Yash Fan: అభిమాని ఆత్మహత్య చేసుకొని చనిపోయినా వెళ్లని యశ్.. కారణం ఇదేనట.. గొప్ప ఆలోచనే
Yash Fan: రాకింగ్ స్టార్ యశ్ తన అభిమాని ఆత్మహత్య ఘటనపై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు స్పందించారు. ఆ అభిమాని చివరి కోరిక మేరకు తాను అంత్యక్రియలకు వెళ్లాల్సి ఉన్నా.. వెళ్లకపోవడం వెనుక ఉన్న అసలు కారణమేంటో వెల్లడించారు.
Yash Fan: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన అభిమాని సూసైడ్ ఘటనపై తొలిసారి స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రాణాలు తీసుకున్న అభిమాని అంత్యక్రియలకు తాను ఎందుకు హాజరు కాలేదో చెప్పారు. 'ఆప్ కీ అదాలత్' టాక్ షోలో పాల్గొన్న యశ్.. తన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించడంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

2021 సూసైడ్ ఘటన.. అసలు ఏం జరిగింది?
2021లో కర్ణాటకలోని మండ్య జిల్లా కొడిదొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల రామకృష్ణ అనే యశ్ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్లో తన అంత్యక్రియలకు హీరో యశ్ తో పాటు కర్ణాటక నాయకుడు సిద్ధరామయ్య హాజరుకావాలని కోరుకున్నాడు. ఆ సమయంలో సిద్ధరామయ్య అంత్యక్రియలకు వెళ్లినప్పటికీ యశ్ మాత్రం వెళ్లలేదు.
ఈ విషయంపై టీవీ షోలో ప్రశ్నించగా యశ్ ఎంతో భావోద్వేగంగా సమాధానమిచ్చారు. అభిమాని మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది.. చాలా బాధపడ్డాను అని యశ్ చెప్పారు. అయితే తాను ఆ అంత్యక్రియలకు వెళ్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించినట్లు తెలిపారు.
దూరంగా ఉండటానికి అదే కారణం
"నేను కనుక ఆ అంత్యక్రియలకు వెళ్తే, ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే హీరో వస్తాడనే తప్పుడు ఆలోచన మిగతా ఫ్యాన్స్ మనసుల్లోకి వస్తుంది. ఆ మైండ్సెట్ ఎంతో ప్రమాదకరమైనది. చనిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్లి సాధించేది ఏముంటుంది? అలాంటి చర్యలను ప్రోత్సహించడం ఎంతమాత్రం సరికాదు" అని యశ్ స్పష్టం చేశారు.
అభిమానులు జీవితంలో ఏదైనా సాధించి నన్ను కలవాలని కోరుకుంటే తప్పకుండా వెళ్తానని యశ్ అన్నారు. "నా ఫ్యాన్స్ జీవితంలో ఏదైనా గొప్ప విజయం సాధించి పిలిస్తే, నా సమయం కుదిరితే ఖచ్చితంగా వెళ్తాను. కానీ ఇలా ప్రాణాలు తీసుకోవడాన్ని ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తే అది భవిష్యత్తులో మరికొందరిపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. అందుకే మనసు రాయి చేసుకుని వెళ్లలేదు" అని వెల్లడించారు.
కేజీఎఫ్ సంచలనం.. 'టాక్సిక్'తో రాకింగ్ కంబ్యాక్
'కేజీఎఫ్ ఛాప్టర్ 1' (2018), 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' (2022) సినిమాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఊచకోత కోసిన రాకింగ్ స్టార్ యశ్.. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) షూటింగ్లో బిజీగా ఉన్నారు. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా లాంటి టాప్ హీరోయిన్లు నటిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్' పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
రామాయణంలో 'రావణుడిగా' యశ్ విశ్వరూపం
'టాక్సిక్' తో పాటు నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ వండర్ 'రామాయణం' (Ramayana)లో యశ్ 'రావణాసురుడి' పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు.
ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఫస్ట్ పార్ట్ 2026 దివాళి కానుకగా గ్రాండ్గా రిలీజ్ కానుండగా, సెకండ్ పార్ట్ 2027 దివాళికి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


