Vijay Rashmika: హైదరాబాద్ వచ్చేసిన విజయ్, రష్మిక.. సిగ్గు పడుతూ.. ఎయిర్పోర్టులోనే అభిమానుల ఘనస్వాగతం..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Vijay Rashmika) జోడీ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఉదయ్పూర్ లో పెళ్లి చేసుకొని శుక్రవారం (ఫిబ్రవరి 27) సాయంత్రం వీళ్లు నగరానికి తిరిగి వచ్చారు. మార్చి 4న వీళ్ల రిసెప్షన్ జరగనున్న విషయం తెలిసిందే.
రాజస్థాన్లోని ఉదయపూర్లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుక తర్వాత.. నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న శుక్రవారం (ఫిబ్రవరి 27) సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఈ జంటకు అభిమానులు, మీడియా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. పెళ్లి తర్వాత మొదటిసారి నగరం లోకి అడుగుపెట్టిన ఈ జంట ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడింది. రష్మిక సిగ్గుపడుతూ విజయ్ వెంట నడిచింది.

ఉదయపూర్లో రెండు సంప్రదాయాల కలయిక
విజయ్, రష్మిక పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయపూర్లోని 'ఐటీసీ మెమెంటోస్' హోటల్లో అత్యంత వైభవంగా జరిగింది. రెండు వేర్వేరు సంప్రదాయాల ప్రకారం ఈ వేడుకను నిర్వహించారు. ఉదయం 10:10 గంటలకు విజయ్ కుటుంబ ఆచారాల ప్రకారం ముహూర్తం నిర్ణయించారు. సాయంత్రం రష్మిక సొంత గడ్డ అయిన కూర్గ్ (కొడవ) సంప్రదాయం ప్రకారం మరోసారి వేడుక నిర్వహించారు.
ప్రధాని మోదీకి ప్రత్యేక ఆహ్వానం
పెళ్లికి ముందే ఈ జంట ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలిశారు. తాజాగా ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రధానికి వెండి గణేశుడి విగ్రహాన్ని బహుకరించి, మార్చి 4న హైదరాబాద్లో జరిగే తమ రిసెప్షన్కు రావాల్సిందిగా వ్యక్తిగతంగా కోరారు. ప్రధాని కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక లేఖ రాశారు.
మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్లో మార్చి 4న సాయంత్రం 7 గంటల నుంచి వివాహ విందు (రిసెప్షన్) జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ వంటి దిగ్గజాలు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా విజయ్ ఇప్పటికే ఆహ్వానం అందించినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో రికార్డుల వర్షం
"నా బెస్ట్ ఫ్రెండ్ను నా భార్యగా చేసుకున్నాను" అంటూ విజయ్, "మీ భార్య అని పిలవబడటం నాకెంతో గర్వంగా ఉంది" అంటూ రష్మిక షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. రష్మిక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్కు కేవలం 24 గంటల్లోనే 18 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. గతంలో కియారా అద్వానీ, ఆలియా భట్ పేరిట ఉన్న రికార్డులను ఈ జంట తుడిచిపెట్టేసింది.
ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్లోని తమ నివాసంలో వివాహానంతర పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత ఈ 'రణబాలి' జోడీ తమ తదుపరి ప్రాజెక్టుల షూటింగ్స్లో పాల్గొననుంది.

E-Paper












