దక్షిణాదిన వెలవెలబోతున్న వెండితెర: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎందుకు కనుమరుగవుతున్నాయి?

2025లో దేశవ్యాప్తంగా సినిమా స్క్రీన్ల సంఖ్య 3 శాతం పెరిగినప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం 1 శాతం క్షీణత నమోదైంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 100కు పైగా స్క్రీన్లు మూతపడటం లేదా మల్టీప్లెక్స్‌లుగా మారడం గమనార్హం. ఓటీటీల ప్రభావం, పెరిగిన టికెట్ ధరలు కారణాలుగా కనిపిస్తున్నాయి.

Apr 20, 2026, 14:30:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా అంటే ప్రాణం ఇచ్చే ప్రేక్షకులు ఉన్న దక్షిణాదిలో వెండితెర సందడి నెమ్మదిగా తగ్గుతోందా? తాజా గణాంకాలు అవుననే అంటున్నాయి. ఫికీ-ఈవై (Ficci-EY) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025లో ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్త స్క్రీన్లు పుట్టుకొస్తుంటే, దక్షిణాదిలో మాత్రం ఉన్న స్క్రీన్లు కనుమరుగవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.

పెద్ద హీరోల సినిమాల్లో అభిమానుల సందడి
పెద్ద హీరోల సినిమాల్లో అభిమానుల సందడి

మూతపడుతున్న సింగిల్ స్క్రీన్లు.. కారణాలేంటి?

ఒకప్పుడు ఊరికో థియేటర్ ఉండేది. కానీ ఇప్పుడు పాతకాలపు స్టాండలోన్ (సింగిల్ స్క్రీన్) థియేటర్లు నిర్వహణ భారంతో సతమతమవుతున్నాయి. ఆర్మాక్స్ (Ormax) కన్సల్టింగ్ సంస్థ నివేదిక ప్రకారం.. 2025లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చే వారి సంఖ్య (Footfalls) 18.1 కోట్లకు పడిపోయింది. గత రెండేళ్లుగా ఈ క్షీణత కొనసాగుతోంది.

దీనికి ప్రధాన కారణం పెరిగిన టికెట్ ధరలు. పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు భారీగా పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకుడు థియేటర్‌కు రావడానికి వెనకడుగు వేస్తున్నాడు. ఫలితంగా వసూళ్లు బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా, థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మాత్రం భారీగా తగ్గుతోంది.

ఓటీటీ పోటీ.. రియల్ ఎస్టేట్ ఒత్తిడి

సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటానికి కేవలం ప్రేక్షకులు తగ్గడమే కాదు, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. "నేడు థియేటర్ల నిర్వహణ ఖర్చు విపరీతంగా పెరిగింది. మరోవైపు ఓటీటీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అందుకే చాలా మంది యజమానులు తమ థియేటర్లను గోడౌన్లుగానో లేదా ఫంక్షన్ హాళ్లుగానో మారుస్తున్నారు" అని స్వతంత్ర సినీ విశ్లేషకులు శ్రీధర్ పిళ్ళై పేర్కొన్నారు.

ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో స్థలాల విలువ పెరగడంతో, పాత థియేటర్లను కూలగొట్టి షాపింగ్ మాల్స్ లేదా అపార్ట్‌మెంట్లు కట్టడం లాభదాయకంగా మారుతోంది.

మల్టీప్లెక్స్‌ల వైపు మొగ్గు

అయితే, ఇదంతా నష్టం మాత్రమే కాదు.. ఒక రకమైన 'నిర్మాణాత్మక మార్పు' (Structural Recalibration) అని కూడా చెప్పవచ్చు. 800 నుండి 1000 సీట్లు ఉన్న పాత థియేటర్లను నింపడం నేటి కాలంలో కష్టమవుతోంది. అందుకే వీటిని 100-200 సీట్ల సామర్థ్యం ఉన్న చిన్న చిన్న మల్టీప్లెక్స్ స్క్రీన్లుగా మారుస్తున్నారు. క్యూబ్ సినిమా (Qube Cinema) కో-ఫౌండర్ వి. సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. "పెద్ద స్క్రీన్ల కంటే చిన్న మల్టీప్లెక్స్ స్క్రీన్లు నిర్వహించడం సులభం. దీనివల్ల ఎగ్జిబిటర్లు ఒకేసారి ఎక్కువ సినిమాలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది" అని వివరించారు.

సినిమా భవిష్యత్తు ఏంటి?

దక్షిణాదిలో సినిమా కల్చర్ మారబోతోంది. కేవలం స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పుడే థియేటర్లు కళకళలాడటం, మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉండటం వల్ల చిన్న థియేటర్లు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలో షేర్లు డిమాండ్ చేయడం కూడా చిన్న థియేటర్ల యజమానులకు శాపంగా మారింది. రాబోయే రోజుల్లో సింగిల్ స్క్రీన్ల స్థానంలో కేవలం మల్టీప్లెక్స్ అనుభవం మాత్రమే మిగిలేలా కనిపిస్తోంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More