Bandla Ganesh: చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన బండ్ల గణేష్.. కూతురి చేయి పట్టుకొని వదలకుండా.. వీడియో వైరల్
Bandla Ganesh: టాలీవుడ్ నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. తన కూతురి పెళ్లిని ఘనంగా నిర్వహించిన ఆయన.. ఆమె అప్పగింతల సమయంలో చేయి వదలకుండా గట్టిగా పట్టుకొని ఏడవడం అక్కడున్న వాళ్లను కదిలించింది.
Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి బాజాలు అత్యంత వైభవంగా మోగాయి. ఆయన ముద్దుల కూతురు జనని బండ్ల, సూర్య తేజ చిలుకూరిల వివాహ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. అయితే కూతురి అప్పగింతల సమయంలో బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్వడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

పెళ్లి వేడుక ముగిసిన తర్వాత నూతన దంపతులను కారు వరకు సాగనంపే క్రమంలో గణేష్ తన కూతురి చేతిని గుండెలకు హత్తుకుని వదిలిపెట్టడానికి నిరాకరించారు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చూసి అతిథులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. జనని కూడా తన కన్నీళ్లను ఆపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించడం అందరినీ కదిలించింది.
ఇరు రాష్ట్రాల సీఎంలు, టాలీవుడ్ స్టార్ల సందడి
ఈ గ్రాండ్ వెడ్డింగ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ దిగ్గజాలతో పాటు టాలీవుడ్ పెద్దలు పెద్ద ఎత్తున తరలిరావడంతో కళ్యాణ వేదిక తారల కాంతులతో మెరిసిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, యంగ్ సామ్రాట్ నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల, అల్లు అరవింద్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కమెడియన్ బ్రహ్మానందం, సునీల్, శివాజీ, గోపీచంద్, తేజ సజ్జ, అనిల్ రావిపూడి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి ఎంతో మంది ప్రముఖులు ఈ ఈవెంట్లో సందడి చేశారు.
బండ్ల గణేష్కి అత్యంత ఆప్తుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జులైలో జరిగిన భుజం సర్జరీ కారణంగా ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. ఆయన తరఫున సతీమణి అన్నా కొణిదెల విచ్చేసి కొత్త దంపతులకు బ్లెస్సింగ్స్ అందించారు.
తిరుమల శ్రీవారి సెట్టింగ్తో రాయల్ వెడ్డింగ్ డెకార్
ఈ ఏడాది మే నెలలో నిశ్చితార్థం చేసుకున్న జనని-సూర్య తేజ జంట, ఆగస్టు 16న సాంప్రదాయబద్ధంగా ఏడడుగులు వేశారు. రాయల్ పింక్ అండ్ గోల్డ్ కలర్ థీమ్తో కల్యాణ మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమల వేంకటేశ్వర స్వామి భారీ విగ్రహం, టెంపుల్ థీమ్ మండపంతో పాటు ఫౌంటెన్లు, ఫ్లవర్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పెళ్లి వేడుకలో పెళ్లికూతురు జనని గోల్డ్ కలర్ కాంజీవరం పట్టు చీర, డైమండ్ జ్యువెలరీలో మెరిసిపోగా.. పెళ్లికొడుకు సూర్య తేజ సాఫ్ట్ పింక్ పట్టు పంచే, కుర్తా ధరించి రాయల్ లుక్లో కనిపించారు.
నటుడిగా మొదలై బ్లాక్బస్టర్ ప్రొడ్యూసర్గా బండ్ల గణేష్ ప్రస్థానం
1996లో వచ్చిన 'వినోదం' సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గణేష్.. చిరంజీవితో 'మాస్టర్', పవన్ కళ్యాణ్తో 'సుస్వాగతం' చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల ద్వారానే మెగాస్టార్, పవన్ కళ్యాణ్లతో ఆయనకు జీవితాంతం నిలిచిపోయే అనుబంధం ఏర్పడింది.
ఆ తర్వాత పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి రవితేజతో 'ఆంజనేయులు' నిర్మించారు. పవన్ కళ్యాణ్తో 'గబ్బర్ సింగ్', జూనియర్ ఎన్టీఆర్తో 'బాద్షా', అల్లు అర్జున్తో 'ఇద్దరమ్మాయిలతో', రామ్ చరణ్తో 'గోవిందుడు అందరివాడేలే', ఎన్టీఆర్తో 'టెంపర్' లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను అందించి బ్లాక్బస్టర్ ప్రొడ్యూసర్గా టాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్యనే శివాజీతో కలిసి 'సాంప్రదాయినీ సుప్పిణీ సుద్దపూసనీ' చిత్రంలో నటించి అలరించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


