ఊహకందని రీతిలో ది రాజా సాబ్ నష్టాలు.. ప్రభాస్ కెరీర్‌లో మరో మచ్చ.. ఆ రెండు సినిమాల తర్వాత ఇదే

ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద ఫ్లాప్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది ది రాజా సాబ్. తాజా అంచనాల ప్రకారం ఈ మూవీ ఏకంగా రూ.160 కోట్ల నుంచి రూ.170 కోట్ల వరకూ నష్టపోయింది. రెబల్ స్టార్ కెరీర్లో అత్యధిక నష్టాలు చవిచూసిన సినిమాల్లో మూడో స్థానంలో ఉంది.

Published on: Jan 21, 2026, 14:45:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు 2026 ఆరంభం చేదు అనుభవాన్ని మిగిల్చింది. మారుతి దర్శకత్వంలో వింటేజ్ ప్రభాస్‌ను చూపిస్తారని ఆశించిన హారర్ కామెడీ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. జనవరి 9న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా.. మొదటి రోజు రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టినప్పటికీ.. నెగెటివ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచే కుప్పకూలిపోయింది.

ఊహకందని రీతిలో ది రాజా సాబ్ నష్టాలు.. ప్రభాస్ కెరీర్‌లో మరో మచ్చ.. ఆ రెండు సినిమాల తర్వాత ఇదే
ఊహకందని రీతిలో ది రాజా సాబ్ నష్టాలు.. ప్రభాస్ కెరీర్‌లో మరో మచ్చ.. ఆ రెండు సినిమాల తర్వాత ఇదే

రూ. 160 కోట్ల భారీ నష్టం..

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా బడ్జెట్ సుమారు రూ. 350 కోట్లు. విడుదలైన 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 203 కోట్ల గ్రాస్ (రూ. 141 కోట్ల నెట్) మాత్రమే వసూలు చేసింది. పన్నులు, ఇతర ఖర్చులు పోను డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు రూ. 160 నుంచి 170 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక నష్టాలు తెచ్చిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ప్రభాస్ ఖాతాలో మరో ప్లాప్..

బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్‌డమ్ పెరిగినప్పటికీ, బాక్సాఫీస్ ఫలితాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ మినహాయిస్తే మిగతావన్నీ నిరాశపరిచాయి. అయితే ‘రాజా సాబ్’ కంటే పెద్ద డిజాస్టర్లు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ తొలి స్థానంలో నిలుస్తుంది. ఈ సినిమాను రూ. 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. రూ. 240 కోట్ల నష్టం వచ్చింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ గా ఈ మూవీ నిలవడం గమనార్హం.

ఇక అంతకుముందు అంటే బాహుబలి 2 బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ మూవీ రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. రూ. 180 కోట్ల నష్టం వాటిల్లింది. తాజాగా వచ్చిన ది రాజా సాబ్ సుమారు రూ. 160-170 కోట్ల నష్టంతో మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉంది.

ఫ్యాన్స్ ఆశలన్నీ వాటిపైనే..

‘రాజా సాబ్’ నిరాశపరిచినప్పటికీ ప్రభాస్ లైనప్ చూసి అభిమానులు ఆశతో ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ (Fauzi) ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit) వచ్చే ఏడాది జనవరిలో రానుంది. ఈ రెండు సినిమాలు మళ్లీ ప్రభాస్‌ను బాక్సాఫీస్ బాద్‌షాగా నిలబెడతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

బాహుబలి మూవీ నుంచి ది రాజా సాబ్ వరకు ప్రభాస్ బాక్సాఫీస్ ప్రస్థానం ఎలా సాగిందో కింది టేబుల్లో చూడొచ్చు. బాహుబలి 2 తర్వాత వచ్చిన ఆరు సినిమాల్లో కేవలం రెండు మాత్రమే లాభాలు ఇవ్వగా.. మిగతావన్నీ నష్టాల్లోనే ముగిశాయి.

బాహుబలి నుంచి ప్రభాస్ బాక్సాఫీస్ రిపోర్ట్
సినిమాప్రపంచవ్యాప్తంగా వసూళ్లులాభం/నష్టం
బాహుబలి 1 650 కోట్లు+ 300 కోట్లు
బాహుబలి 2 1788 కోట్లు+ 950 కోట్లు
రాధే శ్యామ్ 150 కోట్లు- 180 కోట్లు
సాహో 451 కోట్లు- 5 కోట్లు
ఆదిపురుష్ 392 కోట్లు- 240 కోట్లు
సలార్ 618 కోట్లు+ 200 కోట్లు
కల్కి 2898 ఏడీ 1042 కోట్లు+ 180 కోట్లు
ది రాజా సాబ్ 204 కోట్లు- 170 కోట్లు
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More