The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 మేకర్స్‌కు షాక్.. రిలీజ్‌పై కేరళ హైకోర్టు స్టే.. సెన్సార్ బోర్డుపై తీవ్ర అసహనం

ది కేరళ స్టోరీ 2 మూవీ రిలీజ్ పై కేరళ హైకోర్టు స్టే విధించింది. ఈ తీర్పు వెల్లడిస్తూ సెన్సార్ బోర్డుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సీబీఎఫ్‌సీ కనీసం తమ మైండ్ ను అప్లై చేయలేదని కోర్టు అనడం గమనార్హం.

Published on: Feb 26, 2026, 15:28:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివాదాస్పద మూవీ 'ది కేరళ స్టోరీ 2-గోస్ బియాండ్' సినిమాకు కేరళ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ న్యాయస్థానం గురువారం (ఫిబ్రవరి 26) నాడు మధ్యంతర స్టే విధించింది. సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో సెన్సార్ బోర్డు కనీస ఆలోచన చేయలేదని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 27న ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా.. కోర్టు తాజా ఉత్తర్వులతో దానికి బ్రేక్ పడింది.

The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 మేకర్స్‌కు షాక్.. రిలీజ్‌పై కేరళ హైకోర్టు స్టే.. సెన్సార్ బోర్డుపై తీవ్ర అసహనం
The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 మేకర్స్‌కు షాక్.. రిలీజ్‌పై కేరళ హైకోర్టు స్టే.. సెన్సార్ బోర్డుపై తీవ్ర అసహనం

ది కేరళ స్టోరీ 2 విడుదలపై స్టే

'ది కేరళ స్టోరీ 2-గోస్ బియాండ్' సినిమా విడుదలను అడ్డుకుంటూ కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం (ఫిబ్రవరి 26) నాడు జరిగిన విచారణలో ఈ సినిమా ప్రదర్శనపై మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా విడుదలను సవాలు చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ విచారించారు.

విచారణ అనంతరం ఆయన ఈ సినిమాను ప్రస్తుతానికి విడుదల చేయకూడదని స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ వివాదాస్పద సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ న్యాయస్థానం ఇచ్చిన తాజా స్టే కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది.

సెన్సార్ బోర్డు తీరుపై కోర్టు అభ్యంతరాలు

ఈ సినిమాకు సర్టిఫికేషన్ ఇచ్చే విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. కోర్టు ప్రాథమికంగా కింది అంశాలను ప్రస్తావించింది.

సినిమాకు సర్టిఫికెట్ మంజూరు చేసే సమయంలో సెన్సార్ బోర్డు కనీస బుద్ధిని, ఆలోచనను ఉపయోగించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. “సమాజంలో సామాజిక సామరస్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుపై ఉంటుంది. ఒక సినిమా వల్ల ప్రజల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటానికి కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. కానీ ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు ఆ మార్గదర్శకాలను ఏమాత్రం పాటించినట్లు కనిపించడం లేదు” అని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.

నిర్మాతలకు భారీ షాక్

ది కేరళ స్టోరీకి సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇందులో చూపించిన కొన్ని సీన్లపై సాధారణ ప్రేక్షకులతోపాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పలువురు ఫిల్మ్ మేకర్స్ కూడా విమర్శలు గుప్పించారు.

ముఖ్యంగా ఓ హిందూ అమ్మాయికి కొందరు ముస్లిం మతస్థులు బలవంతంగా బీఫ్ తినిపించే సీన్ అయితే మరీ వివాదాస్పదమైంది. దీంతో ఈ సినిమాను చూసిన తర్వాతే రిలీజ్ పై నిర్ణయం తీసుకుంటామని గతంలోనే కేరళ హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇప్పుడు రిలీజ్ పై స్టే విధించడంతో నిర్మాతలకు పెద్ద షాకే తగిలినట్లయింది. మరి ఈ మూవీ రిలీజ్ పై ఉన్న ఈ స్టే ఎన్నాళ్లు కొనసాగుతుంది? దీనిపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More