. ఏదో ఒక రకంగా సినిమాను తీసి ఆడియెన్స్ మీదికి వదలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పాడు.
సంతాన ప్రాప్తిరస్తు మూవీ గురించి..
చాందినీ చౌదరి, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. గత వారం ట్రైలర్ రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, అభినవ్ గోమటంలాంటి వాళ్లు తమ కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు.
సంతాన ప్రాప్తిరస్తు మూవీని సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేయగా.. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించాడు. కామెడీ, ఎమోషన్ కలగలిపి సాగిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. లోబడ్జెట్ మూవీ అయినా కూడా తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, వెన్నెల కిశోర్ లాంటి నటులు ఉండటంతో సినిమాలో నవ్వులు గ్యారెంటీ అని తేలిపోయింది.













