Thalapathy Vijay: తమిళనాడులో రాజకీయ దుమారం రేపుతున్న సినిమా.. విజయ్ను హేళన చేస్తూ వస్తున్న మూవీకి లైన్ క్లియర్..
Thalapathy Vijay: తమిళనాడు ఎన్నికల వేళ 'టీఎన్ 2026' (TN 2026) సినిమా విడుదలకు సిద్ధమవ్వడం పెను వివాదానికి దారితీసింది. విజయ్ రాజకీయ అరంగేట్రాన్ని ఎగతాళి చేసేలా ఉన్న ఈ సినిమాకు అనుమతినిచ్చి, విజయ్ నటించిన 'జన నాయగన్' విడుదలను మాత్రం అడ్డుకోవడంపై టీవీకే (TVK) శ్రేణులు మండిపడుతున్నాయి.
Thalapathy Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్న నేపథ్యంలో.. అక్కడి రాజకీయ వాతావరణం సినిమాల చుట్టూ తిరుగుతోంది. నటీనటులపై అనుచిత వ్యాఖ్యలు, సినిమా విడుదలలో ఆలస్యం వంటి వివాదాల మధ్య ఇప్పుడు 'టీఎన్ 2026' అనే మూవీ చర్చనీయాంశంగా మారింది. నట్టి నటరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా దళపతి విజయ్, అతని రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK)ని కించపరిచేలా ఉందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ను పోలి ఉన్న 'గుల్కండ్ కుమార్'
వెటరన్ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి దర్శకత్వం వహించిన 'టీఎన్ 2026' మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో నట్టి 'గోల్డెన్ స్టార్' గుల్కండ్ కుమార్ అనే నటుడి పాత్రలో కనిపిస్తున్నాడు. టీజర్లో అతడు వేసుకున్న తెల్ల చొక్కా, బ్రౌన్ ప్యాంటు, సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్, నడిచే తీరు.. అంతా దళపతి విజయ్ను పేరడీ చేస్తున్నట్లుగా ఉంది.
ఒక నటుడు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే సమాజం ఎలా స్పందిస్తుందనేది ఈ సినిమాలో కామెడీని జోడించి చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ రాజకీయ నినాదమైన "డీఎంకే ఒక దుష్టశక్తి" అనే డైలాగ్ను కూడా ఈ టీజర్లో పేరడీ చేయడం ఆశ్చర్యపరిచింది.
'జన నాయగన్'కు లేని వెసులుబాటు దీనికెలా?
టీవీకే అభ్యర్థి ఆధవ్ అర్జున ఈ విడుదలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "విజయ్ నటించిన 'జన నాయగన్' విడుదలను ఎన్నికల కోడ్ (MCC) సాకుతో అడ్డుకున్నారు. మరి రాజకీయంగా ఇంతటి వివాదాస్పదంగా ఉన్న ఈ సినిమాను ఎన్నికలకు ముందు ఎలా విడుదల చేస్తారు? ఇది ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం కాదా?" అని ఆయన ప్రశ్నించారు. ఇది రాజకీయ కుట్రలో భాగమేనని, గతంలో ఇలాంటి ప్రయత్నాలు ఫలించలేదని ఆయన విమర్శించారు.
సోషల్ మీడియాలో కూడా విజయ్ అభిమానులు ఎన్నికల కమిషన్ తీరుపై మండిపడుతున్నారు. "విజయ్ను వెక్కిరించే సినిమాకు ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు ఎలా అనుమతినిచ్చారు? ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం కాదా?" అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇందులో తంబి రామయ్య పాత్ర విజయ్ సన్నిహితుడు బుస్సీ ఆనంద్ను పోలి ఉందంటూ నెటిజన్లు ఫోటోలను షేర్ చేస్తున్నారు.
'జన నాయగన్' కోసం విజయ్ పోరాటం
విజయ్ తన చివరి మూవీ 'జన నాయగన్' విషయంలో 'న్యాయం' కావాలని తిరుచ్చి నామినేషన్ వేళ కోరాడు. సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికేషన్ ప్రక్రియలో జాప్యం కారణంగా ఈ సినిమా జనవరిలో విడుదల కాలేదు. ఇప్పుడు సర్టిఫికేషన్ వచ్చినా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సినిమాను విడుదల చేయడానికి వీల్లేదని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు హీరో సినిమాను ఆపివేసి, మరోవైపు హీరోను ఎగతాళి చేసే సినిమాకు పచ్చజెండా ఊపడంపై తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలో నట్టితో పాటు రెడ్డిన్ కింగ్స్లీ, తంబి రామయ్య, ఎం.ఎస్. భాస్కర్, ఇళవరసు వంటి హేమాహేమీలు నటించారు. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. 'టీఎన్ 2026' సినిమా వివాదానికి కారణమేంటి?
ఈ సినిమాలో హీరో నట్టి.. విజయ్ రాజకీయ అరంగేట్రాన్ని, ఆయన మేనరిజాన్ని అనుకరిస్తూ పేరడీ పాత్ర (Spoof) చేయడమే వివాదానికి ప్రధాన కారణం.
2. విజయ్ అభిమానులు, టీవీకే నాయకులు నిరసన ఎందుకు?
విజయ్ నటించిన 'జన నాయగన్' విడుదలను ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుకున్నప్పుడు, విజయ్ను కించపరిచేలా ఉన్న ఈ సినిమాకు అదే ఎన్నికల కోడ్ వర్తించదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
3. 'టీఎన్ 2026' విడుదల తేదీ ఎప్పుడు?
ఈ చిత్రం ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


